అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి.
కార్పొరేషన్ల పేరిట జగన్ దగా
స్వయం ఉపాధికి ఒక్క రూపాయీ ఇవ్వని వైకాపా సర్కారు
అనుచరగణం, అస్మదీయులకే లబ్ధి
ఈనాడు, అమరావతి
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. వారికి వెన్నుదన్నుగా ఉండాల్సిన కార్పొరేషన్లను నీరుగార్చారు. నిధుల కేటాయింపులను విస్మరించారు. అసలు లక్ష్యాన్ని కాలదన్ని.. పేదల వెన్నువిరిచారు. కార్పొరేషన్లను ఓట్లు రాల్చే యంత్రాలుగా మార్చి.. ఆ వర్గ పేదలను పావులుగా మలచి.. వారిపై కుట్రపన్నడంలో ‘అగ్ర’భాగాన నిలిచారు జగన్!
క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర అగ్రకులాల్లోని పేదల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. వాటికి తగిన నిధులు కేటాయిస్తాం. ఈ వర్గాల పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు అండగా నిలుస్తాం.
ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్
ఓ సినిమాలో హాస్యనటుడు ఇంటి పైకప్పునకు కోడిని వేలాడదీస్తారు. దాన్ని చూసి భోజనం చేస్తూ.. మాంసం కూర తింటున్నట్లుగా అనుభూతి పొందుతారు. అచ్చం ఇదే మాదిరిగా తయారైంది రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. నిధులను దండిగా కేటాయించినట్లు కాగితాలపై చూపిస్తారు. కానీ ఆ వర్గాలకు ఒక్క రూపాయి కూడా రాయితీ రుణం అందదు. ఉపాధి లభించదు. ‘నవరత్నాల’ నిధులనే సామాజిక వర్గాల వారీగా విభజించారు. వాటినే కార్పొరేషన్లలో చూపించి తిమ్మిని బమ్మి చేశారు. ఇదీ.. కార్పొరేషన్ల పేరిట ఐదేళ్లపాటు ఆయన చేసిన మాయ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మోసం చేసిన జగన్.. అగ్రకులాల్లోని పేదలను కూడా ఇలాగే వంచించారు. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు తదితర అగ్రకులాల్లోని పేదల సంక్షేమానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టోలోనూ ఇదే అంశాన్ని నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే హామీని, మ్యానిఫెస్టోను గంగలో కలిపారు.
పేదలకు స్వయం ఉపాధి కోసం రాయితీ రుణాలు అందజేసి వారికి అండగా నిలవడమే కార్పొరేషన్ల లక్ష్యం. రాష్ట్రంలో తెదేపా ప్రభుత్వం 2014-19 మధ్య ఇదే చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో గతంలోని ప్రభుత్వాలు కూడా ఇలాగే కార్పొరేషన్లు ఏర్పాటుచేసి వివిధ వర్గాల అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచాయి. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టే నాటికే వివిధ వర్గాలకు కార్పొరేషన్లు ఉండగా.. అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేకంగా ‘ఆర్థికంగా వెనకబడిన తరగతుల కార్పొరేషన్’ ఏర్పాటుచేశారు. మళ్లీ దాని పరిధిలో రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ బ్రాహ్మణ తదితర కార్పొరేషన్లను నెలకొల్పారు. వీటి ద్వారా ఆయా అగ్రకులాల్లోని పేదలకు నిధులు కేటాయించి రాయితీ రుణాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ రుణాలతో స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని ఆ వర్గం పేదలు ఆశగా ఎదురుచూశారు. కానీ జగన్ తీరంతా రివర్సే కదా..! ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. వాటిని తన రాజకీయ కుతంత్రాలను అమలుచేసే సంస్థలుగా మార్చారు.
పింఛన్లు, ఉపకారవేతనాలు కార్పొరేషన్ల నిధులే..
సామాజిక భద్రత పింఛన్లు, ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంటు తదితరాలకు బడ్జెట్లో కేటాయించే నిధులనే మళ్లీ కార్పొరేషన్లలో చూపించారు. వివిధ పథకాల కింద లబ్ధిపొందే అగ్రకులాల వారిని సామాజిక వర్గాల వారీగా విభజించి... వారికి వెచ్చించిన మొత్తాన్ని ఆయా వర్గాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో మళ్లీ చూపించారు. ప్రతి ప్రభుత్వమూ అర్హులకు సాధారణంగా ఇచ్చే పథకాలే ఇవి. పైగా అందరికీ వర్తించేవే. వీటిని కూడా కార్పొరేషన్ల కింద చూపించి అగ్రకులాల్లోని వారికి ప్రత్యేకంగా మేలు చేసినట్టు మసిపూసి మారేడుకాయ చేశారు జగన్.
వైకాపా పునరావాస కేంద్రాలుగా..
అగ్రకులాల్లోని పేదల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు జగన్ పైకి చెప్పినా.. దాని వెనక ఆయన కుతంత్రం వేరే ఉంది. ఆ వర్గాల్లోని పేదల సంక్షేమాన్ని పక్కనపెట్టి రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కార్పొరేషన్లను వైకాపా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారు. ఒక్కో కార్పొరేషన్కు ఒక ఛైర్మన్, 12 మంది డైరెక్టర్లను నియమించారు. ఈ పదవులన్నింటినీ తన అనుచరగణం, అస్మదీయులకే కట్టబెట్టారు. జీతభత్యాలు, ఇతర సౌకర్యాల కింద వారికి ఇప్పటివరకు రూ.లక్షల ప్రజాధనాన్ని చెల్లించారు.
పేద మహిళలకూ టోకరానే..
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ‘ఈబీసీ నేస్తం’ కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు అగ్రకులాల పేద మహిళలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడానికి రెండు రోజుల ముందు మూడో విడత కింద 4.19 లక్షల మంది ఖాతాల్లో రూ.600 కోట్లు విడుదల చేస్తున్నట్లు బటన్ నొక్కారు. కానీ జగన్ ‘బటన్’ ఓ జీవితకాలపు లేటు కదా..! బటన్ నొక్కి దాదాపు 45 రోజులు దాటినా ఇప్పటివరకు ఒక్కరికి కూడా బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా ఇప్పట్లో ఆ నిధులు జమ అయ్యే అవకాశమూ లేదు. తన అస్మదీయులు, అనుచరులు చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి మాత్రం.. కోడ్ రావడానికి కొన్ని రోజుల ముందే రూ.వేల కోట్ల బిల్లులు చెల్లించారు. నిజంగా అగ్రకులాల్లోని పేద మహిళలకు ఆర్థికసాయం అందించాలన్న ఆలోచనే ఉంటే జగన్ ముందుగానే నిధులు విడుదల చేసేవారు. కానీ.. వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి ఈ ‘జగన్నాటకం’ ఆడారు..!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం
తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. -
ఏపీలో 5 వేల మంది ఒప్పంద ఉపాధ్యాయినుల మెడపై కత్తి
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) ఉపాధ్యాయినులు, భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. వీరి పనితీరును మదింపు చేసి ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చర్యలు చేపట్టింది. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) ప్రతినిధుల మధ్య మంగళవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. -
‘నాడు-నేడు’ అదే గోడు!
ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘నాడు-నేడు’ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐదారు నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గుత్తేదారు సంస్థలు సామగ్రి సరఫరాను నిలిపివేశాయి. చాలా బడుల్లో సిమెంటు లేక పనులు సాగట్లేదు. -
ఎగువ కాఫర్ డ్యాం సీపేజీకి కట్టడి ఎలా?
పోలవరం ప్రాజెక్టుకు పెను సవాల్గా నిలిచిన ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ పరిష్కారానికి అధికారులు దారులు వెతుకుతున్నారు. కేంద్ర జలసంఘం సూచన మేరకు గుత్తేదారు ఏజెన్సీ సంస్థ తరఫున ఆఫ్రి డిజైన్ కన్సల్టెన్సీ సంస్థను నియమించారు. -
62 ఏళ్లు పూర్తయ్యేవరకూ సర్వీసులో కొనసాగొచ్చు
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్లు పూర్తయ్యేవరకు సర్వీసులో కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పీఏసీఎస్ ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవీ విమరణ చేసి, ఇంకా 62 ఏళ్లు పూర్తికాకుంటే అలాంటివారిని పునర్నియమించాలని ఆదేశించింది. -
మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం
ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు డీఓ విధానం తొలగింపు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో డిపార్టుమెంట్ అధికారి(డీఓ) నియామక విధానాన్ని రద్దు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసమంటూ.. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ విధానానికి స్వస్తి పలికారు. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు మృతి
ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు అలియాస్ కృష్ణబాబు(71) మంగళవారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. -
గుంతల రోడ్లకు రెండు ప్రాణాలు బలి
రాష్ట్రంలో గుంతల రోడ్లు ప్రాణాలు తీస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లోపడి మరొకరు మంగళవారం మృతి చెందారు. రోడ్డు మీద గుంతలు పూడ్చలేని పాలకుల నిర్లక్ష్యం రెండు కుటుంబాలను దుఃఖంలో ముంచేసింది. -
తిరుమల చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి
శ్రీవారి దర్శనార్థం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. స్థానిక రచనా అతిథిగృహం వద్ద రేవంత్రెడ్డికి తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు.. ఏడాదికి రెండు సార్లు సందర్శించాలి: ప్రవీణ్ ప్రకాశ్
విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి రెండు పర్యాయాలు సందర్శించాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. -
ఇదీ సంగతి!
-
ఈవీఎంల ధ్వంసం ఘటనలపై ఎస్పీ ఆరా
పోలింగ్ రోజున ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలపై పల్నాడు ఎస్పీ మలికాగార్గ్ ఆరా తీశారు. మంగళవారం ఆమె రెంటచింతల మండలం పాల్వాయిగేటు, తుమృకోట గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. -
గూగులమ్మ ఇంట ఏఐ పంట
టెక్నాలజీ రంగంలో ఎక్కడ చూసినా కృత్రిమ మేధ (ఏఐ) హవానే. గూగుల్ వార్షిక డెవలపర్ సదస్సు ఏ/ఓ 2024 కూడా దీనికే పెద్ద పీట వేసింది. ఇటీవల జరిగిన ఈ సదస్సులో గొప్ప గొప్ప కృత్రిమ మేధ నమూనాలను ప్రదర్శించింది. -
ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా హైకోర్టులో వ్యాజ్యం
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ హైదరాబాద్లోని కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. -
ఎన్నికల ఘర్షణ కేసుల్లో 4,668 మంది గుర్తింపు
ఎన్నికల ముందు రోజు, ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసుల్లో 4,668 మందిని గుర్తించి కొంత మందిని అరెస్ట్ చేశామని, మరికొందరికి నోటీసులు జారీ చేశామని డీజీపీ హరీశ్కుమార్ గుప్తా తెలిపారు. -
సంక్షిప్త వార్తలు
తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.