Pakistan: పాకిస్థాన్‌లో నవాజ్‌ సంకీర్ణమే.. పొత్తుకు భుట్టో పార్టీ ఓకే..!

రెండురోజుల నుంచి లెక్కింపు ప్రక్రియ జరుగుతున్నప్పటికీ.. పాకిస్థాన్‌లో ఇప్పటికీ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. ఈ క్రమంలో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ (Nawaz Sharif) నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 

Updated : 10 Feb 2024 12:21 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ).. అటు పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) (PML) వేటికవే విజయాన్ని ప్రకటించుకున్నాయి. ప్రస్తుతానికి ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువచ్చేందుకు మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ (Nawaz Sharif) నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(PPP) కలిసి పనిచేయాలని అంగీకారానికి వచ్చాయి. దీనిలో భాగంగా ఇరు పక్షాలకు చెందిన నేతలు శుక్రవారం రాత్రి లాహోర్‌లో సమావేశమయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుపై తమ అభిప్రాయాలను పంచుకున్నారని తెలిపింది.

లండన్‌ ప్లాన్‌ విఫలమైంది: ఇమ్రాన్‌

ఇదిలా ఉండగా.. తమ పార్టీ అగ్రనేత ఇమ్రాన్‌ ఖాన్‌ ఏఐ జనరేటెడ్ ప్రసంగాన్ని పీటీఐ పార్టీ విడుదల చేసింది. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించినట్లుగా ఆ వీడియోలో ఉంది. ‘మీ ఓట్ల వల్ల లండన్‌ ప్లాన్‌ విఫలమైంది. పాకిస్థానీ ప్రజలు ఆయన్ను (నవాజ్‌ షరీఫ్‌ను ఉద్దేశించి) విశ్వసించడం లేదు. మీ ఓటు శక్తిని ప్రతిఒక్కరూ చూశారు. ఇప్పుడు పోలింగ్‌ ఫలితాన్ని రక్షించుకోవాల్సి ఉంది. భారీగా నమోదైన పోలింగ్‌ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. ఆయన పార్టీ 30 సీట్లలో వెనకబడి ఉన్నప్పటికీ విక్టరీ ప్రసంగం చేసిన తెలివితక్కువ నాయకుడు షరీఫ్‌’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.

2024లో అమెరికా అధ్యక్ష స్థానంలో మహిళ: నిక్కీ హేలీ

ఎన్నికల నిర్వహణ విజయవంతమైదంటూ ఆర్మీ చీఫ్ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు, ప్రజాస్వామ్యం ప్రజలకు సేవ చేయడానికేనని అన్నారు. ‘స్వప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. 25 కోట్ల మంది ప్రజల కోసం అరాచక పాలనకు దూరంగా స్థిరమైన ప్రభుత్వం ఏర్పడాలి’ అని వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్‌ పార్టీ కూడా కూడా మిత్ర పక్షాలతో చర్చలు జరుపుతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. ఇమ్రాన్‌ బలపరిచిన అభ్యర్థులు 99 సీట్లలో విజయం సాధించారు. పీఎంఎల్‌-ఎన్‌ 71, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) 53, ఇతర చిన్న పార్టీలు 27 స్థానాలను దక్కించుకున్నాయి. ఇంకా 15 సీట్లలో ఫలితం వెల్లడికావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఓటింగ్‌ ముగిసి 40 గంటలు గడుస్తున్నా ఇంతవరకు ఎన్నికల ఫలితాలపై స్పష్టమైన ప్రకటన రాలేదు. దీనిపై అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని