ట్యాపింగ్‌ పాపంలో కీలక వికెట్‌

ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 29 Mar 2024 08:15 IST

టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు అరెస్ట్‌
ఫోన్‌ట్యాపింగ్‌.. హవాలా దందాలపై సుదీర్ఘ విచారణ
క్షేత్రస్థాయిలో అనధికారిక ఆపరేషన్లపై ఆరా
5 రోజుల పోలీస్‌ కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. గురువారం ఉదయం బంజారాహిల్స్‌ ఠాణాకు వచ్చిన ఆయన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ నేతృత్వంలోని దర్యాప్తు బృందం రాత్రి వరకు విచారించింది. అనంతరం అరెస్ట్‌ చేసింది. శుక్రవారం ఉదయం ఆయన్ని న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. రాధాకిషన్‌రావును విచారిస్తున్న సమయంలో ఠాణా గేట్లు మూసేసి గోప్యత పాటించారు. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ)లో పనిచేసిన సమయంలో డీఎస్పీ(సస్పెండెడ్‌) దుగ్యాల ప్రణీత్‌రావు ఫోన్‌ట్యాపింగ్‌ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్‌రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతోపాటు రాధాకిషన్‌రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇళ్లలో కొద్దిరోజుల క్రితం సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను అరెస్ట్‌ చేయగా.. మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురూ విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుక్‌అవుట్‌ నోటీస్‌లు జారీ చేశారు.

సుదీర్ఘ విచారణ

అనూహ్యంగా రాధాకిషన్‌రావు గురువారం ఉదయం పోలీసుల ఎదుటికి వచ్చారు. బోయినపల్లిలోని తన ఇంటి నుంచి వచ్చి వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ను కలిశారు. ఈ క్రమంలో ఫోన్‌ట్యాపింగ్‌ అంశంలో ప్రణీత్‌రావుకు రాధాకిషన్‌రావు ఇచ్చిన ఆదేశాలు.. ఆయన నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఎవరి సూచనల మేరకు ఫోన్‌ట్యాపింగ్‌ చేయాలని ప్రణీత్‌రావుకు ఆదేశాలిచ్చారని రాధాకిషన్‌రావును ఆరా తీశారు. ఫోన్‌ట్యాపింగ్‌ సమాచారంతో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేపట్టారు? హవాలా లావాదేవీల క్రమంలో నిర్వహించిన దాడుల్లో ఏం జరిగింది? పలువురు వ్యాపారులను బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? అనే అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు, టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌ఐబీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన గట్టుమల్లును పోలీసులు గురువారం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రశ్నించి.. వాంగ్మూలం నమోదు చేశారు. తననెందుకు అదుపులోకి తీసుకున్నారని ఎదురు ప్రశ్నించడంతో ఓ ఉన్నతాధికారి తనదైన శైలిలో విచారించినట్లు ప్రచారం జరిగింది.

ఉద్యోగ విరమణ పొందినా ఓఎస్డీగా విధులు

హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావుతోపాటు ఆయన బృందంపై పలు ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థులను రాజకీయంగా తమకు అడ్డు తొలగించుకునే లేదా దారికితెచ్చే బాధ్యతను టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగానే ఆరోపించేవి. రాధాకిషన్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. రాధాకిషన్‌రావు మల్కాజిగిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్‌ నేత ఆత్మహత్యకు కారకులయ్యారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కేసు నుంచి బయటపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టాస్క్‌ఫోర్స్‌లో కీలకంగా వ్యవహరించారు. నగర కొత్వాల్‌గా ఎవరున్నా ప్రభుత్వ అండదండల కారణంగా రాధాకిషన్‌రావుకే ప్రాధాన్యం ఉండేది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాతా రెండు విడతలుగా ఆయనే ఓఎస్డీగా కొనసాగడం వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాధాకిషన్‌రావుపై అప్పటి కమిషనర్‌ సందీప్‌ శాండిల్య ఎన్నికల కమిషన్‌కు ప్రత్యేక నివేదిక పంపించడంతో ఆయనను టాస్క్‌ఫోర్స్‌ బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

అదుపులో మరికొందరు పోలీసులు

మరో ముగ్గురు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలోనే వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో వీరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుకు డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తితోపాటు ఓ కానిస్టేబుల్‌ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 4న ఎస్‌ఐబీలో హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేయడంతోపాటు వాటిని మూసీ నదిలో పారేయడంలో వీరి ప్రమేయమున్నట్లు తెలుస్తోంది.

అదనపు ఎస్పీలకు ఐదు రోజుల కస్టడీ

ఈ కేసులో ఇప్పటికే అరెస్టయి చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి ఏప్రిల్‌ 2 వరకు కస్టడీ విధించింది. ప్రణీత్‌రావును పోలీస్‌ కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 12న అరెస్ట్‌ చేశారని, ఇప్పటికే 14 రోజుల గడిచిన నేపథ్యంలో పోలీస్‌ కస్టడీకి ఇవ్వొద్దంటూ ప్రణీత్‌రావు తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.


అజ్ఞాతంలోకి బేగంబజార్‌ వ్యాపారులు

రాధాకిషన్‌రావు, గట్టుమల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే బేగంబజార్‌లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తరచూ బేగంబజార్‌ ప్రాంతంలో సోదాలు నిర్వహించేవారు. ఆ ప్రాంతంలో గంజాయి, హవాలా దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై దాడులు చేసేవారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులతో ఒకరిద్దరు టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ అధికారులకు సాన్నిహిత్యం ఏర్పడిందనే ప్రచారముంది. ఆ క్రమంలో వారితో ఆర్థిక లావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలున్నాయి. రాధాకిషన్‌రావు, గట్టుమల్లులను విచారిస్తున్న విషయం బయటికి పొక్కగానే వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిఉంటారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని