logo

వసూలు రూ. కోట్లు.. స్వాధీనం రూ.లక్షలు..!

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొలుసుకట్టు మోసాల సంస్థ సంకల్పసిద్ధి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొంతమంది నిందితులను అరెస్టు చేసి దాదాపు రెండు నెలలు గడిచినా.. ఆస్తులను గుర్తించిన దాఖలాలు లేవు.

Published : 27 Jan 2023 03:54 IST

పరారీలోనే కీలక పాత్రధారి
ఈనాడు, అమరావతి

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొలుసుకట్టు మోసాల సంస్థ సంకల్పసిద్ధి దర్యాప్తు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొంతమంది నిందితులను అరెస్టు చేసి దాదాపు రెండు నెలలు గడిచినా.. ఆస్తులను గుర్తించిన దాఖలాలు లేవు. కొన్ని డాక్యుమెంట్లు లభించినా.. వాటి విశ్లేషణలు చేయలేదు. ఆస్తుల మదింపు జరగలేదు. మరోవైపు కీలక పాత్రధారి విదేశాలకు పరారుకాగా అసలు సూత్రధారులనే గుర్తించలేదు. ఓ లారీ క్లీనర్‌ తక్కువ కాలంలో రూ.కోట్లకు పడగలెత్తిన వైనం ఈ మోసంతో వెలుగు చూసింది. ఈ గొలుసు కట్టు సంస్థ వెనక ఇద్దరు కీలక నేతలు ఉన్నట్లు భారీగా ప్రచారం జరిగింది. ఆ నేతలకు భారీగా ఫండ్‌ వెళ్లినట్లు తెలిసింది. కానీ ఆ దిశగా దర్యాప్తు నడవలేదు.  

రూ.కోట్ల ఆస్తులు ఎక్కడ..?

ప్రస్తుతం పోలీసులు గుర్తించిన వాటిలో నగదు చాలా తక్కువ లభించింది.  ప్రకాశం జిల్లా కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచే విధంగా ఒక అగ్రోస్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. మూడు పోలీసు బృందాలు కనిగిరి వెళ్లి విచారణ చేశాయి. ఇక్కడ మార్కెట్‌ విలువ ప్రకారం ఈ భూమి రూ.కోట్లలో ఉంటుంది. అక్కడే మరో 50 ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. సంస్థ తరపున కాకుండా యజమాని గుత్తా వేణుగోపాలకృష్ణతో  ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇవేవీ ఇంకా దర్యాప్తులో మాత్రం వెలుగులోకి రాలేదు. అరెస్టు సమయంలో లభించాయంటున్న డాక్యుమెంట్ల వివరాలు ఏమిటనేది పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా వెల్లడించలేదు. సంస్థ యాప్‌లో  వసూలు చేసిన సొమ్ము వివరాలు మొత్తం ఉన్నట్లు తెలిసింది. సైబర్‌ క్రైం పోలీసులు దీన్ని ఛేదించాల్సి ఉంది. ఈ సంస్థ ప్రారంభించన సమయంలో కొంతమందికి తాయిలాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఓ పోలీసు అధికారి ఉన్నారు. వీరిపై చర్యలు లేవు. ఇతర వ్యక్తులకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారని భావించినా అడుగు ముందుకుపడలేదు.

ప్రజల నుంచి సేకరించిన సొమ్ము(అంచనా): రూ.1100కోట్లు

పోలీసులు వేసిన అంచనా : రూ.250 కోట్లు

స్వాధీనం చేసుకున్న సొమ్ము: రూ.51.60లక్షలు,

రెండు కార్లు, బంగారం: 728గ్రా, వెండి:9.5కేజీలు

అరెస్టైన నిందితులు : 12 మంది

ఈ కేసులో బెంగళూరుకు చెందిన కిరణ్‌ కీలక పాత్రధారిగా పోలీసులు గుర్తించారు. గత ఏడాది నవంబరు 28న అయిదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. తర్వాత మరి కొందరును  అరెస్టు చేశారు. దీనిలో ప్రధాన పాత్రధారి గుత్తా వేణుగోపాల్‌. కిరణ్‌ కీలకంగా వ్యవహరించారు. అయిదో తరగతి చదివిన వేణుకు అంతగా అవగాహన లేదు. ప్రస్తుతం కిరణ్‌ వద్దనే కీలక పత్రాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయన పోలీసులకు దొరకలేదు. మరోవైపు పోలీసులు మాత్రం అతనికి పాసుపోర్టు కూడా లేదని చెప్పుకొస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని