10 ఏళ్ల పాటు నెలకు పది వేల వరకు పెన్షన్ పొందాలంటే..?

ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టిన మొత్తాన్ని బ‌ట్టి నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10వేల దాకా పింఛను వస్తుంది.  

Updated : 18 Nov 2021 20:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 25 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారు స్టాక్ మార్కెట్లు వంటి అధిక రిస్క్ ఉన్న పెట్టుబ‌డుల్లో మ‌దుపు చేయ‌గ‌ల‌రు. ఎందుకంటే వారికి రిస్క్ తీసుకునే సామ‌ర్థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. కానీ 60 అంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న వారు ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం కోసం దాచుకున్న డ‌బ్బును న‌ష్ట‌భ‌యం ఉన్న ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టలేరు. మంచి రాబ‌డితో పాటు ప్ర‌భుత్వ హామీ ఉన్న ప‌థ‌కాల‌ను ఎంచుకుంటే, వారి డ‌బ్బుకి భ‌ద్ర‌త ఉంటుంది. అలాంటిదే ప్రధాన మంత్రి వయ వందన యోజన (పీఎమ్‌వీవీవై) పథకం. ఇది సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది. 60 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 10 ఏళ్ల పాటు పింఛనుకు హామీ ఉంటుంది. దీన్ని లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) నిర్వహిస్తోంది. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40 శాతం. ఈ పథకంలో చేరేందుకు తొలుత 2020 మార్చి 31 మాత్రమే గడువు ఉండగా ప్రస్తుతం మార్చి 2023 వరకు పొడిగించారు.

పెట్టుబడులు: ఈ పథకాన్ని ఎల్ఐసీ మాత్రమే సీనియర్ సిటజన్ల (60 సంవ‌త్స‌రాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు) కోసం ఆఫర్ చేస్తోంది. అటువంటి వారు ఈ ఫథకంలో ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ వెబ్‌సైట్‌ ద్వారా గానీ గానీ, దగ్గరలోని ఎల్ఐసీ కార్యాలయాన్ని సంప్రదించి ఆఫ్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయొచ్చు.

ప్రీమియం ఇలా..: ఒక్కసారికి ప్రీమియం చెల్లించి పాలసీలో చేరాల్సి ఉంటుంది. కనీసం రూ.1.50 లక్షలు, గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టి పాలసీ కొనుగోలు చేయొచ్చు. చెక్కు, డీడీ, బ్యాంకర్స్ చెక్కు ద్వారా చెల్లించాలి.

పెన్షన్ చెల్లింపులు..: పీఎమ్‌వీవీవై నిర్దేశించిన వడ్డీరేటు ప్రకారం 10 ఏళ్లపాటు కచ్చితమైన పెన్షన్‌ను ఇస్తుంది. ఈ పథకం డెత్ బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తోంది. పాలసీదారుడు మరణిస్తే బీమా కొనుగోలు ధరను నామినీకి చెల్లిస్తారు. మెచ్యూరిటీ నాటికి పాలసీదారడు జీవించి ఉంటే.. పాలసీ కొనుగోలు చేసిన 10 ఏళ్లకు.. ఎంత ప్రీమియంకైతే కొన్నామో ఆ మొత్తం ఇచ్చేస్తారు. దీంతో పాటు పింఛను చివరి వాయిదాను పొందుతారు. పాలసీదారుకు/ పింఛనుదారుకు అనుకోకుండా ఏమైనా జరిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చట్టబద్ధ వారసులకు అందజేస్తారు.

పింఛను ఎలా ఇస్తారు?: పెట్టుబడిగా రూ.1.50 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా పెట్టాక నెల నెలా వడ్డీతో పింఛను అందిస్తారు. పెట్టిన సొమ్ముకు తగినట్టు నెలవారీ చెల్లింపులు ఉంటాయి. వడ్డీ 7.40 శాతంగా నిర్ణయించారు. నెలకు రూ.1000 నుంచి దాదాపు రూ.10 వేల దాకా పింఛను వస్తుంది. నెల నెలా వద్దనుకుంటే మూడు మాసాలకు, ఆరు నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి పింఛను అందుకునే వెసులుబాటు ఉంది. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్ (ఈసీఎస్) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే పింఛను జమ అవుతుంది. 

రుణ సదుపాయం: పాలసీ కొనుగోలు చేసిన తర్వాత 3 ఏళ్లకు రుణ సదుపాయాన్ని పొందొచ్చు. కొనుగోలు ధరలో గరిష్ఠంగా 75 శాతం మేరకు రుణం ఇస్తారు. 

స్వాధీనం చేస్తే: అత్యవసర వైద్య సహాయ సమయాల్లో పాలసీని స్వాధీనం (సరెండర్) చేసి 98 శాతం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. అత్యవసర వైద్య సహాయం లేదా తీవ్ర అనారోగ్య సమస్యల వల్ల డబ్బు కావాల్సి వచ్చి ఎక్కడా దొరక్కపోతే ఈ పాలసీని స్వాధీనం చేయొచ్చు. సొంత వైద్య ఖర్చులతో పాటు జీవిత భాగస్వామి అనారోగ్య ఖర్చు అవసరాలకు పాలసీని స్వాధీనపర్చొచ్చు.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని