South Korea: దక్షిణ కొరియాలో అరుదైన ఇన్ఫెక్షన్‌.. ఒకరి మృతి..!

దక్షిణ కొరియా(South Korea)లో కొత్తరకం ఇన్ఫెక్షన్‌ బయటపడింది. మెదడుకు సోకే అమీబాతో ఒక వ్యక్తి మృతి చెందాడు. 

Published : 27 Dec 2022 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పటికే చైనా(china)లో సరికొత్త రకం కొవిడ్‌-19 వ్యాప్తితో ఆసియా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా మెదడుకు సోకే అరుదైన ఇన్ఫెక్షన్‌ దక్షిణ కొరియా(South Korea)లో వెలుగు చూసింది. ఇప్పటికే ఒక వ్యక్తి ప్రాణాలను కూడా బలిగొంది. ‘నెగ్లెరియా ఫౌలెరి’గా పిలిచే ఈ ఇన్ఫెక్షన్‌ సోకి 50 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ ఇన్ఫెక్షన్‌ను మెదడును తినే అమీబాగా పేర్కొంటారు. ఈ వ్యక్తికి థాయ్‌లాండ్‌లో ఇది సోకి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతడు మూడు నెలలు అక్కడే ఉండి.. డిసెంబర్‌ 10న దక్షిణ కొరియాకు చేరుకొన్నాడు. ఈ విషయాన్ని ‘ది కొరియా డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఏజెన్సీ’(కేడీసీఏ) ధ్రువీకరించింది. 

ఏమిటీ ‘నెగ్లెరియా ఫౌలెరి’..?

నెగ్లెరియా ఒక రకమైన ఏక కణ సూక్ష్మజీవి. సాధారణంగా అమీబాలు ప్రకృతిలో చాలా చోట్ల ఉంటాయి. మంచినీరు, నీటి లీకేజీల్లో, కాల్వలు, నదులు, మట్టిలో ఇవి జీవిస్తుంటాయి. అన్నిరకాల అమీబాలు మనుషుల ప్రాణాలు తీయవు. కానీ, వీటిల్లో నెగ్లెరియా రకం అమీబా మనుషులకు సోకుతుంది. అమెరికాకు చెందిన ‘సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌’ ప్రకారం నెగ్లెరియా ఫౌలెరి  ముక్కుద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఆ తర్వాత మెదడుకు చేరుతుంది. అక్కడ మెదడులోని కండరాలు, నరాలను దెబ్బతీస్తుంది. ఇది ‘ప్రైమరి అమీబిక్‌ మెనింజోఎన్‌సైఫలిటిస్‌’ (పీఎంఏ) అనే ఇన్ఫెక్షన్‌ను కలగజేస్తుంది. ఇది ప్రాణాంతకమైంది. ముఖ్యంగా వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఈ ఇన్ఫెక్షన్‌ వస్తుంది.

దీని లక్షణాలు ఏమిటీ..?

పీఎంఏ ఇన్ఫెక్షన్‌ సోకితే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, ముక్కు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్‌ తీవ్రమైతే మూర్ఛ, గందరగోళం వంటి లక్షణాలతోపాటు.. రోగి కోమాలోకి కూడా పోవచ్చు. ఈ ఇన్ఫెక్షన్‌ చాలా తీవ్రమైంది. అమెరికాలో 1962 నుంచి 2021 వరకు 154 మందిలో ఇది కనిపిస్తే.. వారిలో కేవలం నలుగురు మాత్రమే బతికారు. ఇది మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకపోవడం మాత్రం ఊరటనిస్తుంది. 

చికిత్స, వ్యాక్సిన్లు ఉన్నాయా..? 

కొన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ప్రభావవంతమైన చికిత్సను కనుగోనలేదు. కొన్ని రకాల ఔషధ సమ్మేళనాలతో దీనికి వైద్యం చేస్తారు. యాంఫోటెరసిన్‌ బి, అజిత్రోమైసిన్‌, ఫ్లూకోనజోల్‌, రిఫాపిన్‌, మిల్టెఫోసిన్‌, డెక్సామెథాసిన్‌ వంటి వాటిని వాడతారని సీడీసీ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని