రాష్ట్ర రాజధానికి ఒక రూలు.. జిల్లా కేంద్రాలకు ఇంకొకటా!

పరిపాలన సౌలభ్యానికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లా కేంద్రాన్ని, పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు వీలైనంత దగ్గర చేయడమే దీని లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర రాజధానిని మాత్రం రాష్ట్రానికి నడిబొడ్డున

Published : 28 Jan 2022 02:59 IST

ఈనాడు, అమరావతి: పరిపాలన సౌలభ్యానికే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని.. జిల్లా కేంద్రాన్ని, పాలనా యంత్రాంగాన్ని ప్రజలకు వీలైనంత దగ్గర చేయడమే దీని లక్ష్యమని చెబుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర రాజధానిని మాత్రం రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామంటోంది. జిల్లాలోని ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం అందుబాటు దూరంలో ఉండాలనుకున్నప్పుడు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు రాష్ట్ర పాలనా యంత్రాంగం అందుబాటు దూరంలో ఉండాల్సిన అవసరం లేదా? దీనిపైనే గురువారం విలేకరుల సమావేశంలో ప్రణాళికాశాఖ కార్యదర్శి విజయకుమార్‌ను ప్రశ్నించగా.. ఆయన సమాధానం దాటవేశారు. జిల్లాకేంద్రం నుంచి ఎంత దూరమన్నది దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాలపై నిర్ణయం తీసుకున్నామని, అందుకే వేరే లోక్‌సభ నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ చంద్రగిరిని శ్రీబాలాజీ జిల్లాలోకి.. పాణ్యంను కర్నూలు జిల్లాలోకి తెచ్చామని చెబుతున్నారు కదా? జిల్లాకేంద్రమే అంత దగ్గరగా ఉండాలని ప్రభుత్వం అనుకున్నప్పుడు.. రాష్ట్రానికి మధ్యలో ఉన్న అమరావతిని కాదని, విశాఖను పాలనా రాజధానిగా చేయడం వల్ల అనంతపురం జిల్లాకు చెందినవారు అక్కడికి వెళ్లాలంటే వెయ్యి కి.మీ.లకుపైగా ప్రయాణించాలి కదా? దానిలో హేతుబద్ధతేంటి? అని విలేకరులు ప్రశ్నించారు. ‘ఇది జిల్లాలకు సంబంధించి కదా!’ అని అధికారి నవ్వుతూ సమాధానం దాటవేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు తీసుకొచ్చాక ప్రజల అవసరాలు 95-98 శాతం అక్కడే తీరిపోతున్నాయని, ఉద్యోగులపై ఫిర్యాదులవంటి వాటికే జిల్లాకేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.

ఈ వాదనలని పరిగణనలోకి తీసుకున్నా మరి ప్రజల అవసరాలన్నీ స్థానికంగానే తీరిపోతున్నప్పుడు రాజధానిని అమరావతిలోనే ఉంచొచ్చు కదా? రాష్ట్ర పాలనా యంత్రాంగమంతా నగరానికి నడిబొడ్డున ఉన్న అమరావతిలో ఉండటం మంచిదా? రాష్ట్రానికి దాదాపు ఒక పక్కన ఉన్న విశాఖలో ఉంటే ఉపయోగమా? అప్పట్లో 3రాజధానులపై బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలనూ ఇదే విజయకుమార్‌ విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రణాళికాశాఖ కార్యదర్శిగా 3రాజధానుల వ్యవహారంలోను, ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలోనూ ఆయనే క్రియాశీలంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆయనే జిల్లాకేంద్రం అందుబాటులో ఉండేలా జిల్లాల్ని పునర్‌ వ్యవస్థీకరించామని చెబుతూ.. విశాఖలో రాజధానిని ఏర్పాటుచేస్తే రాయలసీమకు దూరం కదా? అన్న ప్రశ్నకు సూటిగా జవాబివ్వలేదు.

పరిపాలన వికేంద్రీకరణకే ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, అందుకే 3రాజధానులు ఏర్పాటుచేస్తున్నామని చెబుతున్నారు కదా.. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో కూడా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, జిల్లా కోర్టువంటి వాటిని కూడా వేర్వేరు డివిజన్‌ కేంద్రాల్లోనో, నియోజకవర్గ కేంద్రాల్లోనో ఏర్పాటుచేస్తారా? అన్న ప్రశ్నకూ ఆయన నేరుగా సమాధానమివ్వలేదు. జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని కమిటీ భావిస్తోందని బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని