logo

Crime News: ‘నా భర్తను చంపేయ్‌.. సంతోషంగా ఉందాం’

ఈనెల 11న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసును శంకర్‌పల్లి పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు.

Updated : 17 Jul 2022 08:49 IST

ప్రియుడితో.. హత్య చేయించిన భార్య

కేసును ఛేదించిన పోలీసులు

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఈనెల 11న రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జరిగిన పండ్ల వ్యాపారి హత్య కేసును శంకర్‌పల్లి పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను శనివారం రిమాండ్‌ తరలించారు. శంకర్‌పల్లి ఠాణాలో శనివారం చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ మహేష్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14ఏళ్ల క్రితం పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకున్నాడు. అక్కడికి వారానికోసారి వచ్చి వెళ్తుండేవాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్‌(వ్యాయామశాల) ట్రైనర్‌ తిరుపతిరావు(25)తో రెండు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. తన భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. అనంతరం శంకరయ్య హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని.. చంపాలని ప్రియుడుకి చెప్పింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా.. టంగటూర్‌ గ్రామ శివారులో తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. పోలీసులు నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్‌ ఆధారంగా శుక్రవారం గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామం. హత్య కేసును వేగంగా చేధించిన సీఐ, ఎస్సైలతో పాటు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని