నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!

రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్‌ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం!

Published : 01 May 2024 05:48 IST

జగన్‌ నిర్ణయాలతో అరకోటి మంది కార్మికుల జీవితాలు అతలాకుతలం
పీఠమెక్కగానే నిర్మాణ రంగంపై దారుణమైన దెబ్బ
ఉచిత ఇసుక విధానాన్ని ఎత్తేసి దోపిడీ పద్ధతికి శ్రీకారం
రాజధాని అమరావతిపై అక్కసుతో మూడు ముక్కలాట  
రూ.1500 కోట్ల సంక్షేమ బోర్డు నిధులూ పక్కదారి
ఈనాడు, అమరావతి, ఈనాడు డిజిటల్‌, అమరావతి

రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత!
అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్‌ కొట్టిన రెండు చావు దెబ్బలు!
ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం!

జగన్‌ రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాటలో స్థిరాస్తి రంగం కుదేలైంది. భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు. అధికార పీఠం ఎక్కింది మొదలు... కార్మికుల జీవనోపాధిని నాశనం చేయడమే లక్ష్యమన్నట్లుగా జగన్‌ పనిచేశారు. కొత్త ఇసుక విధానం పేరిట రీచ్‌లను మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా నిర్మాణాలు ఆగిపోయి నెలల తరబడి ఉపాధి కరవైంది. ఒకటి, రెండు రోజులు పనులు దొరక్కపోతేనే పూట గడవని కుటుంబాలు అయిదు నెలలపాటు అల్లాడిపోయాయి. పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు, రోజువారీ ఖర్చులు భారంగా మారి అప్పులపాలయ్యారు. అంతలోనే వచ్చిన కరోనాతో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఐదేళ్ల నుంచి వారు అనుభవిస్తున్న కష్టాలను ‘మే డే’ సందర్భంగా పరిశీలిస్తే... రాష్ట్ర విభజన తర్వాత తెదేపా పాలించిన తొలి ఐదేళ్లు నిర్మాణ రంగం జోరుగా సాగింది. అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల్లో వేల మంది కార్మికులు పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ  చుట్టుపక్కల స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగింది. వందల నిర్మాణాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ఉన్న కార్మికులు సరిపోక ఇతర రాష్ట్రాల నుంచీ తీసుకొచ్చారు. కానీ జగన్‌ అధికారంలోకి రాగానే అమరావతిని అటకెక్కించడంతో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది. భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అప్పులు చేసి, స్థలాలు కొని, నిర్మాణాలు చేపట్టిన వారు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు.కొత్త ఇసుక విధానం పేరుతో అయిదు నెలలపాటు ఇసుక రీచ్‌లు బంద్‌ చేశారు. జగన్‌ సర్కార్‌ 2019 సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానం తెచ్చింది. ఆ సమయంలో నదుల్లో నీరు ఉండడంతో ఇసుక లభ్యం కాలేదు. దీంతో ఎక్కడిపనులు అక్కడ నిలిచిపోయి నిర్మాణ రంగం ఉక్కిరిబిక్కిరైపోయింది.


బలైపోయింది ఎవరు?

రాష్ట్రంలో తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్‌ బెండింగ్‌ మేస్త్రీలు, సెంట్రింగ్‌, సామగ్రి  మోసే కార్మికులు, సీలింగ్‌ పనిచేసేవారు, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగులు, ప్లంబర్లు, టైల్స్‌ వేసేవారు, పెయింటర్లు, కంకర,  ఇటుకలు, ఇసుక మోసే కార్మికులు.


50 లక్షల మందిని హింసించారు

రాష్ట్రంలోని 59 రంగాల్లో పనిచేసే కార్మికులు తమ పేర్లను కార్మిక శాఖలో నమోదు చేసుకుంటారు. ఇలా నమోదైన వారు  19.46 లక్షల మంది ఉన్నారు. నమోదు చేసుకోని వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. మొత్తంగా సుమారు 50 లక్షల మంది ఉంటారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. నిర్మాణ రంగంపై పరోక్షంగా ఆధారపడిన లారీ, ఆటో, ట్రాలీల డ్రైవర్లు, వాటి యజమానులు, నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణదారులు, వాటిలో పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, రాడ్‌ బెండింగ్‌, సెంట్రింగ్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, టైల్స్‌ మేస్త్రీలు, రంగులు వేసేవారు... ఇలా అనేక వర్గాల కార్మికులు లక్షల మంది జగన్‌ పాలనలో నష్టపోయారు.


ఆ ప్రకటనతో అంతా అస్తవ్యస్తం..

విజయవాడలో జగన్‌ మూడు రాజధానుల ప్రకటనతో అంతా తారుమారైంది. కొత్తగా భవనాలు నిర్మించడానికి యజమానులు ముందుకు రాకపోవడంతో పనులే ఉండడం లేదు. విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్దకే వేయి మంది వరకు కార్మికులు నిత్యం వస్తున్నారు. వచ్చిన వారిలో సగం మంది పనిలేక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ‘‘చంద్రబాబు హయాంలో అమరావతిలో నిర్మాణాలు జోరుగా సాగినప్పుడు మాకు గిరాకీ ఉండేది. రోజుకు రూ.1200 ఇచ్చి మరీ తీసుకెళ్లేవారు. ప్రస్తుతం  రూ.800 కూడా రావట్లేదు’’ అని కార్మికులు వాపోతున్నారు.


హైదరాబాద్‌ వెళ్లిపోతున్నారు..

బాపట్ల జిల్లా అద్దంకికి చెందిన మేము ఏడేళ్ల క్రితం విజయవాడలో స్థిరపడ్డాం. నేను నా భర్త ఇద్దరం కలిసి ఇక్కడే మేస్త్రీ పని  చేసుకునేవాళ్లం. రాజధాని పనులు ఆగిపోవడంతో మా ఇద్దరిలో ఒక్కరికే పని దొరుకుతోంది. వారానికి మూడు రోజులపాటు ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. పిల్లల ఫీజులు భారమై ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాం. ఇక్కడ పనిచేసిన వాళ్లు చాలా మంది హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మేం కూడా వెళ్లిపోదాం అనుకుంటున్నాం.

ఇదీ విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఓ కూలి ఆవేదన


బోర్డును... భోంచేశారు!

భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో అలమటిస్తుంటే జగన్‌ వాళ్ల నిధులను మింగేసి, ఏమీ పట్టనట్లు వ్యవహరించారు. కార్మికులను ఆదుకునేందుకు సంక్షేమ బోర్డు ఉంది. దీనికి నిర్మాణదారులు భవన నిర్మాణ విలువలో ఒక శాతం పన్ను చెల్లిస్తారు. బోర్డు వద్ద రూ.2,500 కోట్లకుపైగా నిధులు ఉండగా... ఇందులో నుంచి రాష్ట్ర ఫైనాన్సియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ పేరుతో  రూ.750 కోట్లు లాగేశారు.

  • కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయించుకోవడమే కాకుండా వై.ఎస్‌.ఆర్‌. బీమా పథకం కోసం ఏటా రూ.300 కోట్ల వరకు మళ్లించేస్తున్నారు. ఇలా ఐదేళ్లలో రూ.1,500 కోట్లు మళ్లించారు.
  • కార్మికులకు నవరత్నాల పథకాలు అందిస్తున్నామంటూ సంక్షేమ బోర్డు కార్యక్రమాలను జగన్‌ సర్కారు పూర్తిగా నిలిపివేసింది. నిర్మాణదారుల నుంచి ఒక శాతం పన్ను వసూలుచేసి, ఇతర అవసరాలకు వాడేసుకుంది.
  • భవన నిర్మాణ కార్మికులకు వై.ఎస్‌.ఆర్‌. కల్యాణమస్తు పథకాన్ని 2022 అక్టోబరు నుంచి అమల్లోకి తెచ్చింది. 2019 నుంచి 2022 వరకు పెళ్లిళ్లు చేసుకున్న వేల మంది కార్మికుల పిల్లలకు బోర్డు నుంచి సహాయం అందలేదు.
  • కరోనా మొదటి దశలో కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల నుంచి ప్రతి కార్మికుడికి రూ.5వేల సాయం అందుతుందని కేంద్రం    ప్రకటించింది. రాష్ట్ర కార్మిక శాఖ సైతం వివరాలు సేకరించింది. సాయం అందుతుందనే ఆశతో వేల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారు.   కానీ ఒక్కపైసా కూడా    కార్మికులకు అందలేదు.
  • కార్మికుల కుటుంబాల్లో యజమాని కాకుండా ఇతరులకు ప్రమాదం జరిగి శాశ్వత వైకల్యం ఏర్పడినా పరిహారం అందలేదు. గతంలో బోర్డు నుంచి సహాయం ఇచ్చేవారు. వై.ఎస్‌.ఆర్‌. బీమాలో వీరిని కలిపేయడంతో యజమానికి తప్ప ఇతరులకు పరిహారం అందడం లేదు.
  • నిర్మాణ రంగ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి నిధులు, పథకాలు ఇవ్వడం లేదు.
  • కొన్నిచోట్ల భార్యాభర్తలు, వారి పిల్లలు భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్నారు. వీరి పేర్లు బోర్డులోనూ నమోదయ్యాయి. ఇలాంటి కుటుంబాల్లో యజమాని చనిపోతేనే బీమా పరిహారం వస్తుంది. మిగతా వారికి వర్తించడం లేదు. జగన్‌ సర్కార్‌ ఇవేమీ పట్టించుకోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని