నామాపై ఈడీ కేసులో యథాతథస్థితి

రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో పాటు తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కుమారుడు పృథ్వితేజలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసు విచారణపై యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

Updated : 04 Feb 2023 05:12 IST

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో పాటు తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కుమారుడు పృథ్వితేజలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన కేసు విచారణపై యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈడీ నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ నాగేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. మధుకాన్‌ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌ బ్యాంకుల నుంచి రూ.360 కోట్ల రుణాలను పొంది నిధులను పక్కదారి పట్టించినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు విచారణ చేపట్టింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది. నామా నాగేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఝార్ఖండ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులో నామా నాగేశ్వరరావు, ఆయన కుమారుడిని నిందితుడిగా పేర్కొనలేదన్నారు. మదన్‌లాల్‌ చౌదరి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రధాన కేసులో నిందితులుగా లేనివారిపై ఈడీ కేసు కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ వాదనలు వినిపించడానికి వస్తున్నారని, గడువు కావాలని న్యాయవాది కోరడంతో విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ, కేసుపై యథాతథస్థితిని కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని