logo

వాగులు దాటేదెలా.. గమ్యం చేరేదెలా?

జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోని వాగులపై వంతెనలు లేక ఆయా గ్రామాలవాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు.

Published : 04 Jun 2023 03:07 IST

వంతెనలు లేక గిరిజనుల అవస్థలు..

గత వర్షాకాలంలో అల్లికోరి నుంచి కాన్పు కోసం ఎడ్ల బండిపై గర్భిణిని తీసుకెళ్తున్నారిలా.. (పాత చిత్రం)

ఇంద్రవెల్లి, న్యూస్‌టుడే : జిల్లాలోని ఉట్నూరు ఏజెన్సీలో ఉన్న మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల్లోని వాగులపై వంతెనలు లేక ఆయా గ్రామాలవాసులు నిత్యం అవస్థలు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో నాలుగు నెలలపాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండాల్సిన దుస్థితి. ఇంద్రవెల్లి, ఉట్నూరు, నార్నూరు, సిరికొండ, ఆదిలాబాద్‌ గ్రామీణం తదితర మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక వాగులు దాటి రాకపోకలు సాగించడం పరిపాటి. ఈ వాగులపై వంతెనలు నిర్మిస్తే రాబోయే వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందులు ఉండవని ఆయా గ్రామాలావాసులు కోరుతున్నారు.

ఏజెన్సీలో సమస్యలు ఇలా..

* ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని అల్లికోరి పంచాయతీ కేంద్రానికి వెళ్లాలంటే అడ్డుగా వాగు ఉంది. గత వర్షాకాలంలో గర్భిణులను ప్రసూతి కోసం ఎడ్లబండ్లతో వాగులు దాటించి ఇంద్రవెల్లి పీహెచ్‌సీకి తీసుకొస్తుండగా వాగు పక్కన ప్రసవం అయింది. అల్లికోరి గ్రామంలో 75 కుటుంబాల్లోని 305 మంది వాగు దాటి రావాల్సిన పరిస్థితి ఉందని గ్రామ పటేల్‌ గంగారాం తెలిపారు.

* ఇంద్రవెల్లి మండల కేంద్రం నుంచి ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని చిద్దరి, ఖానాపూర్‌, అల్లికోరి తదితర పంచాయతీల పరిధి గ్రామాలతోపాటు ఇంద్రవెల్లి మండలం మర్కాగూడ పంచాయతీకి తారు రోడ్డుపై సట్వాజిగూడ వాగు అడ్డుగా ఉంది. దీనిపై రోడ్డు డ్యాం నిర్మించారు. భారీ వర్షాలు కురిసి వాగు పొంగితే వరద తగ్గేవరకు గంటల తరబడి వర్షంలో వేచి ఉండాల్సిన పరిస్థితి. అప్పటి ఐటీడీఏ పీవోలు భవేష్‌ మిశ్రా, అంకిత్‌లతోపాటు పలువురు అధికారులు పరిశీలించి రోడ్డు డ్యాంపై కల్వర్టు నిర్మించడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా.. మంజూరు కాలేదు.

* ఇంద్రవెల్లి మండలంలోని వడ్‌గాం పంచాయతీ పరిధి జైత్రాంతండా, జెండాగూడ గ్రామాలకు వెళ్లేందుకు వాగులు అడ్డంగా ఉన్నాయి. ఈ వాగులపై వంతెనలు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌ పంచాయతీ పరిధిలోని గోపాల్‌పూర్‌ గ్రామానికి వెళ్లాలంటే సిరికొండ మండలం కన్నాపూర్‌ పంచాయతీ పరిధిలోని కన్నాపూర్‌ వాగు దాటి వెళ్లాలి.

* ఉట్నూరు మండలం నర్సాపూర్‌(జే), వంకతుమ్మ, వడ్‌గల్‌పూర్‌ గ్రామాలకు వెళ్లేందుకు వాగులపై వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గతేడాది నిధులు మంజూరు చేసింది. అయితే పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు.

* ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(జి), మామిడిగూడ(బి) గ్రామాలకు రోడ్డు సౌకర్యంతో పాటు వడ్‌గాం వాగుపై వంతెన లేక వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు. 2020లో అప్పటి పాలనాధికారి దివ్య దేవరాజన్‌ వడ్‌గాం దాటి మామిడిగూడ గ్రామానికి వెళ్లి రోడ్డు నిర్మాణానికి రూ.18 లక్షలు మంజూరు చేసినా ఇంకా ఐటీడీఏ ఇంజినీరింగ్‌ అధికారులు పనులు ప్రారంభించలేదు. గత వర్షాకాలంలో గర్భిణిని కాన్పుకోసం తీసుకొస్తుండగా వాగు పొంగిపోవడంతో వాగు పక్కన ప్రసవించింది.

ఆదిలాబాద్‌ మండలం అల్లికోరి గ్రామ పంచాయతీ కేంద్రానికి వెళ్లడానికి అడ్డంగా ఉన్న వాగు

ప్రతిపాదనలు పంపాం

ఉట్నూరు డివిజన్‌లో వాగులు దాటి పోయే గ్రామాల వివరాలు, వంతెనల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇంకా మంజూరు రాలేదు. ఇంద్రవెల్లి మండలం మర్కాగూడ పంచాయతీ పరిధిలోని తారు రోడ్డుపై వర్షాకాలంలో కొట్టుకుపోయిన వంతెన నిర్మాణానికి రూ.12 లక్షలు మంజూరయ్యాయి.

పవార్‌ రమేష్‌, డిప్యూటీ ఈఈ, పీఆర్‌, ఉట్నూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని