చమురు ఉత్పత్తిలో మార్పులేదు:ఒపెక్‌

రష్యా చమురుపై పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలోనూ, ముడిచమురు ఉత్పత్తి రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల మేర తగ్గించాలన్న గత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒపెక్‌ దేశాలు ఆదివారం తెలిపాయి.

Published : 05 Dec 2022 04:35 IST

రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తి కోత కొనసాగింపు
ధరల పరిమితిని అంగీకరించకున్నా బ్యారెల్‌ 60 డాలర్లకే రష్యా విక్రయం

ఫ్రాంక్‌ఫర్ట్‌: రష్యా చమురుపై పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలోనూ, ముడిచమురు ఉత్పత్తి రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్ల మేర తగ్గించాలన్న గత నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒపెక్‌ దేశాలు ఆదివారం తెలిపాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడానికి తోడు చైనాలో గిరాకీ తక్కువగా ఉందనే భావనతో, నవంబరు 1 నుంచి చమురు ఉత్పత్తి తగ్గించాలని అక్టోబరులో నిర్వహించిన సమావేశంలో ఒపెక్‌+ రష్యా దేశాలు నిర్ణయించిన సంగతి విదితమే. ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు తమ సరఫరా లక్ష్యాలను మార్చకూడద’ని చమురు ఎగుమతి దేశాలు ఆదివారం నాటి సమావేశంలో పునరుద్ఘాటించాయి.

* ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్నందున, రష్యా ఎగుమతి చేసే చమురుకు గరిష్ఠ ధర 60 డాలర్లుగా నిర్ణయిస్తూ అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్‌తో పాటు ఐరోపా సమాఖ్య పరిమితి విధించింది. రష్యా చమురు దిగుమతిని నిషేధించాలనీ ఐరోపా దేశాలు నిర్ణయించాయి. సోమవారం నుంచి ఇది అమలు కానుంది. ఈ ప్రభావం ఎలా ఉంటుందో గమనించాల్సి ఉంది.

* రష్యా నుంచి ఐరోపా కనుక చమురు దిగుమతి చేసుకోకపోతే, ఆ ప్రభావం ప్రపంచంపై ఎలా పడుతుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సరఫరాలు తగ్గడం వల్ల, ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశం ఉంది. నెల క్రితం బ్యారెల్‌ ముడిచమురు ధర 98 డాలర్లు కాగా, ఇప్పుడు 86 డాలర్ల వద్ద ఉంది.

* తమ చమురుకు 60 డాలర్లలోపే చెల్లించాలన్న పాశ్చాత్య దేశాల నిర్ణయంపై పుతిన్‌ సర్కారు మండిపడింది. ధర తగ్గింపును సమర్థిస్తున్న దేశాలకు సరఫరా నిలిపివేస్తామని, రష్యా చమురుకు ఐరోపా దూరం కావాల్సి వస్తుందని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం రష్యా బ్యారెల్‌ 60 డాలర్ల చొప్పునే చమురు విక్రయిస్తుండటం గమనార్హం. ఇందువల్ల ‘పాశ్చాత్య దేశాల ధరల పరిమితిని అంగీకరించకపోయినా’ రష్యా అదే ధర వద్ద విక్రయాలు కొనసాగించే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని