Imran Khan: అరెస్టు అక్రమం.. ఇమ్రాన్‌ విడుదలకు పాక్‌ సుప్రీంకోర్టు ఆదేశం

ఎన్‌ఏబీ కస్టడీలో ఉన్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan)ను గంటలోపు కోర్టు ఎదుట హాజరుపర్చాలని దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆయన్ను అరెస్టు చేసిన తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Published : 11 May 2023 19:27 IST

ఇస్లామాబాద్‌: మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు అక్కడి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఇమ్రాన్‌ను అవినీతి నిరోధక విభాగం (National Accountability Bureau) చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. కోర్టు ప్రాంగణంలో ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదన్న న్యాయస్థానం.. దేశంలో శాంతి నెలకొనాలని కోరుకుంటున్నామని పేర్కొంది. అదేవిధంగా శుక్రవారం నాడు ఇస్లామాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని.. ఆ న్యాయస్థానం నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది.

తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ సుప్రీంకోర్టు (Pak Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై పాక్‌ చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అతా బందియాల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఇస్లామాబాద్‌ హైకోర్టు ప్రాంగణం నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయడంపై ఎన్‌ఏబీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రార్‌ అనుమతి లేకుండా కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించి ఆయన్ను అరెస్టు చేయడం కోర్టు ధిక్కరణే అని మండిపడింది. ఇమ్రాన్‌ను గంటలోగా న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని జాతీయ జవాబుదారీ బ్యూరో(ఎన్‌ఏబీ)ను ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు వెంటనే ఆయన్ను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

‘90 మంది కోర్టు ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశిస్తే అప్పుడు న్యాయస్థానం మర్యాద ఏమవుతుంది..? కోర్టు లోపలే ఓ వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారు? అరెస్టుకు ముందు వారు కోర్టు రిజిస్ట్రార్‌ నుంచి అనుమతి తీసుకోవాలి. అలా చేయలేదు. ఇది పూర్తిగా కోర్టు ధిక్కరణే. అరెస్టు క్రమంలో న్యాయస్థానం సిబ్బంది కూడా వేధింపులను ఎదుర్కొన్నారు’ అని విచారణ సందర్భంగా ఎన్‌ఏబీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అల్‌ ఖదీర్‌ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను పారామిలిటరీ రేంజర్లు మంగళవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు వచ్చిన ఆయనను.. పాక్‌ రేంజర్లు చుట్టుముట్టి బలవంతంగా లాక్కెళ్లారు. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగడంతోపాటు పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని