సామాన్యులెవరూ క్రిప్టో జోలికి వెళ్లొద్దు

సామాన్యులెవరూ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టవద్దని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ రామసుబ్రమణియమ్‌ గాంధీ సూచించారు. వాటి విలువల్లో వచ్చే ఆటుపోట్లతో కలిగే నష్టాలను వారు తట్టుకోలేరని ఆయన అన్నారు. ‘‘క్రిప్టోలపై ప్రజలు సంపాదించిన

Updated : 27 Feb 2022 06:00 IST

వాటివల్ల వచ్చే నష్టాలను భరించడం కష్టం
కేంద్రం తీసుకురాబోతున్న డిజిటల్‌ కరెన్సీతో ఎన్నో ప్రయోజనాలు
ఈనాడు, ఈటీవీ భారత్‌ ఇంటర్వ్యూలో రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ రామసుబ్రమణియమ్‌ గాంధీ
ఎన్‌. విశ్వప్రసాద్‌
ఈనాడు - హైదరాబాద్‌


క్రిప్టోల ద్వారా త్వరగా ధనికులం కావొచ్చని ఎవరైనా దీనిలోకి దిగితే వారు జూదానికి సిద్ధపడినట్లే. ఇందులో సొమ్ములు పెట్టాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. నష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి చాలా ముఖ్యం. వాటిని భరిస్తూనే జీవితాన్ని సాఫీగా గడపగలగాలి. బాగా ఆస్తులు, విపరీతమైన ఆదాయాలు ఉన్నవారికే ఇది సాధ్యం.


సామాన్యులెవరూ క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడి పెట్టవద్దని రిజర్వుబ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్‌ రామసుబ్రమణియమ్‌ గాంధీ సూచించారు. వాటి విలువల్లో వచ్చే ఆటుపోట్లతో కలిగే నష్టాలను వారు తట్టుకోలేరని ఆయన అన్నారు. ‘‘క్రిప్టోలపై ప్రజలు సంపాదించిన ఆదాయంపై వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను విధించనున్నట్లు బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. దీని అర్థం ఈ వాణిజ్యానికి ప్రభుత్వం చట్టపరంగా ఆమోదం తెలిపినట్లే. అయితే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులకే ఇది పరిమితం. వస్తువుల కొనుగోలుకు మారకద్రవ్యంగా వాటిని వాడరాదని ప్రజలు గుర్తించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకురాబోతున్న డిజిటల్‌ కరెన్సీ చాలా ఉపయోగకరమని అన్నారు. క్రిప్టోలపై వచ్చే ఆదాయాలపై పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో దీనికి సంబంధించిన వివిధ అంశాలను ఆయన ఈనాడు, ఈటీవీ భారత్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

ఈ మధ్య క్రిప్టో యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రకటనను ఎలా చూడాలి?

క్రిప్టోలపై పన్ను వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం అంటే ఈ కరెన్సీ క్రయవిక్రయాలు చట్టవ్యతిరేకం కాదని అర్థం. ఈ వ్యవహారాలను ఆమోదిస్తున్నట్లు ప్రత్యక్షంగా ప్రకటించడమే. అయితే క్రిప్టో కరెన్సీల, ఆస్తుల కొనుగోళ్లు.. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను వేసేవరకే కేంద్ర నిర్ణయం పరిమితంగా వర్తిస్తుంది. అంతేకాని క్రిప్టోను ఇతర సరకుల కొనుగోలుకు ఒక కరెన్సీగా, ఒక చెల్లింపు సాధనంగా ఉపయోగించడాన్ని ప్రభుత్వం అనుమతించలేదు. కేంద్ర నిర్ణయాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అలాగే క్రిప్టో యాప్‌ల డౌన్‌లోడ్‌లు పెరిగాయనడానికి ఆధారంగా ఎలాంటి గణాంకాలూ లేవు. ప్రభుత్వ ప్రకటన వల్ల వెంటనే పెద్ద మార్పులు వస్తాయని నేను అనుకోవడంలేదు.

తాజా పరిణామాలతో ద్రవ్యపరమైన విధానాల విషయంలో రిజర్వు బ్యాంకుకు ఉన్న విశేషాధికారాలపై ఎలాంటి ప్రభావం ఉండొచ్చు?
క్రిప్టోను వస్తువుల కొనుగోళ్లకు ఒక చెల్లింపు సాధనంగా అనుమతిస్తే దేశ ద్రవ్య సుస్థిరతపై తప్పకుండా ప్రభావం చూపుతుంది.

అప్పుడు ఉత్పన్నమయ్యే పర్యవసానాలు ఏమిటి?

ప్రధాన స్రవంతిలోని ఖాతాలతో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా వసూళ్లు, చెల్లింపులు జరిగితే దేశ ద్రవ్యవిధానాన్ని నిర్వహించడంలో కొన్ని ఇబ్బందులుంటాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో.. ద్రవ్య సరఫరాను పర్యవేక్షించడంలో రిజర్వు బ్యాంకుకు ఉండే సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతుంది.

ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వచ్చాక ఆర్థికపరమైన, ద్రవ్యపరమైన స్థిరత్వాన్ని కాపాడటంలో  కేంద్రానికి, ఆర్‌బీఐకి ఎరురయ్యే సమస్యలేంటి.?

చట్టపరంగా గుర్తింపు ఉందని.. దీంతో మనం ఏదైనా చేయవచ్చు అనే అపోహ ప్రజల్లోకి వెళ్తే తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయి. అందుకే క్రిప్టోను ఒక మారకద్రవ్యంగా మన దేశంలో అనుమతించరాదని రిజర్వుబ్యాంకు తన అభిప్రాయాన్ని పదేపదే ప్రకటిస్తోంది.

ప్రస్తుత పరిణామాలతో అతి త్వరగా డబ్బులు సంపాదించాలనే మనస్తత్వం ప్రజల్లో పెరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు.?

క్రిప్టోలకు సంబంధించి అత్యంత ప్రతికూల అంశం ఏమిటంటే వాటి విలువల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులుంటాయి. గత నెలలో వచ్చిన మార్పులనే చూస్తే... బిట్‌ కాయిన్‌ విలువ ఒకసారి 42 వేల డాలర్ల నుంచి 35 వేల డాలర్లకు పడింది. మళ్లీ 44 వేల డాలర్లకు పెరిగింది. తర్వాత మళ్లీ పడింది. ఈ తరహా హెచ్చుతగ్గులు ఏమాత్రం మంచివికాదు. సాధారణ ప్రజలు వీటిని తట్టుకోలేరు.

ఇతర దేశాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?

అనేక దేశాల్లో ప్రభుత్వాలు, కేంద్రీయ బ్యాంకులు అధికారిక డిజిటల్‌ కరెన్సీని తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. క్రిప్టో కరెన్సీలకు మూలాధారమైన బ్లాక్‌చెయిన్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం ఇది. ఈ సాంకేతికత భద్రత పరంగా ఉన్నతమైంది. ప్రపంచంలోని ప్రభుత్వాలు ఈ సాంకేతికతను సమర్థంగా ఉపయోగించుకుంటే దానివల్ల ప్రయోజనాలను పొందవచ్చు.

డిజిటల్‌ కరెన్సీ రూపురేఖలు ఎలా ఉంటాయి?

దీనికి భౌతిక రూపం ఉండదు. అంతా ఆన్‌లైన్‌ వ్యవహారమే. ఉదాహరణకు ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి మరొకరికి చెల్లింపులు జరిపితే ఆ నగదు ఆ వ్యక్తి ఖాతాలో జమవుతుంది. డిజిటల్‌ కరెన్సీ చెల్లింపుల్లో బ్యాంకుల ప్రమేయముండదు. మనం ఆర్‌బీఐ నుంచి రానున్న డిజిటల్‌ కరెన్సీ తీసుకుంటే మామూలు కరెన్సీ మాదిరే ఆన్‌లైన్‌ ద్వారా ఎవరికికావాలంటే వారికి నేరుగా పంపొచ్చు.

భారత్‌ త్వరలోనే డిజిటల్‌ కరెన్సీని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించారు. దీని మంచి చెడుల గురించి మీరేం చెబుతారు?

ఇప్పుడే ఏమీ చెప్పలేం. ప్రైవేటు క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెడితే లాభాలు పొందవచ్చనే అభిప్రాయం ఈరోజు ప్రపంచం అంతా ఉంది. ప్రభుత్వ అధికారిక డిజిటల్‌ కరెన్సీవల్ల సొంత దేశంలో ఏ వ్యక్తీ అలాంటి ప్రయోజనాలను పొందలేడు. విలువ సాధారణ కరెన్సీతో సమానంగానే  ఉంటుంది. అందువల్ల మన పౌరులు తమ నగదును డిజిటల్‌ కరెన్సీలోకి మార్చుకున్నంత మాత్రాన లాభాలను పొందలేరు.

* అధికారిక డిజిటల్‌ కరెన్సీ వస్తే ప్రజలకు సౌకర్యవంతమైన ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. కాగితపు కరెన్సీని కానీ, ఇప్పుడు వాడే ఈ వాలెట్స్‌ను కూడా ప్రజలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ఈ వాలెట్స్‌కు ఉన్న భద్రత కంటే ఎక్కువ భద్రత డిజిటల్‌ కరెన్సీకి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు