ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌

భారత్‌తో తాము శాంతిని కోరుకుంటున్నామని పాకిస్థాన్(Pakistan) ఆపద్ధర్మ ప్రధాని వ్యాఖ్యలు చేశారు. శాంతి నెలకొనాలంటే ఈ మూడు పనులు చేయండంటూ ఆయన మాటలకు భారత్‌ బదులిచ్చింది.

Updated : 23 Sep 2023 14:46 IST

న్యూయార్క్‌: అంతర్జాతీయ వేదికలపై భారత్‌(India)పై విషంకక్కి.. దాయాది దేశం పాకిస్థాన్‌(Pakistan) ప్రతిసారి అబాసుపాలవుతూనే ఉంటుంది. మన దౌత్యవేత్తల చేతిలో గట్టి దెబ్బలు తింటున్నా.. దాని వైఖరిలో మాత్రం మార్పు కనిపించదు. తాజాగా న్యూయార్క్‌లో ఐరాస 78వ సర్వ ప్రతినిధి సమావేశాల్లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి మనదేశం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాక్‌ చేయాల్సిన మూడు పనుల గురించి చెప్పింది.

పాకిస్థాన్‌ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ కాకర్‌(Anwar Ul Haq Kakar) ఐరాస(UN) సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనిపై భారత్ స్పందిస్తూ..‘నిరాధార ఆరోపణలు, తప్పుడు ప్రచారంతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేయడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. మానవ హక్కుల విషయంలో తన దారుణమైన రికార్డు నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చడానికే ఈ కుయుక్తులని అందరికీ తెలుసు. జమ్మూకశ్మీర్‌(Jammu and Kashmir), లద్దాఖ్‌ ప్రాంతాలు భారత్‌లోని అంతర్భాగాలని మేం పునరుద్ఘాటిస్తున్నాం. అక్కడి విషయాలు మా అంతర్గతం. మా విషయాలపై మాట్లాడటానికి పాకిస్థాన్‌కు ఎలాంటి హక్కు లేదు. దక్షిణాసియాలో శాంతియుత పరిస్థితుల కోసం పాక్‌ మూడు పనులు చేయాల్సి ఉంది. ఒకటి.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించొద్దు. ఉగ్రకార్యకలాపాలను నిలిపివేయాలి. రెండు.. తన దురాక్రమణలో ఉన్న భారత భూభాగాలను వెంటనే ఖాళీ చేయాలి. మూడు.. పాకిస్థాన్‌లో మైనార్టీల హక్కుల ఉల్లంఘనను అరికట్టాలి’ అని గట్టి బదులిచ్చింది. 

కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్‌ మాజీ అధికారి

ఇదివరకు అన్వర్ కాకర్ మాట్లాడుతూ.. భారత్‌తో పాకిస్థాన్‌ శాంతిని కోరుకుంటోందని, రెండు దేశాల మధ్య శాంతికి కశ్మీర్‌ కీలకమంటూ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ఉన్నచోట చర్చలకు తావులేదని భారత్‌ ప్రభుత్వం పాక్‌కు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఇక.. ఈ సర్వప్రతినిధి సమావేశాలకు భారత్ తరఫున ప్రధాని మోదీ(Modi) స్థానంలో విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరవుతారు. ఆయన సెప్టెంబర్ 26న ప్రసంగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని