Work From Home: ఆఫీసుకెళ్తారా?లేక ఇంటి నుంచే పనిచేస్తారా?

ఇంటి నుంచి పనిచేసే విధానంపై ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రముఖ ఉద్యోగ కన్సల్టెన్సీ సంస్థ ‘సైకీ’.. ‘టెక్‌ ట్యాలెంట్‌’ పేరిట ఓ సర్వే నిర్వహించింది. 

Updated : 29 Jan 2022 18:40 IST

టెక్‌ ట్యాలెంట్ సర్వేలో ఆసక్తికర విషయాలు

ముంబయి: ఉద్యోగుల పనితీరులో కొవిడ్‌ మహమ్మారి అనేక మార్పులు తీసుకొచ్చింది. చాలా మంది ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడ్డారు. తొలుత కంపెనీ వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయాన్ని కల్పించినప్పుడు ఇబ్బంది పడ్డ ఉద్యోగుల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఇప్పుడు చాలా మంది ఆఫీసుకు వెళ్లడం కంటే ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నట్లు చెప్పారు.

ప్రముఖ ఉద్యోగ కన్సల్టెన్సీ సంస్థ ‘సైకీ’.. ‘టెక్‌ ట్యాలెంట్‌’ పేరిట ఓ సర్వే నిర్వహించింది. ఇందులో నాలుగు ఖండాల్లోని ప్రముఖ కంపెనీల మానవ వనరుల విభాగాల్లో పనిచేస్తున్న ఉన్నత స్థాయి లీడర్ల ద్వారా ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వే సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోంకు అలవాటు పడ్డారు. దాదాపు 82 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే ఇష్టపడుతున్నట్లు తెలిపారు. 

నివేదికలోని మరిన్ని అంశాలు...

* ఇంటి నుంచి పనిచేస్తే మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు, ఒత్తిడి కూడా ఉండడం లేదని 64 శాతం మంది ఉద్యోగులు తెలిపారు. 

* ఉద్యోగులతో సంప్రదింపులు జరపాల్సిన హెచ్‌ఆర్‌ విభాగానికి సైతం.. వర్చువల్‌గా మాట్లాడడం సాధారణ విషయంగా మారింది. 

* పూర్తిస్థాయిలో కార్యాలయాల్లో పనిచేసేలా కొత్త ఉద్యోగులను నియమించుకోవడం కష్టంగా మారిందని 80 శాతం మంది హెచ్‌ఆర్‌ మేనేజర్లు తెలిపారు. 

* కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్న చాలా మంది.. తమ సంస్థలు వర్క్‌ ఫ్రమ్‌ హోం సదుపాయం కల్పించాలని ఆశిస్తున్నారు. దీంతో కంపెనీలకు ఇక ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదని.. మంచి నైపుణ్యం గల ఉద్యోగులు కావాలంటే తప్పనిసరిగా వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాల్సిన అసవరం ఏర్పడింది.

* ఉద్యోగుల నియామక ప్రక్రియలో అభ్యర్థుల మానసిక స్థితిని అంచనా వేసే ప్రక్రియను ఉపయోగిస్తున్నట్లు కేవలం 18 శాతం నియామక మేనేజర్లు మాత్రమే తెలిపారు. 2019లో ఇది 68 శాతంగా నమోదైంది.

* వర్క్‌ ఫ్రమ్‌ హోం సాధారణ విషయంగా మారితే గనక ఆఫీసులు అప్పుడప్పుడు జరిగే సమావేశ కేంద్రాలుగా మారనున్నాయి.

* నైపుణ్యంగల ఉద్యోగులను అట్టిపెట్టుకోవాలంటే.. ఎప్పటికప్పుడు వారి ప్రతిభను గుర్తించి ప్రశంసించాల్సి ఉంటుంది. దాని కోసం కొత్త పద్ధతుల్ని అనుసరిస్తున్నట్లు 36 శాతం హెచ్‌ఆర్‌ విభాగాధిపతులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని