logo

ఇప్పుడిస్తే ఎలా?

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తనిఖీలతో పాఠశాలల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు లెసన్‌ ప్లాన్‌ రాయకపోవడం, వర్క్‌బుక్స్‌ దిద్దకపోవడం వంటివి ఆయన పరిశీలనలో పలుచోట్ల వెలుగుచూశాయి.

Published : 03 Feb 2023 05:25 IST

సిలబస్‌  ముగిసేవేళ... వర్క్‌బుక్స్‌ రాక
ప్రిన్సిపల్‌ సెక్రటరీ తనిఖీలతో అప్రమత్తం

ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ తనిఖీలతో పాఠశాలల్లో అనేక లోపాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా ఉపాధ్యాయులు లెసన్‌ ప్లాన్‌ రాయకపోవడం, వర్క్‌బుక్స్‌ దిద్దకపోవడం వంటివి ఆయన పరిశీలనలో పలుచోట్ల వెలుగుచూశాయి. ఆర్జేడీలు, డీఈఓలు ఇంతమంది యంత్రాంగం ఉండి కనీసం ఎవరేం చేస్తున్నారో కూడా చూడడం లేదని అధికారుల తీరును తప్పుబట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో గుంటూరు, పల్నాడు, బాపట్ల డీఈఓలు నిత్యం తమ పరిధిలో ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి టీచర్ల పాఠ్య ప్రణాళిక నుంచి విద్యార్థులు రాసే పుస్తకాల దాకా ప్రతిదీ చూస్తున్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం చెప్పుకోవడానికి ఉంటుందని ఉమ్మడి గుంటూరులో ముగ్గురు డీఈఓలు పాఠశాలల తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు.

సస్పెన్షన్లు, తాఖీదులు

నాలుగు రోజుల క్రితం గుంటూరు మండలం వెంగళాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలోని విలీన టీచర్లు ఇద్దరు పిల్లలు రాసిన వర్క్‌బుక్స్‌ కరెక్షన్‌ చేయలేదని ఏకంగా వారిపై గుంటూరు డీఈఓ శైలజ సస్పెన్షన్‌ వేటు వేశారు. తాజాగా బుధవారం నగరంలోని కొత్తపేట 28వ నంబరు స్కూల్‌కు పరిశీలనకు వెళ్లగా అక్కడ నలుగురు ఉపాధ్యాయుల పనితీరు బాగోలేదని షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు వర్క్‌బుక్స్‌ రాయించడం లేదని, దిద్దడం లేదని గుర్తించి ఆ మేరకు తాఖీదులు ఇవ్వాలని ఆదేశించారు. మరో పాఠశాలలో టీచర్‌ ఒకరు వర్క్‌బుక్‌ను యూట్యూబ్‌లో చూసి రాయాలని చెప్పి కనీసం రాయించే విధానం కూడా పిల్లలకు చెప్పటం లేదని తల్లిదండ్రుల నుంచి అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ బడికి వెళ్లి పరిశీలించగా అక్కడ పిల్లలకు వర్క్‌బుక్‌ రాయడం నేర్పించడం లేదని తేలింది. పల్నాడు డీఈఓ వెంకటప్పయ్య సైతం ఇటీవల నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లోని పలు పాఠశాలలు తనిఖీ చేశారు. అక్కడి ఉపాధ్యాయులతో సమావేశాలు పెట్టి లోపాలను అంతర్గత సమీక్షలో చెప్పి అవి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. మరోసారి పర్యటనకు వచ్చేనాటికి లోపాలను సరిదిద్దుకోకపోతే సస్పెండ్‌ చేస్తానని సుతిమెత్తగా మందలించి వదిలేశారు. మొత్తంగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ పర్యటనలతో విద్యాశాఖ యంత్రాంగం అప్రమత్తమై స్కూళ్లకు వస్తుండడంతో టీచర్లు వణికిపోతున్నారు. ఇప్పటివరకు విధి నిర్వహణలో అలసత్వంగా ఉన్న వారు తమ లోపాలను సవరించుకుని ముందుకు సాగుతున్నారు.


ఆలస్యంగా ఇచ్చి టీచర్లను తప్పుపడుతూ...

వాస్తవంగా విద్యార్థులకు వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు పునః ప్రారంభమైన తర్వాత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తారు. వాటితో పాటే వర్క్‌బుక్స్‌ ఇవ్వట్లేదు. తరగతులు ప్రారంభమైన మూడు నెలల తర్వాత వాటిని అందిస్తే అప్పటికే చాలా వరకు సిలబస్‌ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత వాటిని ఇస్తే తిరిగి వెనక్కు వెళ్లి ఏం చెబుతామని చెప్పి ప్రస్తుత సిలబస్‌కు అనుగుణంగా వర్క్‌బుక్స్‌ రాయిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అధికారులు మాత్రం మొదటి నుంచి ఎందుకు రాయించలేదని చెప్పి టీచర్లను ప్రశ్నిస్తున్నారు. సకాలంలో పుస్తకాలిస్తే రాయించేవాళ్లమని అంటున్నారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలలకు వర్క్‌బుక్స్‌ పంపుతూనే ఉన్నారు. ‘ఈ వ్యవస్థాపరమైన లోపాలను టీచర్లపై రుద్దటం సరికాదు. సకాలంలో పుస్తకాలివ్వకపోతే వర్క్‌బుక్స్‌ అన్నీ రాయించటం ఎలా సాధ్యమని’ యూటీఎఫ్‌ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్‌, ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు బసవలింగారావు నిలదీశారు. వర్క్‌బుక్స్‌ ఒక్కటే కాదు 8వ తరగతికి చెందిన కొన్ని టైటిళ్లు ఇవ్వలేదు. మరికొన్ని తరగతుల పుస్తకాలు ఇంకా అందాల్సిన విద్యార్థులు ఉన్నారు. ఈ మధ్యే కొన్ని టైటిళ్లను స్కూళ్లకు పంపారు. తొలుత ఇండెంట్‌ ప్రకారం పంపలేదని చెప్పి వాటిని ఇప్పుడు అందజేస్తున్నారు. ఇవన్నీ వ్యవస్థాపరమైన లోపాలే. వాటికి టీచర్లను సస్పెండ్‌ చేయటం, షోకాజ్‌ నోటీసులిచ్చి సంజాయిషీలు కోరటం సరికాదు. అన్నీ సకాలంలో ఇచ్చి టీచర్లు పాఠ్యాంశాలు బోధించకపోయినా, పిల్లలతో వర్క్‌బుక్స్‌ రాయించకపోయినా, వాటిని దిద్దకపోయినా చర్యలు తీసుకుంటే తమకేమి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని