Rajasthan: పెట్రోల్‌ ట్యాంకర్‌లో మద్యం అక్రమ రవాణా..!

గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్‌ ట్యాంకర్‌లో అక్రమంగా రవాణా చేస్తున్న మద్యాన్ని రాజస్థాన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

Published : 04 Feb 2023 23:35 IST

జైపుర్‌: ఎవరికీ అనుమానం రాకుండా పెట్రోల్‌ ట్యాంకర్‌లో మద్యాన్ని దాచి అక్రమంగా రవాణా చేసేందుకు యత్నించిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్‌(Rajasthan)లో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు నిందితులు ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌లో 610 డబ్బాల అక్రమ మద్యాన్ని(Illicit Liquor) దాచి, పంజాబ్‌లోని లూథియానా నుంచి గుజరాత్‌(Gujarat)కు తరలించేందుకు బయల్దేరారు. మార్గమధ్యలోని రాజస్థాన్‌ పోలీసులకు ఈ విషయమై పక్కా సమాచారం అందింది.

ఈ మేరకు శనివారం ఓ పోలీసు బృందం ఇక్కడి చురు జిల్లాలో గుజరాత్ రిజిస్ట్రేషన్ నంబర్ గల ట్యాంకర్‌ను ఆపి తనిఖీ చేయగా.. మొత్తం 610 మద్యం డబ్బాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో బాబూలాల్ జాట్, రేవంత్ కుమార్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాహనంతోపాటు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పట్టుబడిన మద్యం విలువ రూ.60 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారం వెనుక ఎవరెవరున్నారో తేల్చేందుకు నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని