తెలుగుజాతి ఖ్యాతి చాటిన ఎన్టీఆర్‌

తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్‌ శక పురుషుడు అని శ్లాఘించారు.

Published : 29 May 2023 03:31 IST

శత జయంతి వేడుకల్లో కొనియాడిన వక్తలు

విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే: తెలుగుజాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్‌ శక పురుషుడు అని శ్లాఘించారు. విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఆదివారం ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ... ఎన్టీఆర్‌ నటనా కౌశలం అపూర్వమని, నర్తనశాల సినిమా కోసం వెంపటి చినసత్యం వద్ద నాట్యం నేర్చుకున్నారన్నారు. మరో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా పేదరిక నిర్మూలనకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయగా... ఆ తర్వాత వచ్చిన పాలకులు వాటికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఎన్టీఆర్‌ పథకాలను సక్రమంగా అమలు చేసి ఉంటే రాష్ట్రంలో పేదరికం ఏనాడో పోయేదన్నారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవుల కోసం కాకుండా సమాజ మార్పునకు ఎన్టీఆర్‌ కృషి చేశారని చెప్పారు. అలాంటి మహోన్నతుడి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును తొలగిస్తుంటే.. ప్రజల నుంచి సరైన రీతిలో వ్యతిరేకత రాకపోవడం బాధాకరమన్నారు. తన కుమారుడు ఓ రాజకీయపార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నా సరే.. తాను స్పందించానని, ప్రభుత్వ చర్య సరైనది కాదని చెప్పానని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని కాపాడేందుకు మళ్లీ ఎన్టీఆర్‌ వస్తే బాగుండు: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌కు నేటికీ భారతరత్న ఇవ్వలేదన్నారు.  ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడేందుకు దివి నుంచి భువికి మళ్లీ ఎన్టీఆర్‌ వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్‌ స్వాభిమానం నందమూరి తారక రామం... అంటూ గజల్‌ను ఆలపిస్తూ ఎన్టీఆర్‌ నట వైభవం, వ్యక్తిత్వం, పాలనా దక్షతను గజల్‌ శ్రీనివాస్‌ వివరించారు.  ఈ కార్యక్రమానికి ఉడా మాజీ ఛైర్మన్‌ తూమాటి ప్రేమ్‌నాథ్‌ అధ్యక్షత వహించగా కార్యదర్శి గుత్తికొండ శ్రీరామ్‌ నిర్వహించారు. పలువురు వక్తలు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ‘ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌’ను ప్రముఖ పారిశ్రామికవేత్త, జాతీయ జమ్మాలాల్‌ బజాజ్‌ అవార్డు గ్రహీత మలినేని నారాయణ ప్రసాద్‌ ప్రారంభించారు. కమిటీ ప్రతినిధులు రూపొందించిన ఎన్టీఆర్‌ ఛాయాచిత్ర సంచికను ముఖ్యఅతిథులు ఆవిష్కరించారు. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, వైకాపా నాయకుడు దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సి.హెచ్‌.బాబూరావు, మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతీ రామ్మోహనరావు, కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు, ఆర్థికవేత్త ఎం.సి.దాస్‌, రంగస్థల నటుడు కృష్ణ తదితరులు ప్రసంగించారు.  జానపద, కూచిపూడి నృత్య ప్రదర్శనలు, సిల్వస్టర్‌ మిమిక్రీ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వైద్యశిబిరంలో పలువురు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని