సంక్షిప్త వార్తలు

ట్విటర్‌ యాప్‌ను తమ యాప్‌ స్టోర్లలో ఉంచాలా వద్దా? అని యాపిల్‌, గూగుల్‌ తర్జనభర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఘాటుగానే స్పందించారు.

Published : 27 Nov 2022 02:26 IST

యాపిల్‌, గూగుల్‌కు పోటీగా ఫోన్‌
ట్విటర్‌ను యాప్‌ స్టోర్ల నుంచి తొలగిస్తేనే: ఎలాన్‌ మస్క్‌  

ట్విటర్‌ యాప్‌ను తమ యాప్‌ స్టోర్లలో ఉంచాలా వద్దా? అని యాపిల్‌, గూగుల్‌ తర్జనభర్జన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఘాటుగానే స్పందించారు. ఒక వేళ యాపిల్‌, గూగుల్‌ కనుక తమ యాప్‌ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే మాత్రం యాపిల్‌, ఆండ్రాయిడ్‌ ఫోన్లకు పోటీగా ‘ప్రత్యామ్నాయ’ స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తానని స్పష్టం చేశారు.

ఇదంతా ఒక ట్వీట్‌ వల్లే..: ఒక వినియోగదారుడు చేసిన ట్వీట్‌ వల్లే ఇదంతా జరగడం గమనార్హం. ‘యాపిల్‌, గూగుల్‌ ఒక వేళ తమ యాప్‌ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలగిస్తే.. ఎలాన్‌ మస్క్‌ సొంతంగా స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయాల్సిందే. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ల గుత్తాధిపత్యాన్ని సగం దేశం సంతోషంగా వదిలేస్తుంది. అంగారక గ్రహానికి చేరే రాకెట్లను చేసే వ్యక్తికి స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేయడం ఒక లెక్కా?’ అని ట్వీట్‌ చేశారు. దీనికి మస్క్‌ స్పందిస్తూ ‘అంత వరకు రాదనుకుంటున్నాను. ఒక వేళ అదే జరిగితే నాకూ ఇంకో ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చు. కచ్చితంగా ఫోన్ల తయారీలోకి వస్తా’ అని స్పష్టం చేశారు. చాలా మంది ఈ ట్వీట్‌కు ప్రతిస్పందించారు. ‘కచ్చితంగా స్మార్ట్‌ఫోన్ల విపణిలో మస్క్‌ విప్లవాత్మక మార్పులను తీసుకొస్తారు’ అని ఒకరు ట్వీట్‌ చేస్తే..  ‘ఇది నిజంగా నాకు నచ్చింది. ఇప్పటికే ఆ పని జరుగుతూ ఉండొచ్చ’ని మరొకరు అన్నారు.


ముంబయి విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ విస్తరణకు అదానీ గ్రూప్‌ రూ.5,700 కోట్ల పెట్టుబడి

ముంబయి: ముంబయి పరిసరాల్లో పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా, అందివస్తున్న అవకాశాలపై పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం వచ్చే మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను మరింత విస్తరించేందుకు, అయిదేళ్లలో రూ.5,700 కోట్ల పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్‌ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని మహారాష్ట్ర విద్యుత్‌ పంపిణీ కంపెనీ (ఎంఎస్‌ఈడీసీఎల్‌)కి దీటుగా పవర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

* నవీ ముంబయి, ఖరగ్‌పుర్‌, పాన్వేల్‌, థానే జిల్లాల్లో విద్యుత్‌ పంపిణీ లైసెన్స్‌ కోసం మహారాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఎంఈఆర్‌సీ)ను సంప్రదించామని అదానీ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి అదానీ ఎలక్ట్రిసిటీ నవీ ముంబయి (ఏఈఎన్‌ఎం) వివరించింది.

* ముంబయి పరిసరాల్లో విద్యుత్తు పంపిణీ వ్యవస్థను అనిల్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఎనర్జీ నుంచి రూ.18,000 కోట్లకు స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్‌ నాలుగేళ్ల క్రితం ఈ రంగంలోకి అడుగు పెట్టింది. నవీ ముంబయి విమానాశ్రయ పనులను కూడా రూ.15,000 కోట్లతో చేపట్టిన సంగతి విదితమే.


50% సూక్ష్మ వ్యాపార సంస్థలు కొవిడ్‌ ప్రభావాన్నితట్టుకోలేకపోతున్నాయ్‌

బెంగళూరు: కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం నుంచి బయటపడేందుకు అవసరమైన ఆర్థిక సన్నద్ధతతో సూక్ష్మ తరహా వ్యాపార సంస్థలు లేవని ఓ నివేదిక తెలిపింది. సుమారు 40 శాతం సంస్థలకు రుణ తిరస్కరణలు ఎదురయ్యాయని.. తగిన హామీ ఇవ్వలేకపోవడం, వాటికి మంచి రుణ చరిత్ర లేకపోవడం ఇందుకు కారణమని పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎమ్‌ఈ) రంగంపై కొవిడ్‌-19 పరిణామాలు, లాక్‌డౌన్‌ ఆంక్షల ప్రభావం ఎలా ఉందనే అంశంపై స్వచ్ఛంద సంస్థ గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ మాస్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌ (గేమ్‌) అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం.. 21 శాతం వరకు సూక్ష్మ వ్యాపార సంస్థలు, రుణాల కోసం అవసరమైన ధ్రువీకరణపత్రాలు ఇవ్వలేకపోయాయి. ఆర్థిక సమస్యలతో పాటు నిర్వహణపరంగా కొవిడ్‌-19 పరిణామాల సమయంలోనూ, ఆ తర్వాతా వ్యాపారులకు ఎదురైన ప్రధాన సమస్యలనూ నివేదిక ప్రస్తావించింది. 2020, 2021లలో రెండు దఫాల్లో 1955 సూక్ష్మ తరహా వ్యాపార సంస్థలపై ఈ అధ్యయనాన్ని గేమ్‌ జరిపింది. కొవిడ్‌-19 ప్రభావం నుంచి తట్టుకునేందుకు 50 శాతం వరకు సంస్థలకు తగినంత సన్నద్ధత, వ్యూహాలు లేవని పేర్కొంది. బ్యాంకులు ప్రకటించిన, ప్రభుత్వ పథకాలపై బ్యాంకు మేనేజర్లు, క్షేత్ర స్థాయి అధికారులు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌లకు సంపూర్ణ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉందని గేమ్‌ వ్యవస్థాపకుడు రవి వెంకటేశన్‌ తెలిపారు. ఆత్మనిర్భర్‌ పథకం కింద తీసుకొచ్చిన పథకాలపై కేవలం 31 శాతం మందికే అవగాహన ఉందని నివేదిక పేర్కొంది.  


నవంబరు కార్ల అమ్మకాల్లో 30% వృద్ధి!
ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అంచనా

ముంబయి: దేశీయ కార్ల అమ్మకాలు నవంబరులో 30 శాతం పెరిగే అవకాశం ఉందని ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తాజా నివేదికలో పేర్కొంది. వాహనాల తయారీ పెరగడం, గిరాకీ ఎక్కువగా ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. వాణిజ్య వాహనాల అమ్మకాల్లో రెండంకెల వృద్ధి (15%) ఉండొచ్చని పేర్కొంది. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లోనూ సానుకూల వృద్ధి (10%) కొనసాగినా, ట్రాక్టర్ల అమ్మకాలు స్తబ్దుగా ఉండొచ్చని తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. మహీంద్రా అండ్‌ మహీంద్రా దేశీయ కార్ల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 64 శాతం పెరగొచ్చు. టాటా మోటార్స్‌ అమ్మకాల్లో 51 శాతం వృద్ధి ఉండొచ్చు. మారుతీ సుజుకీ అమ్మకాలు 18 శాతం పెరగొచ్చు. వాణిజ్య వాహనాలకొస్తే.. అశోక్‌ లేలాండ్‌ 16%, ఐషర్‌ మోటార్స్‌- మహీంద్రా అండ్‌ మహీంద్రా 13%, టాటా మోటార్స్‌ 8% చొప్పున అమ్మకాల్లో వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉంది.


17న జీఎస్‌టీ మండలి 48వ సమావేశం

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జీఎస్‌టీ మండలి 48వ సమావేశం డిసెంబరు 17న దృశ్య మాధ్యమ పద్ధతిలో జరగనుంది. కేసినోలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌, గుర్రపు పందేలపై జీఎస్‌టీ రేటు నిర్ణయం; జీఎస్‌టీ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటుపై రాష్ట్రాల ఆర్థిక మంత్రుల కమిటీ సమర్పించే నివేదికలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. జీఎస్‌టీ చట్టంలోని కొన్ని నిబంధనలను క్రిమినల్‌ చట్ట పరిధి నుంచి మినహాయించే అంశంపై అధికారుల కమిటీ సమర్పించే నివేదికను కూడా జీఎస్‌టీ మండలి పరిశీలించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని