Crime: మైలురాయి చేరుకున్నందుకు యూట్యూబర్‌ పార్టీ.. గొడవలో స్నేహితుడు మృతి

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడాలో యూట్యూబర్‌ నిర్వహించిన పార్టీలో గొడవ జరిగి ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

Published : 01 Feb 2024 06:48 IST

నోయిడా: యూట్యూబ్‌లో మైలురాయి చేరుకున్నందుకు ఓ యూట్యూబర్‌ ఇచ్చిన పార్టీ.. తన స్నేహితుడి మరణానికి దారితీసింది. ఈ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూట్యూబర్‌ మనీశ్‌ సింగ్‌ జనవరి 28న యూట్యూబ్‌లో తన లక్ష్యాన్ని చేరడంతో స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఈ విందుకు తన స్నేహితుడైన దీపక్‌ సింగ్‌(25)ను సైతం ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆ పార్టీకి వచ్చిన కొంత మంది వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అప్పటికే అందరూ మద్యం సేవించి ఉండటంతో ఘర్షణ పడ్డారు.

ఈ క్రమంలో దీపక్‌ సింగ్‌ తలపై యోగేంద్ర, విజయ్‌ ముష్టిఘాతాలు కురిపించారు. అనంతరం దీపక్‌ ఇంటికెళ్లాడు. అదే రోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ దీపక్‌ సింగ్‌ జనవరి 29న మృతి చెందాడు. తలలో రక్తం గడ్డకట్టడం వల్లే చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. యూట్యూబర్‌ మనీష్‌సింగ్‌ తండ్రి ఫిర్యాదు మేరకు దన్‌కౌర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. నిందితులిద్దరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని