Dudhsagar: భూతల స్వర్గం.. ఈ పాల నురగల జలపాతం!

రుతుపవనాల(Monsoon) రాక మొదలు.. దేశంలో అడవులు, కనుమల్లో ఎక్కడ చూసినా హరిత శోభ ఉట్టిపడుతుంది! ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో(Western Ghats)ని ప్రకృతి.. జలపాతాలు, పచ్చందాలతో కనువిందు చేస్తుంటుంది...

Published : 21 Jul 2022 19:36 IST

వైరల్‌గా మారిన దూద్‌సాగర్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: రుతుపవనాల(Monsoon) రాక మొదలు.. దేశంలో అడవులు, కనుమల్లో ఎక్కడ చూసినా హరిత శోభ ఉట్టిపడుతుంది! ముఖ్యంగా పశ్చిమ కనుమల్లో(Western Ghats)ని ప్రకృతి.. జలపాతాలు, పచ్చందాలతో కనువిందు చేస్తుంటుంది. ఇటీవలి వర్షాలకు ఈ ప్రాంతం మరింత రమణీయంగా మారింది. గోవా(Goa)లోని దూద్ సాగర్(Dudhsagar) జలపాతం.. భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. ఎత్తయిన కనుమల్లోంచి జాలువారుతోన్న పాల నురగల్లాంటి జలధార.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతోంది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఒకరు తాజాగా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. జలపాతం ఎదురుగా ఉన్న వంతెనపైనుంచి ఓ రైలు వెళ్తుండటం.. ఈ దృశ్యాన్ని మరింత అందంగా మార్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

‘నైరుతి రుతుపవనాలు గోవాను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి. అంతటా తడి, పచ్చదనం పరచుకుంటుంది. దూద్‌ సాగర్ జలపాతం అద్భుతంగా కనిపిస్తుంది. పశ్చిమ కనుమల సౌందర్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది’ అని రాసుకొచ్చారు. నెటిజన్లు సైతం ఈ వీడియోను చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘అద్భుతమైన దృశ్యం ఇది. రైల్లోనూ జలపాతం హోరును, నీటి తుంపర్లను ఆస్వాదించొచ్చు’ అని ఓ వ్యక్తి కామెంట్‌ పెట్టారు. పశ్చిమ కనుమల్లోని మాండవి నదిపై ఉందీ జలపాతం. ఇక్కడ 1017 అడుగుల ఎత్తునుంచి నీళ్లు కిందికి దూకుతాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు పర్యాటకులు పెద్దఎత్తున ఇక్కడికి తరలివస్తుంటారు. ఇటీవల కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి  దూద్‌సాగర్‌కు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. దీన్ని దేశంలోని అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొంటూ.. మరపురాని జ్ఞాపకాల కోసం ఈ ప్రాంతాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని