Ponguleti: పొంగులేటి కుటుంబ కంపెనీకే ఎత్తిపోతల పనులు

శ్రీకాకుళం జిల్లాలో రూ.135 కోట్లతో చేపడుతున్న ఎత్తిపోతల పనులు అంచనాల కన్నా ఎక్కువకే అప్పగిస్తున్నారు. రివర్స్‌ టెండర్లు నిర్వహిస్తూ తక్కువ ధరకే పనులు అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. అంచనాలకు మించిన ధరలకే పనులు ఇచ్చేస్తున్నారు.

Updated : 02 Dec 2022 06:50 IST

అంచనా విలువ కన్నా అధికానికే
ఐబీఎం విలువ కన్నా 3 శాతం ఎక్కువ
పాల్గొన్నది మూడు కంపెనీలు

ఈనాడు, అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో రూ.135 కోట్లతో చేపడుతున్న ఎత్తిపోతల పనులు అంచనాల కన్నా ఎక్కువకే అప్పగిస్తున్నారు. రివర్స్‌ టెండర్లు నిర్వహిస్తూ తక్కువ ధరకే పనులు అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. అంచనాలకు మించిన ధరలకే పనులు ఇచ్చేస్తున్నారు. గొట్టా బ్యారేజి నుంచి హిరమండలం జలాశయానికి నీటిని ఎత్తిపోసేందుకు ఈ పనులు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ కంపెనీ రాఘవ కన్‌స్ట్రక్షన్‌కే ఈ పనులు అప్పగిస్తున్నారు. గోదావరి బ్యారేజిలో డ్రెడ్జింగ్‌ పనులనూ దాదాపు రూ.272 కోట్లతో ఇదే రాఘవ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్న వైనమూ వివాదమైంది. శ్రీకాకుళం జిల్లాలో గొట్టా బ్యారేజి నుంచి వంశధార వరద జలాలను వంద రోజుల్లో 10 టీఎంసీలు ఎత్తిపోసి హిరమండలం జలాశయానికి మళ్లించేందుకు ఈ పనులు చేపడుతున్నామని జలవనరులశాఖ చెబుతోంది. రూ.176 కోట్లకు పాలనామోదం ఇవ్వగా ఇందులో రూ.135 కోట్లతో పనులు చేపట్టేలా టెండర్లు పిలిచారు. మూడు కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయి. మేఘా ఇంజినీరింగు, కావేరి కన్‌స్ట్రక్షన్‌, రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు టెండర్లు దాఖలుచేశాయి. తొలుత ఆర్థిక బిడ్‌ తెరవగా రాఘవ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అంచనా విలువపై 3.5% అధికానికే టెండరు దాఖలుచేసింది. మిగిలిన ఇద్దరు ఇంకా ఎక్కువకు టెండరు దాఖలుచేశారని అధికారులు పేర్కొన్నారు. ఇదే ధరపై అధికారులు రివర్స్‌ టెండర్లు నిర్వహించారు. ఆ ప్రక్రియలోనూ అంచనా విలువ కన్నా తక్కువకు చేసేందుకు కంపెనీ ముందుకు రాలేదు. అదే రాఘవ కంపెనీ రివర్స్‌ టెండర్లలో అంతకుముందు దాఖలుచేసిన మొత్తం కన్నా 0.5% తక్కువకు చేస్తామంది. అదే ధరకు టెండర్లు అప్పగించేందుకు జలవనరులశాఖ సన్నాహాలు చేస్తోంది.

తారకరామతీర్థ సాగర్‌ పనులకు ముందుకు రాని గుత్తేదారులు

తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టులో 21వ ప్యాకేజీలో మిగిలిన పనులు చేపట్టేందుకు జలవనరులశాఖ టెండర్లు పిలిచింది. సుమారు రూ.198.80 కోట్లతో పనులకు టెండర్లు పిలవగా గుత్తేదారుల నుంచి స్పందన లేదు. ఒకే ఒక్క కంపెనీ ఈ టెండర్లలో పాల్గొన్నట్లు సమాచారం. దీంతో ప్రక్రియ ముందుకు సాగట్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని