ఆన్‌లైన్‌ ‘ఆట కట్టించారు’

సైబర్‌ నేరాల్లో నిందితుల్ని గుర్తించడమే గగనంగా మారుతున్న పరిస్థితుల్లో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు.

Updated : 31 Jan 2023 11:57 IST

8 మంది నిందితుల అరెస్టు.. రూ.41 కోట్లు జప్తు

ఈనాడు- హైదరాబాద్‌: సైబర్‌ నేరాల్లో నిందితుల్ని గుర్తించడమే గగనంగా మారుతున్న పరిస్థితుల్లో సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు. ఆన్‌లైన్‌ గేమ్‌ల పేరుతో ప్రపంచవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను అరెస్టు చేసి నిందితుల బ్యాంకు ఖాతాల్లోని రూ.41 కోట్లు జప్తు చేశారు. ఒక సైబర్‌ నేరానికి సంబంధించి ఇంత భారీ మొత్తంలో సొమ్ము జప్తు చేయడం దేశంలో ఇదే ప్రథమం. ఈ కేసులో 8 మంది నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. 193 సెల్‌ఫోన్లు, 21 ల్యాప్‌టాప్‌లు, 21 పీవోఎస్‌ యంత్రాలు, 416 చెక్‌బుక్‌లు, 233 డెబిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌ శింగెనవార్‌, సైబర్‌క్రైమ్స్‌ డీసీపీ రితిరాజ్‌ సోమవారం విలేకర్లకు వెల్లడించారు.

విదేశాల నుంచి ఆపరేషన్‌

విదేశాల్లో ఉండే కొందరు సైబర్‌ నేరగాళ్ల కనుసన్నల్లో ఆన్‌లైన్‌ గేమింగ్‌ దందా నడుస్తోంది. బెంగళూరుకు చెందిన మోహిన్‌ పాషా, ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌, హవల్దాని, నైనిటాల్‌కు చెందిన కరణ్‌ అరోరా, సంజీవ్‌కుమార్‌, గోకుల్‌ సింగ్‌ కోరంగా, దిల్లీలోని లక్ష్మీనగర్‌కు చెందిన కరణ్‌మల్హోత్రా, సోనూలోకేశ్‌, మోహిత్‌కుమార్‌, దినేశ్‌సింగ్‌లు నిరుద్యోగులు. గతంలో నకిలీ కాల్‌సెంటర్లలో టెలీకాలర్లుగా పనిచేశారు. తమతో కలిస్తే కమీషన్లు ఇస్తామని విదేశాలకు చెందిన కొందరు సైబర్‌ నేరగాళ్లు వీరిని ఒప్పించి ఈ గేమింగ్‌ దందా మొదలుపెట్టించారు. జూదం, బెట్టింగ్‌, క్యాసినో తదితర గేమ్స్‌ ఆడితే బాగా సంపాదించవచ్చంటూ ఆన్‌లైన్‌లో నిందితులు ప్రకటనలు గుప్పించారు. వీటిపై క్లిక్‌ చేయగానే వాళ్లు రూపొందించిన నకిలీ యాప్‌, వెబ్‌సైట్‌లోకి వెళ్తుంది. ఎవరైనా ఈ గేమ్‌లు ఆడితే తొలుత రూ.వేలల్లో లాభాలు ఇస్తారు. ఈ సొమ్మును వెబ్‌సైట్‌, యాప్‌లోని వ్యాలెట్‌లో జమ చేస్తారు. లాభాలు వస్తున్నాయని వరుసగా పెట్టుబడి పెడితే మోసం మొదలుపెడతారు. భారీ పెట్టుబడి పెడితే ఓడిపోయినట్లు చూపించి టోకరా వేస్తారు. బాధితులు మోసపోయిన సొమ్ములో నిందితులకు కమీషన్‌ వస్తుంది.

షాబాద్‌ కేసుతో కదిలిన డొంక..!

గతేడాది డిసెంబరులో రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలానికి చెందిన హర్షవర్ధన్‌ అనే యువకుడు గేమ్‌కింగ్‌ 567.కామ్‌ వెబ్‌సైట్‌లో కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ ఆడుతూ రూ.98.47 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు బాధితుడు పోగొట్టుకున్న సొమ్ము ఫోన్‌పైసా సంస్థ ఖాతాకు చేరినట్లు గుర్తించారు. అక్కడినుంచి నిందితులకు చెందిన బ్యాంకు ఖాతాకు బదిలీ అయ్యాయి. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో కూపీలాగిన పోలీసులకు దిల్లీ కేంద్రంగా ఈ చీకటి దందా నడుస్తున్నట్లు తెలిసింది. నిందితుల కదలికలపై నిఘా ఉంచి అక్కడ ఒకరిని అరెస్టు చేశారు. రెక్కీ వేసి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఖాతా ఒకరిది.. వినియోగించేది ఇంకొకరు

నిందితులు  వివిధ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల్ని గుర్తించి వారి నుంచి ఆధార్‌ సహా కొన్ని గుర్తింపు కార్డులు సేకరిస్తున్నారు. వీటి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిచి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఖాతా ఇతరులదే అయినా డెబిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ లావాదేవీలను నిందితులే నిర్వహిస్తున్నారు. లావాదేవీలకు వినియోగించినందుకు అసలైన ఖాతాదారుకు ప్రతినెలా కొంత కమీషన్‌ చెల్లిస్తున్నారు.  

కేసులో 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. మరికొందరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు. లావాదేవీల కోసం నిందితులు వివిధ ప్రాంతాలకు చెందిన 233 మంది బ్యాంకు ఖాతాలను వినియోగించారు. మోసాలకు తమ ఖాతాలు వినియోగిస్తున్నట్లు తెలిసినా కొందరు కమీషన్లకు కక్కుర్తిపడి సహకరించారు. వీరందరికీ నోటీసులు జారీ చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని