పీఎంఓ పేరుతో ఈ-మెయిల్స్‌.. వైద్యుడి అరెస్టు

ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేరుతో ఈ- మెయిల్స్‌ పంపిన ఓ వైద్యుడిని అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు....

Published : 29 Nov 2020 01:14 IST

అహ్మదాబాద్‌: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) పేరుతో ఈ- మెయిల్స్‌ పంపిన ఓ వైద్యుడిని అహ్మదాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్‌లో నివాసముండే విజయ్‌ పరీఖ్‌ అనే వైద్యుడు స్థానికంగా ఉండే పరిమళ్‌ గార్డెన్‌ ప్రాంతంలోని రెండు కార్యాలయాలను నితీశ్‌షా అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. అయితే కొన్ని రోజులు తర్వాత నితీశ్ ఆ కార్యాలయాలను వైద్యుడికి అప్పగించడానికి నిరాకరించాడు. దీంతో సదరు వైద్యుడు తన సమస్య త్వరగా పరిష్కారమవ్వాలని ఓ ఆలోచన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మెయిల్స్‌ వస్తే అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి తనకు తక్షణ న్యాయం చేస్తారని భావించాడు. ఈ క్రమంలో పీఎంఓ కార్యాలయం అధికారుల పేరుతో గుజరాత్‌ ఉన్నతాధికారులతో పాటు ఐపీఎస్‌ అధికారులకు తన సమస్యను వివరిస్తూ ఇటీవల మెయిల్స్ చేశాడు. 

వైద్యుడు విజయ్‌ రెండు కార్యాలయాలను ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు.. ఆ వ్యక్తి వాటిని తన పేరిట మార్చడం లేదని అందుకు వైద్యుడు పీఎంఓ కార్యాలయాన్ని సంప్రదించినట్లు.. రాష్ట్ర అధికారులు దీనిపై స్పందించాలని.. ఈ ఘటనకు సంబంధించి పీఎంఓ అధికారులు పర్యవేక్షిస్తున్నారని మెయిల్స్‌లో ఉంది. ఆ ఈ-మెయిల్‌ ఐడీలను పరిశీలించిన సైబర్‌ క్రైం పోలీసులు వాటిని పరీఖ్‌ అనే వైద్యుడు పంపినట్లు గుర్తించారు. తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం పీఎంఓ అధికారుల పేరును వాడుకున్న వైద్యుడిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని