టీమ్‌ఇండియా విజయంతో సుందర్ పిచాయ్‌ దీపావళి.. పాక్‌ ట్రోల్‌కు గట్టి కౌంటర్‌

పాక్‌పై టీమ్‌ఇండియా గెలుపు సంబరంతో గూగుల్ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా రోహిత్‌ సేనపై పాక్‌ నెటిజన్‌ చేసిన విమర్శలకు ఆయన గట్టి సమాధానమిచ్చారు.

Published : 24 Oct 2022 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ మెగా సమరంలో దాయాది పాకిస్థాన్‌పై టీమ్‌ఇండియా చిరస్మరణీయ విజయంతో భారతీయులకు దీపావళి పండగ ముందే వచ్చేసింది. గూగుల్‌ సీఈఓ, భారత సంతతికి చెందిన సుందర్‌ పిచాయ్‌ కూడా మ్యాచ్‌ సంబరంతోనే దీపావళి వేడుకలు చేసుకున్నారు. ఆ విషయాన్ని చెబుతూ ఆయన ఓ ట్వీట్ చేయగా.. ఓ పాక్‌ నెటిజన్ విమర్శించేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ విమర్శకుడికి సుందర్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

టీ20 ప్రపంచకప్‌ టోర్నీని భారత్‌ అద్భుతమైన విజయంతో మొదలుపెట్టింది. మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిపై టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. ముఖ్యంగా రోహిత్‌ సేన ఛేదనలో చివరి మూడు ఓవర్లు క్రికెట్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టాయి. ఈ మ్యాచ్ గురించి చెబుతూ సుందర్‌ పిచాయ్‌ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి వేడుకలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నా. నేను కూడా నిన్న జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లను ఈ రోజు మళ్లీ చూసి దీపావళి వేడుకలు చేసుకున్నా. అద్భుతమైన గేమ్‌.. టీమ్‌ఇండియా అత్యద్భుత ప్రదర్శన’’ అని పిచాయ్‌ రాసుకొచ్చారు.

కాగా.. ఈ ట్వీట్‌కు పాకిస్థాన్‌కు చెందిన ఓ నెటిజన్‌ స్పందిస్తూ రోహిత్‌ సేనపై విమర్శలు చేసే ప్రయత్నం చేశాడు. ‘‘మీరు(సుందర్‌ పిచాయ్‌ను ఉద్దేశిస్తూ) మొదటి మూడు ఓవర్లు చూడాల్సింది’’ అంటూ ఛేదనలో తొలి మూడు ఓవర్లలో టీమ్‌ఇండియా తడబడిన విషయాన్ని ప్రస్తావించాడు. అయితే అక్కడ నెటిజన్‌ ఏ జట్టు ఆడిన ఇన్నింగ్స్‌ అనేది స్పష్టంగా చెప్పకపోవడంతో ఈ ట్రోల్‌కు సుందర్‌ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ‘‘అది కూడా చూశా.. భువీ, అర్ష్‌దీప్‌ నుంచి అద్భుతమైన బౌలింగ్‌ స్పెల్‌’’ అంటూ బదులిచ్చారు.

ఆ తర్వాత సదరు ట్విటర్‌ యూజర్‌ తాను టీమిండియా ఇన్నింగ్స్‌ గురించి మాట్లాడుతున్నానని మరో ట్వీట్‌ చేసినప్పటికీ నెటిజన్లు అతడికి చురకలంటించారు. ‘‘అంత గొప్ప వ్యక్తి నీ ట్వీట్‌కు స్పందించడమే గొప్ప విషయం’’.. ‘‘పిచాయ్‌ సర్‌ మీరు సూపర్‌’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని