Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్‌.. సొంతంగా సబ్‌మెరైన్‌ తయారీ..!

చైనాకు షాకిచ్చేలా తైవాన్‌ కీలక ప్రకటన చేసింది. తాము సొంతంగా సబ్‌మెరైన్‌ తయారు చేసుకొన్నట్లు ప్రకటించింది. జలమార్గంలో దాడి చేసి తైవాన్‌ను ఆక్రమించాలన్న చైనా వ్యూహాలకు ఇది పెద్ద అడ్డంకిగా మారనుంది. 

Updated : 28 Sep 2023 16:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తైవాన్‌(Taiwan)ను ఆక్రమించుకోవాలని కలలు కంటూ బ్లూప్రింట్‌ను విడుదల చేసిన చైనా(China)కు భారీషాక్‌ తగిలింది. తైవాన్‌ సొంతంగా తయారు చేసిన తొలి జలాంతర్గామిని ఆవిష్కరించింది. గురువారం పోర్టు సిటీ ఖోషింగ్‌లో ఈ జలాంతర్గామిని అధ్యక్షురాలు త్సాయ్‌ యింగ్‌ వెన్‌ ఆవిష్కరించారు. మరికొన్నేళ్లలో చైనా ఆక్రమిస్తుందని అమెరికా హెచ్చరికలు జారీ చేసిన సమయంలో తైవాన్‌ సొంతంగా ఆయుధాలు నిర్మించడం గమనార్హం. 

ఈ సందర్భంగా తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి మాట్లాడుతూ ‘‘చరిత్ర ఈ రోజును ఎప్పటికీ గుర్తుంచుకొంటుంది. గతంలో సొంతంగా జలాంతర్గామి నిర్మించడం దాదాపు అసాధ్యం. కానీ, ఇప్పుడు దానిని సుసాధ్యం చేశాము’’ అని గర్వంగా ప్రకటించారు. 

బ్లింకెన్‌-జైశంకర్‌ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!

దాదాపు 1.54 బిలియన్‌ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ డీజిల్‌ ఎలక్ట్రిక్‌  జలాంతర్గామి ఆ దేశ నౌకాదళం చేతికి 2024నాటికి అందుతుంది. ఈ కొత్త సబ్‌మెరైన్‌కు హైకూ అని పేరుపెట్టారు. మరో జలాంతర్గామి నిర్మాణ దశలో ఉంది. కనీసం 10 జలాంతర్గాములను నౌకాదళానికి అందించాలన్నది తైవాన్‌ లక్ష్యంగా పెట్టుకొంది. గత వారం తైవాన్‌ సబ్‌మెరైన్‌ ప్రోగ్రామ్‌ అధిపతి అడ్మిరల్‌ హువాంగ్‌ సు కువాంగ్‌ మాట్లాడుతూ చైనా దాడి, నౌకాదళ బ్లాకేడ్‌ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని వెల్లడించారు. చైనా చేపట్టే హఠాత్తు దాడిని తట్టుకొని నిలబడటం తైవాన్‌కు కీలకం. కనీసం అమెరికా, జపాన్‌ దళాలు అక్కడకు వచ్చే వరకైనా అది చైనాను ఆపగలగాలి. ఈ నేపథ్యంలో దాదాపు కొన్నేళ్ల నుంచి సొంతగా సబ్‌మెరైన్‌ తయారు చేసుకోవాలని చూస్తోంది. కానీ, త్సాయి యింగ్‌ వెన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు వేగవంతమైంది. ఆమె ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌ను దాదాపు రెట్టింపు చేశారు. ఇప్పటికే తైవాన్‌ చుట్టుపక్కల సముద్ర జలాల్లో చైనా యాంటీ సబ్‌మెరైన్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది. చైనా వద్ద దాదాపు 60 సబ్‌మెరైన్లు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని