Pakistan: ‘పాక్‌ను రక్షించాల్సిందే’.. సంకీర్ణం ఏర్పాటుపై పీపీపీ, పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటన!

Pakistan: పాకిస్థాన్‌లో ఏ పార్టీకీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఆధిక్యం రాలేదు. దీంతో పీపీపీతో కలిసి సంకీర్ణ సర్కార్‌ ఏర్పాటు చేయడానికి పీఎంఎల్‌-ఎన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 

Updated : 12 Feb 2024 10:14 IST

Pakistan | లాహోర్‌: పాకిస్థాన్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని ‘పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (PML-N)’ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ‘పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)’తో జరుపుతున్న చర్చల్లో పురోగతి సాధించినట్లు కనిపిస్తోంది. పీపీపీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ, అధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీతో తమ అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం జరిపిన చర్చల్లో చాలా అంశాలపై సఖ్యత కుదిరినట్లు పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. ‘‘రాజకీయ అనిశ్చితి నుంచి దేశాన్ని రక్షించేందుకు ఇరు పార్టీల మధ్య సూత్రప్రాయంగా అంగీకారం కుదిరింది’’ అని పేర్కొంది.

త్వరలో జరగబోయే సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో పీపీపీ (PPP) నాయకత్వం వారి ప్రతిపాదనలను తమ ముందు ఉంచుతుందని పీఎంఎల్‌-ఎన్‌ (PML-N) విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. యావత్‌ దేశ పరిస్థితిని సమీక్షించి.. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తొలగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే భవిష్యత్‌లో రాజకీయ సహకారంపైనా వివరంగా చర్చించినట్లు వెల్లడించింది. ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు తమ పక్షానే నిలిచారని చెప్పుకొచ్చింది. పీఎంఎల్‌-ఎన్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించినట్లు పీపీపీ సైతం ధ్రువీకరించింది.

ఆదివారం పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఫలితాల ప్రకారం, 265 జాతీయ అసెంబ్లీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌కు 75 దక్కాయి. ఇమ్రాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (PTI) పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు అత్యధికంగా 101 స్థానాలు సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌ అధికారంలోకి రావాలంటే 54 సీట్లలో విజయం సాధించిన పీపీపీ మద్దతు తప్పనిసరి. రెండు పార్టీలు కలిస్తే 129 సీట్లు అవుతాయి. 17 సీట్లు నెగ్గిన ఎంక్యూఎం-పీతోనూ నవాజ్‌ షరీఫ్‌ చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 133 సీట్లు అవసరం. ఈ మూడు పార్టీలు కలిస్తే అధికారం సొంతమవుతుంది. ఈ పొత్తుకు ఇంకా ఎంక్యూఎం-పీ పచ్చజెండా ఊపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని