Margadarsi: మళ్లీ మళ్లీ అదే దుష్ప్రచారం

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ తన దురుద్దేశపూర్వక దాడిని కొనసాగిస్తోంది. అందులో భాగంగా సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌, సీఐడీ ఎస్పీ కె.ఫక్కీరప్పలు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించి మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు గుప్పించారు.

Updated : 08 Sep 2023 09:28 IST

కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీఐడీ ప్రెస్‌మీట్‌
పాత విషయాలే మళ్లీ వల్లె వేసిన సీఐడీ అధిపతి సంజయ్‌
డిఫాల్టరైన చందాదారును తీసుకొచ్చి.. ఆరోపణలు
అసలు వాస్తవాలు ప్రకటనలో వెల్లడించిన మార్గదర్శి చిట్‌ఫండ్‌
ఈనాడు - అమరావతి

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ తన దురుద్దేశపూర్వక దాడిని కొనసాగిస్తోంది. అందులో భాగంగా సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌, సీఐడీ ఎస్పీ కె.ఫక్కీరప్పలు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించి మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు గుప్పించారు. తొలి నుంచీ చేస్తున్న ఆరోపణలనే తిరిగి వల్లెవేశారు. ‘ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్లు’ ఉన్నారని, చిట్‌గ్రూపుల్లో మనుషులే లేకుండా నడిపిస్తున్నారంటూ మార్గదర్శిపై చందాదారుల్లో అపోహలు సృష్టించేందుకు, బురద చల్లేందుకు యత్నించారు. తగిన ష్యూరిటీలు సమర్పించకుండా, సక్రమంగా చిట్‌ వాయిదాలు చెల్లించకుండా డిఫాల్టరైన అన్నపూర్ణాదేవి అనే చందాదారుతో ప్రెస్‌మీట్‌లో మాట్లాడించి... వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేయించారు. డిఫాల్టర్‌ కావటం, ష్యూరిటీలు సమర్పించకపోవటం ఆమె తప్పిదం కాదా? అని విలేకరులు ప్రశ్నిస్తే దానికి సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రెస్‌మీట్లలో సీఐడీ అధికారులు చేస్తున్న నిరాధార, ఊహాజనిత, కల్పిత, తర్కం లేని, ప్రేరేపిత ఆరోపణల్లోని డొల్లతనాన్ని ఎండగడుతూ, అసలు వాస్తవాలు ఏంటో చెబుతూ మార్గదర్శి ఇచ్చిన ప్రకటనలను ప్రచురిస్తున్న ‘ఈనాడు’పైనా అక్కసు వెళ్లగక్కారు. దర్యాప్తులో గుర్తించిన అంశాలంటూ సీఐడీ అధికారులు నిరాధార ఆరోపణలు చేస్తున్నప్పుడు అందులో వాస్తవాలెంతో చందాదారులకు చెప్పుకునే హక్కు మార్గదర్శికి కూడా ఉంటుంది కదా! అని విలేకరులు అడిగితే సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంజయ్‌, ఫక్కీరప్ప మాట్లాడారు. వారు మార్గదర్శిపై చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన అసలు వాస్తవాలను మార్గదర్శి చిట్‌ఫండ్‌ గురువారం పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేసింది.

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ తన దురుద్దేశపూర్వక దాడిని కొనసాగిస్తోంది. అందులో భాగంగా సీఐడీ విభాగాధిపతి ఎన్‌.సంజయ్‌, సీఐడీ ఎస్పీ కె.ఫక్కీరప్పలు గురువారం ప్రెస్‌మీట్‌ నిర్వహించి మార్గదర్శిపై నిరాధార ఆరోపణలు గుప్పించారు. సీఐడీ అధికారులు మార్గదర్శిపై చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన అసలు వాస్తవాలను మార్గదర్శి చిట్‌ఫండ్‌ గురువారం పత్రికా ప్రకటన రూపంలో విడుదల చేసింది. వివరాలివి...


ఆరోపణ 1

చిట్‌ ప్రారంభమైన తర్వాత మొదట వేలంపాట నిర్వహించకుండానే.. నాలుగైదు నెలలు వాయిదాలు కట్టించుకుంటున్నారు. మేనేజర్లు, ఏజెంట్ల ప్రమేయంతో ఇలా ముందుగా వాయిదాలు కట్టించుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... చందాదారులు వారంతటే వారే ముందస్తుగా కడుతున్నారని, వాటిని తాము బ్యాలెన్స్‌షీట్‌లో చూపిస్తున్నామని మార్గదర్శి చెబుతోంది.

వాస్తవం

ప్రీవియస్‌ శాంక్షన్‌ ఆర్డర్‌ (పీఎస్‌వో) పొందిన తర్వాతే చందాదారులను నమోదు చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. వేలం కంటే ముందు చందాదారు తన సొంత విచక్షణ మేరకు చందా సొమ్ము కట్టుకోవచ్చు. నిర్దేశిత వాయిదా మొత్తం కంటే అదనంగా కట్టాలని మార్గదర్శి ఏ చందాదారునూ కోరదు. చందాదారులు వారి సౌలభ్యం రీత్యా ముందుగానే కడితే.. వాటిని బ్యాలెన్స్‌షీట్‌లో అప్పుల కింద అడ్వాన్సు చందాల రూపంలో ప్రత్యేకంగా చూపిస్తున్నాం.  


ఆరోపణ 2

ఒక్కో చిట్‌ గ్రూపులో 40-50 శాతం మనుషులే లేరు. వాటిని మార్గదర్శే నడిపిస్తోంది. ఆ సంస్థే చిట్‌ కడుతున్నట్లు, సంస్థే చిట్‌ పాడుకుంటున్నట్లు, సంస్థకే ప్రైజ్‌మనీ వచ్చినట్లు చూపించారు. వేకెంట్‌ చిట్స్‌ గురించి మేం అడుగుతుంటే.. వాటిని కంపెనీ తర్వాత నింపుకొంటుంది, తమ దగ్గర తగిన నగదు నిల్వలు ఉన్నాయని చెబుతున్నారు.

వాస్తవం

ఇది ప్రజల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో చేసిన ఆరోపణ. ఒక చిట్‌గ్రూప్‌లో కంపెనీ విధిగా కలిగి ఉండే చిట్‌తో పాటు, ఖాళీగా ఉన్న చిట్‌లకు కూడా తాత్కాలికంగా, స్వల్పకాలంపాటు సబ్‌స్క్రైబ్‌ చేస్తుంది. తర్వాత ఖాతాదారులెవరికైనా ఆ ఖాళీగా ఉన్న చిట్‌లను కేటాయించినప్పుడు, అప్పటి వరకు కంపెనీ చెల్లించిన డబ్బును వారి నుంచి వసూలు చేస్తుంది. దీనికి అవసరమైన నగదు నిల్వల్ని కంపెనీ ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతుంది. కంపెనీ కలిగి ఉన్న ఖాళీ చిట్‌లను... చిట్‌ గ్రూప్‌ మొదలైన రెండు, మూడో నెలల్లోనే కొత్త ఖాతాదారులకు కేటాయిస్తుంది. ఏ ఖాతాదారైనా మధ్యలో వైదొలగడం వల్ల ఖాళీ అయిన చిట్‌ను కంపెనీ కలిగి ఉన్నా... చిట్‌గ్రూప్‌లోని ఖాతాదారులందరికీ ప్రైజ్‌మనీ అందేవరకూ కంపెనీ వేలంలో పాల్గొనదు. చిట్‌ గడువు ముగిశాకే ఖాళీ చిట్‌ల ప్రైజ్‌ అమౌంట్‌ని కంపెనీ డ్రా చేసుకుంటుంది. 2022 మార్చి 31 నాటికి కంపెనీలో రూ.1,509 కోట్ల నిల్వలున్నాయి. వాటిని ఖాళీ చిట్‌లలో సబ్‌స్క్రైబ్‌ చేయడం సహా, వ్యాపార అవసరాలకు కంపెనీ వినియోగిస్తుంది. ఏపీ సీఐడీ ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా పదే పదే అవే తప్పుడు ఆరోపణలు చేస్తోంది.


ఆరోపణ 3

మార్గదర్శిలో ప్రస్తుతం 1,900-2000 చిట్‌ గ్రూపులు నడుస్తున్నాయి. ప్రతి చిట్‌ గ్రూపులోనూ ఒకరిద్దరు ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. మొత్తంగా 3 వేల మంది ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. తమ పేరిట చిట్‌ ఉన్నట్లు వారికి తెలీదు. వారికి, కంపెనీకి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవు. వారి పేరుతో ఓచర్లపై ఎవరో సంతకం చేసి వాటిని అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ చిట్స్‌కు సమర్పిస్తున్నారు. వారి పేరిట చెక్కు సిద్ధం చేస్తున్నారు. లెడ్జర్‌ ఎంట్రీల్లో చెక్కు నంబరు, పేరు, తేదీ ఉండట్లేదు. ఆ చెక్కు కంపెనీ దగ్గరే ఉంటోంది. ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్ల వివరాలను కంపెనీ వాడుకుంటోంది. మేం 100 మంది ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్ల వివరాలను అధ్యయనం చేశాం. వారిలో కనీసం 23 మందికి శైలజా కిరణ్‌, ఆమె పీఏ నుంచి ఫోన్లు వెళ్లాయి. ఇది దర్యాప్తును అడ్డుకోవటం కాదా?

వాస్తవం

మార్గదర్శిలో ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారన్నది పూర్తి నిరాధార, తప్పుడు ఆరోపణ. ఏ బ్రాంచ్‌లోనూ, ఎప్పుడూ ఘోస్ట్‌ సబ్‌స్రైబర్లు లేదు. ఒకపక్క పెద్దసంఖ్యలో ఖాళీ చిట్‌లకు కంపెనీనే సబ్‌స్క్రైబ్‌ చేస్తోందని ఆరోపిస్తున్న సీఐడీ... మరోపక్క కంపెనీ ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్‌లను ఎన్‌రోల్‌ చేస్తోందని కొత్త ఆరోపణను తెరపైకి తెచ్చింది. అవి రెండూ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు. దీన్నిబట్టే అవి తప్పుడు ఆరోపణలని అర్థమవుతోంది. నిధుల్ని బ్రాంచ్‌/కంపెనీలోనే ఉంచేసుకునేందుకే ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంటున్నారన్నది పూర్తి నిరాధార ఆరోపణ. ఏ ఖాతాదారుకైనా చెల్లించని ప్రైజ్‌మనీని చిట్‌ఫండ్స్‌ చట్టంలోని 22(2) సెక్షన్‌ ప్రకారం.. ప్రత్యేక బ్యాంకు ఖాతాలో కంపెనీ జమ చేస్తుంది. ఆ డబ్బును ఆ ఖాతాదారు చెల్లించాల్సిన బకాయిల్ని ఆరు నెలలకోసారి సర్దుబాటు చేసేందుకే కంపెనీ వినియోగించే వీలుంటుంది. చట్టప్రకారం కంపెనీకి ఆ అధికారం ఉంది. ఘోస్ట్‌ సబ్‌స్క్రైబర్లకు కంపెనీ ఎండీ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయన్నది పచ్చి అబద్ధం. వాయిదాలు చెల్లించాలని, ప్రైజ్‌మనీ తీసుకోవాలని గుర్తుచేసేందుకు కంపెనీ నిరంతరం ఖాతాదారులకు ఫోన్లు చేస్తుంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఘోస్ట్‌సబ్‌స్రైబర్లకు ఫోన్లు వెళ్లాయంటూ సీఐడీ నిరాధార, ఊహాజనిత, అత్యంత బాధ్యతారహితమైన ఆరోపణలు చేసింది. సీఐడీ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ, కేసును సంచలనం చేసేందుకు ఇలాంటి ఎత్తుగడలకు పాల్పడుతోంది.


ఆరోపణ 4

తనకు మార్గదర్శితో సంబంధం లేకపోయినా తన పేరు, వివరాలను దుర్వినియోగం చేసి తన పేరిట మార్గదర్శిలో చిట్‌ నడిపిస్తున్నారంటూ విశాఖపట్నానికి చెందిన లలితకుమారి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా విశాఖపట్నం రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఐపీసీ 419, 420, 467, 471, 409, 120బీ రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. బ్రాంచ్‌ మేనేజర్‌, ఏజెంట్‌పై కేసు నమోదుచేశాం. చిట్‌ వివరాలు సేకరించే క్రమంలో ఆమెకు ఫోన్‌ చేయగా.. తన పేరు దుర్వినియోగం అవుతోందని చెప్పారు.

వాస్తవం

ఈ ఆరోపణల్లో వాస్తవం లేదు. విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచిలో పి.లలితకుమారి ఖాతాదారుగా చేరారు. మూడు వాయిదాలు చెల్లించిన తర్వాత 2019 అక్టోబరులో ఆమె చీటీ పాడుకున్నారు. తర్వాత ష్యూరిటీలు సమర్పించలేదు. చీటీ పాడుకున్న మొత్తం తీసుకోవాలంటూ మార్గదర్శి బ్రాంచి నుంచి ఎప్పటికప్పుడు వర్తమానం పంపుతూనే ఉన్నాం. 2019 నవంబరులో ఆమె చీటీ పాడుకున్న మొత్తాన్ని చిట్‌ఫండ్‌ చట్టంలోని సెక్షన్‌ 22(2) కింద ప్రత్యేక ఖాతాకు బదలాయించాం. తర్వాత ఆ మొత్తాన్ని ఆమె చెల్లించాల్సిన ఆరు నెలలకు సంబంధించిన వాయిదాల మొత్తం కింద సర్దుబాటు చేశాం. ఖాతాదారుతో ముందే కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ సర్దుబాటు చేశాం. ఇలా వాయిదాలు చెల్లించని ఖాతాదారులను సంప్రదించి వారితో ఫిర్యాదులు చేయించి మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయడం ఏపీ సీఐడీకి అలవాటుగా మారింది.


ఆరోపణ 5

విజయవాడకు చెందిన గొండు అన్నపూర్ణాదేవి ప్రభుత్వ వెటర్నరీ వైద్యుడి భార్య. ఆమెతో 8-10 ఏళ్లలో రూ.14 కోట్ల విలువైన 65 చిట్లకు సంబంధించి రూ.8 కోట్లు కట్టించుకుని రూ.48 లక్షలు మాత్రమే చెల్లించారు. వీటిలో 45 చిట్లు అధ్యయనం చేస్తే ఆమె రూ.7 కోట్లు కట్టగా.. రూ.8 వేలే వచ్చాయి. మార్గదర్శి సంస్థకు ఇంకా రూ.1.7 కోట్లు కడితే తప్ప అకౌంట్‌ క్లోజ్‌ అవ్వదంటూ బ్రాంచ్‌ మేనేజర్లు, బోర్డు సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అన్నపూర్ణాదేవి కుమార్తె ప్రియాంక విదేశాల్లో ఉంటారు. ఆమె సంతకం ఫోర్జరీ చేసి.. ఆమె 18 గ్రూపుల్లో చందాదారుగా నమోదైనట్లు, పాట పాడినట్లు చూపించారు. అన్నపూర్ణాదేవి ఫిర్యాదు ఆధారంగా మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్‌లో ఐసీసీలోని 120బీ, 420, 463, 464, 467, 471, 409, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదైంది. (అన్నపూర్ణాదేవితో కూడా మాట్లాడించారు. ఆమె కూడా ఇవే ఆరోపణలు చేశారు)

వాస్తవం

అన్నపూర్ణాదేవి మార్గదర్శిలో చందాదారుగా, ఏజెంటుగా ఉన్నారు. ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి వారి సొంత విచక్షణ మేరకు చిట్‌ గ్రూపుల్లో చందాదారులుగా చేరారు. వారిని చందాదారులుగా చేర్చేముందు ప్రతి సందర్భంలోనూ ఫోర్‌మెన్‌లు అవసరమైన మదింపు చేశారు. పౌల్ట్రీ వ్యాపారంలో తాను నష్టపోయినట్లు అన్నపూర్ణాదేవే స్వయంగా విలేకరుల సమావేశంలో చెప్పారు. అప్పటి నుంచి ఆమె ఎగవేతదారు (డిఫాల్టర్‌)గా మారి భారీగా బకాయిపడ్డారు. ఈ నేపథ్యంలో చిట్‌ గ్రూపుల్లోని ఇతర చందాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం బకాయిల రికవరీకి వీలుగా ఫోర్‌మెన్‌ దావా దాఖలు ప్రక్రియ ప్రారంభించారు. ఆమె తన ఆర్థిక స్తోమతకు అనుగుణంగానే ఎక్కువ చిట్‌ గ్రూపుల్లో చేరారు. అది ఆమె సొంత నిర్ణయం. సక్రమంగా చెల్లింపుల విషయంలో ఆమె విఫలమయ్యారు. అన్నపూర్ణాదేవి ఏజెంటుగా ఉంటూ.. తన కుమార్తె సహా ఇతర కుటుంబసభ్యులను చందాదారులుగా చేర్పించి.. ఏజెంట్‌ కమీషన్‌ తీసుకుని లబ్ధి పొందారు. ఆమె కుమార్తె సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణ పూర్తి ఊహజనితం, నిరాధారం, అసత్యం. డిఫాల్టర్‌గా మారిన తర్వాత సీఐడీ ప్రోద్బలంతో ఆమె మార్గదర్శిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.


ఆరోపణ 6

కనీసం ఇద్దరు చందాదారుల సమక్షంలో చిట్‌ వేలం జరగాలి. కానీ అలా జరగట్లేదు. నరసరావుపేటలో ఏజెంట్‌ సంతకాన్ని బ్రాంచ్‌ మేనేజర్‌ ఫోర్జరీకి పాల్పడి మోసం చేశారు.

వాస్తవం

మార్గదర్శి చీటీ వేలం నిర్వహించే క్రమంలో ఎప్పుడూ చట్టబద్ధంగానే వ్యవహరిస్తోంది. చట్టంలో పేర్కొన్న నిబంధనలు, మార్గదర్శకాలన్నీ పక్కాగానే పాటిస్తుంది. వేలం సమాచారాన్ని, చీటీ వేలంపాటలో పాల్గొనాలని ఖాతాదారులకు తరచు వర్తమానం పంపుతాం. ఖాతాదారులందరికీ చీటీ వేలంపాట విధివిధానాలు తెలుసు. ఒకవేళ వారు చీటీ పాడుకునే ఆలోచన లేకపోతే వేలం పాటకు హాజరుకారు. ఖాతాదారులు వ్యక్తిగతంగా చీటీ పాటకు రాలేక బిడ్‌ ఆథరైజేషన్‌ సమర్పించినప్పుడు ఫోర్‌మెన్‌ వేలం పాటలో పాల్గొంటారు. లేనిపక్షంలో వేలం పాటలు పెద్ద మొత్తంలో నిర్వహించి చట్ట ప్రకారం ఎవరు పాడుకుంటే వారికే బిడ్‌ కేటాయింపు జరుగుతుంది. ఒకవేళ ఒక ఖాతాదారే బిడ్‌లో పాల్గొనాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తే అతనికే ఆ బిడ్‌ దక్కుతుంది. వేలం పాట నిర్వహించినప్పుడు మినిట్స్‌ సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌కు సమర్పిస్తాం.


ఆరోపణ 7

రూ.కోటి కంటే ఎక్కువ విలువ కలిగిన చిట్‌ గ్రూపుల్లో ఎవరైనా ఒకటి, రెండు చిట్లు వేసుకోవటం సహజం. కానీ ఓ రైస్‌మిల్లు పేరిట 42 టికెట్లు, ఆగ్రోఫుడ్స్‌ పేరిట 43 టికెట్లు, బిల్డర్‌ పేరిట 50 టికెట్లు ఇలా ఉన్నాయి. ఇలాంటివారు 800 మంది వరకూ ఉన్నారు. వీరిది ప్రకటిత ఆదాయమా? అప్రకటిత ఆదాయమా? అనేది పరిశీలించాలి. వారికి సీఆర్‌పీసీ 160 కింద నోటీసిచ్చి పిలిపించి ప్రశ్నిస్తున్నాం. వీటిపై ఆదాయపన్ను విభాగానికి లేఖ రాశాం. ప్రైవేటు కంపెనీలు ఇన్నిన్ని చిట్లు ఎలా వేశారనేది తేలాల్సి ఉంది. మార్గదర్శి చందాదారులను ఉచ్చులోకి లాగుతూ చిట్‌ గ్రూపుల్లో చేర్చుకుంటోంది.

వాస్తవం

సీఐడీ ఆరోపణలు ఊహాజనితం. సంచలనం చేసేందుకే ఇలాంటి ఆరోపణలు. ఖాతాదారుల ఆర్థిక పరిస్థితి, వారి చెల్లింపు సామర్థ్యం, వారికి ఉన్న ఆస్తులు మదింపు చేసిన తర్వాతే ఖాతాదారులుగా చేర్చుకుంటాం. వారికి చీటీ సొమ్ము చెల్లించే ముందు కూడా సంస్థ వారి ఆర్థిక బలాన్ని మరోసారి మందిపు చేస్తుంది. ఖాతాదారులు వారి ఆర్థిక అవసరాలు, చీటీ మొత్తాలు చెల్లించే సామర్థ్యాలను అంచనా వేసుకుని అనేక చీటీల్లో చేరతారు. సీఐడీ ఆరోపించినట్లు ఎలాంటి మతలబులు ఉండవు. ఆ ఖాతాదారులంతా అర్హులు, విద్యావంతులు. వారికి చీటీ పాట మొత్తం చెల్లించే క్రమంలో కంపెనీ ఎన్నడూ వారు సమర్పించే ష్యూరిటీల విషయంలో రాజీ పడలేదు. ఒకవేళ వారు చెల్లింపుల్లో విఫలమైతే వారు సమర్పించిన సెక్యూరిటీలను చట్టప్రకారం నగదుగా మార్చుకోవచ్చు. మార్గదర్శి సిబ్బంది అందిస్తున్న ఎనలేని సేవల వల్లే ప్రతి ఏటా లక్ష మందికి పైగా ఖాతాదారులు చేరుతున్నారు. మళ్లీ మళ్లీ చీటీ పాటల్లో చేరుతున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని