logo

ఉత్తుత్తి మేడలు.. కోట్లకు పడగలు

మహానగరంలో కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రీలాంచ్‌ పేరుతో వేలాది మందిని రూ.వందల కోట్ల మేర నష్టానికి గురి చేస్తున్నారు. ఏడాదిగా రాజధాని చుట్టపక్కల ప్రీ లాంచ్‌ వెంచర్ల పేరుతో దాదాపు రెండువేల మంది మోసపోయారని,  రెండేళ్లలో కనీసం రూ.200 కోట్ల వరకు బాధితులు నష్టపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.

Published : 27 Jan 2023 04:01 IST

ప్రీలాంచ్‌ పేరుతో నిండా ముంచుతున్న కొన్ని రియల్‌ సంస్థలు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

హానగరంలో కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రీలాంచ్‌ పేరుతో వేలాది మందిని రూ.వందల కోట్ల మేర నష్టానికి గురి చేస్తున్నారు. ఏడాదిగా రాజధాని చుట్టపక్కల ప్రీ లాంచ్‌ వెంచర్ల పేరుతో దాదాపు రెండువేల మంది మోసపోయారని,  రెండేళ్లలో కనీసం రూ.200 కోట్ల వరకు బాధితులు నష్టపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. కూకట్‌పల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రీలాంచ్‌ కుంభకోణంలోనే అనేకమంది లబ్ధిదారులు దాదాపు రూ.50 కోట్ల మేర నష్టపోయినట్లు పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో శామీర్‌పేటలో కూడా అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇటువంటి అక్రమాలు శివారు ప్రాంతాల్లో అనేకం ఉన్నట్లు చెబుతున్నారు. జాగ్రత్తగా లేకపోతే మరింతమంది నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏడాదైనా నిర్మాణమేదీ?

శామీర్‌పేట దగ్గర బొమ్మరాశిపేట గ్రామానికి వెళ్లేదారిలో ఓ నిర్మాణ సంస్థ కడుతున్నట్లు ప్రకటించింది. నిజమేనని నమ్మి ఏపీకి చెందిన వెంకట్రావు రూ.23.20 లక్షలు చెల్లించాడు. సదరు సంస్థ ఆరునెలలపాటు  వెంకట్రావుకు అద్దె కూడా ఇచ్చింది. తరువాత  నిలిపివేసింది. ఏడాదైనా నిర్మాణం మొదలు కాకపోవడంతో వెంకట్రావు సదరు సంస్థ ప్రతినిధులను నిలదీయగా..వారు చేతులెత్తేశారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో  కేవలం రూ.10 లక్షలు తిరిగి ఇచ్చారు.  తాజాగా కూకట్‌పల్లిలో జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ యజమాని కాకర్ల శ్రీనివాస్‌ కూడా ప్రీలాంచ్‌ పేరుతో వందలమందిని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శంకర్‌పల్లి, మోయినాబాద్‌, శంషాబాద్‌ వంటి శివారు ప్రాంతాల్లో ఇటువంటి అక్రమాలే జరుగుతున్నట్లు తెలిసింది.  


వంట గదిలో నక్కి.. లేడని సమాచారం!

కేపీహెచ్‌బీలోని కార్యాలయం వద్ద బాధితులు

కేపీహెచ్‌బీకాలనీ: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పలువురిని మోసం చేసిన జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ కాకర్ల శ్రీనివాస్‌ను బుధవారం కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  బాధితులు గురువారం కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌లోని కార్యాలయం వద్దకు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టు చేసేందుకు ఇంటికి వెళ్లిన పోలీసులకు.. శ్రీనివాస్‌ ఇంట్లో లేడని సమాచారమిచ్చారు.  మరోమారు ఇంట్లో తనిఖీలు  చేపట్టగా.. వంట గదిలోనే కనిపించాడు. ఇతగాడి మోసం రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఓ కానిస్టేబుల్‌ సోదరుడు రూ.70 లక్షల వరకు ఇచ్చినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని