నీరు ఇవ్వలేం... కొనుక్కుని తాగండి!

ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు.

Published : 07 May 2024 05:56 IST

పట్టణాలకు ప్రభుత్వం తెచ్చిన కష్టం
తప్పుడు నివేదికలు, కాకి లెక్కలతో వైకాపా సర్కారు కాలయాపన
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నిధులకూ మంగళం
45 పుర, నగరపాలక సంస్థల్లో తీవ్ర కొరత
అనేక చోట్ల ఐదారు రోజులకోసారి తాగునీటి సరఫరా

ఒంగోలు శివారు కాలనీల్లో ప్రజలు ఎన్ని రోజులకోసారి స్నానం చేస్తున్నారో తెలుసా? మూడు రోజులకోసారి. ఇది నీటి కొరత తెచ్చిన దుస్థితి. శివారు కాలనీలకు ఐదు రోజులకోసారి ట్యాంకర్లతో నగరపాలక సంస్థ అరకొరగా నీరు సరఫరా చేస్తోంది. ఇవి అవసరాలకు సరిపోక పోవడంతో స్నానం చేయడం తగ్గించుకున్నారు. నగర శివారు నేతాజీకాలనీ, ఇందిరాకాలనీ, తీర్లమాన్యం... ఇలా అనేక కాలనీల్లో ఇదే పరిస్థితి.

చిత్తూరు జిల్లా పలమనేరులో తాగునీరు ఎన్ని రోజులకోసారి సరఫరా చేస్తున్నారో తెలుసా? ఆరు రోజులకోసారి. సమస్యపై అరిచి గీపెట్టినా ఎవరికీ పట్టదు. అత్యవసరం అనుకుంటే ప్రైవేట్‌ ఆర్వో ప్ల్లాంట్లకు వెళ్లి నీరు కొనుక్కోవాలని ఉచిత సలహాలిస్తారు. పలమనేరులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే ప్రతిపాదనలను జగన్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది. రూ.25 కోట్లు ఇవ్వడానికీ సీఎంకు మనసొప్పలేదు.

ఈనాడు, అమరావతి: బిందెడు నీళ్లివ్వండి మహాప్రభో అంటూ పట్టణ ప్రజలు ఆక్రందనలు చేస్తున్నారు. ఐదారు రోజులకోసారి సరఫరా చేస్తున్న అరకొర తాగునీరు సరిపోక అవస్థలు పడుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికల్లేని జగన్‌ ప్రభుత్వ అసమర్థత కారణంగా గొంతు తడుపుకోవడమే గగనమైంది.

45 పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి కొరత తీవ్రంగా ఉన్నా... తప్పుడు నివేదికలు, కాకిలెక్కలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. సర్కారు దృష్టిలో 32 పట్టణాల్లోనే నీటి కొరత. అదీ చెప్పుకోదగ్గ సమస్య కాదట. ప్రజలకు రక్షిత నీరు అందించడాన్ని కనీస బాధ్యతగా గుర్తించలేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదు. బిందెడు నీటి కోసం రోడ్లపైకి వచ్చి మహిళలు చేస్తున్న ఆందోళనలు జగన్‌కు కనిపించడం లేదు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయం అందించకపోగా... నిధులన్నీ తన చేతుల్లో పెట్టుకుని పట్టణ స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేశారు. వేసవిలో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఉద్దేశించిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల గ్రాంట్లు నిలిపివేశారు. తెదేపా ప్రభుత్వంలో రూ.2 వేల కోట్లతో ప్రారంభించిన తాగునీటి పథకాల పనులకు నిధులివ్వకుండా జగన్‌ అటకెక్కించారు. సమస్యలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం తప్పితే ప్రజల గొంతు తడపాలన్న ఆలోచన చేయలేదు. గత ఐదేళ్లలో పురపాలక శాఖకు ఇద్దరు మంత్రులు మారినా ప్రజా సమస్యలు పట్టలేదు. తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి నీరందించే ప్రయత్నమూ చేయలేదు. నిన్నటి వరకు సీఎం, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి చేస్తున్న సమీక్షల ద్వారా ఎలాంటి ఉపయోగమూ లేదు.

కాకి లెక్కలు... ప్రజలకు చుక్కలు

రాష్ట్రంలోని ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌, అనంతపురం జిల్లాల్లో పట్టణ ప్రజలకు ఐదారు రోజులకోసారి తాగునీరు అందించడమూ కష్టమవుతోంది. ప్రకాశం జిల్లాలో ఒంగోలు, పొదిలి, మార్కాపురం, కనిగిరి పట్టణాల్లో సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఆరు రోజులకోసారి తాగు నీరు సరఫరా చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు అత్యంత అధ్వానంగా ఉన్నా... సమస్య తీవ్రంగా ఉన్న పట్టణాల సంఖ్య ఏడుకు మించి లేవంటూ తప్పుడు నివేదికలు రూపొందిస్తున్నారు. బద్వేల్‌, బొబ్బిలి, మాచర్ల, మదనపల్లె, నందిగామ, నంద్యాల, రాయచోటి, విజయనగరం పుర, నగరపాలక సంస్థల్లో నాలుగైదు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నా... ప్రభుత్వం దృష్టిలో అక్కడ రెండు రోజులకోసారి నీరు ప్రజలకు పుష్కలంగా అందుతోందట. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో 45 చోట్ల తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైంది. ప్రకాశం జిల్లా పొదిలి ప్రజలు తాగునీటి కోసం రోజూ రూ.లక్షకుపైగా వెచ్చిస్తున్నారు. ప్రైవేట్‌ ఆర్వో ప్లాంట్లలో 20 లీటర్ల నీటిని రూ.20 చొప్పున కొంటున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రజలు రోజూ రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. 


నివేదికలే... ఐదేళ్లుగా నిధుల్లేవు

వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఐదేళ్లుగా పట్టణ స్థానిక సంస్థలకు నిధులివ్వడం లేదు. ఏటా వేసవికి ముందు పుర, నగరపాలక సంస్థలకు అవసరమైన నిధులపై కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపుతారు. వీటిపై సమీక్షించి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కింద నిధులు కేటాయిస్తుంటారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈ విధానం తు.చ. తప్పక అమలైంది. వైకాపా ప్రభుత్వంలో పట్టణ స్థానిక సంస్థలకు ఒక్క రూపాయైనా రాలేదు. ఐదేళ్లలో రూ.350 కోట్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా సమీక్షలకే పరిమితం చేశారు. దీంతో పట్టణ స్థానిక సంస్థల్లో ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే గుత్తేదారులకు బిల్లులు చెల్లించలేక పోతున్నారు. ఇతర అత్యవసర సమయాల్లో చేపట్టిన పనులకూ సంబంధించి రూ.25 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కొరతతో ప్రకాశం జిల్లా పొదిలిలో ఈ ఏడాది వేసవిలో ట్యాంకర్లతో నీటి సరఫరా నిలిపివేశారు. మార్కాపురం, కనిగిరిలోనూ అరకొరగా సరఫరా చేస్తున్నారు.


పురపాలిక నిధులివ్వడానికీ చేతులు రావడం లేదు

తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని చెబుతున్న ప్రభుత్వానికి పట్టణ స్థానిక సంస్థల పీడీ ఖాతాల్లో నిధులివ్వడానికీ చేతులు రావడం లేదు. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడవడం, పైపులైన్లు పగిలిపోవడం వంటివి చోటుచేసుకోవడం సహజం. వీటికి అత్యవసరంగా మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలంటే నిధులు అందుబాటులో ఉండాలి. పనులు పూర్తి చేసి సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేసినా ప్రభుత్వం డబ్బులివ్వడం లేదు. అత్యవసర పనులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు రూ.250 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పనుల నిర్వహణకు గుత్తేదారులు వెనక్కు తగ్గుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు