logo

ఇదీ లెక్క... ఇవ్వండి పక్కా

మౌలిక సౌకర్యాల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ, జలమండలి రాష్ట్ర సర్కారుకు రూ.7,470 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు పంపాయి.

Published : 31 Jan 2023 04:11 IST

కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లపై నగరవాసుల భారీ ఆశలు
శాఖల వారీగా ప్రతిపాదనలు

మౌలిక సౌకర్యాల అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ, జలమండలి రాష్ట్ర సర్కారుకు రూ.7,470 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు పంపాయి. అందులో పైవంతెనలు, రహదారులు, నాలాల అభివృద్ధి పనులకు అవసరమైన రూ.1500 కోట్ల కేటాయింపులు జరపాలని బల్దియా ఆర్థిక విభాగం సర్కారును కోరింది. మరోవైపు నగరంలో రెండో దశ మెట్రోకు  నిధులివ్వాలని అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఫిబ్రవరి మొదటి వారంలో ప్రవేశపెట్టనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పద్దుపై నగరవాసులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విత్త మంత్రులు ఏ మేరకు కరుణిస్తారో మరి.

ఈనాడు, హైదరాబాద్‌


ప్రాజెక్టులను పూర్తి చేయాలని..

* రూ.1850కోట్ల అంచనాతో ఐదేళ్లపాటు నగరంలోని 812కి.మీ రోడ్లను మెరుగ్గా నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ మూడేళ్ల క్రితం సీఆర్‌ఎంపీ(రహదారుల సమగ్ర నిర్వహణ కార్యక్రమం)ని పట్టాలెక్కించింది. ఇప్పటి వరకు రూ.950కోట్లు వెచ్చించింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు రెండో దశలో మరో 800కి.మీ రోడ్లను సీఆర్‌ఎంపీ పరిధిలోకి తేవాలని జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించింది. మొదటి దశ పనుల పూర్తికి, రెండో దశ ప్రాజెక్టు వ్యయానికి రూ.500కోట్లు కేటాయించాలని జీహెచ్‌ఎంసీ సర్కారును కోరింది.
* రెండేళ్ల క్రితం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్‌ఎన్‌డీపీ) ప్రారంభమైంది. ఆ పనులకు బల్దియా రూ.650కోట్ల బ్యాంకు రుణం తీసుకుంది. రెండో దశకు రూ.2,400కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మరోమారు బ్యాంకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదని నాలాలకు రూ.300కోట్లు ఇవ్వాల్సిందిగా అధికారులు ప్రభుత్వాన్ని కోరారు.
* రూ.30వేల కోట్ల అంచనాతో ఏడేళ్ల క్రితం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని(ఎస్సార్డీపీ) ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు రూ.5వేల కోట్ల పనులు జరిగాయి. పురోగతిలో ఉన్న రూ.3వేల కోట్ల పనులు, రెండో దశ ఎస్సార్డీపీ పనులను పట్టాలెక్కించేందుకు జీహెచ్‌ఎంసీ సర్కారును రూ.500కోట్ల సాయం కోరింది.
* లింకు రోడ్ల పనులు ప్రస్తుతం వేర్వేరు దశల్లో ఉండగా, వాటిని వేగవంతం చేసేందుకు రూ.200కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది. మూసీపై వంతెనలు, రెండు పడక గదులు, పార్కులు, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకూ కేటాయింపులు జరపాలని అధికారులు అంచనా వ్యయాలను సర్కారును నివేదించారు.
* ఉద్యోగులు, సిబ్బందికి నెలవారీ జీతాల చెల్లింపు, విశ్రాంత ఉద్యోగులకు నగదు ప్రయోజనాల అందజేతకు నానా అవస్థలు పడుతున్న బల్దియాకు ఆర్థిక భరోసా ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.


మెట్రో రెండోదశపై కేంద్రానికి వినతి

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో ఈసారి హైదరాబాద్‌ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై భారీ ఆశలు ఉన్నాయి. ఎన్నికల ఏడాది కావడంతో బడ్జెట్‌లో సముచిత ప్రాధాన్యం దక్కుతుందనే అంచనాలున్నాయి. హైదరాబాద్‌కు సంబంధించి మెట్రోరైలు రెండోదశకు రూ.8,453 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. మొదటిదశలో మిగిలిన సర్దుబాటు వ్యయ నిధి రూ.252 కోట్లు ఇవ్వాలని అభ్యర్థించింది. యూపీఏ హయాంలో ప్రకటించిన ఐటీఐఆర్‌ను ఇవ్వాలని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే.
మెట్రోరైలు రెండో దశలో మూడు మార్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ఒక మార్గం రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మార్గం నిర్మాణానికి అయ్యే రూ.6,250 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించి శంకుస్థాపన కూడా చేసింది. మిగిలిన రెండు మార్గాలకు నిధులివ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. బీహెచ్‌ఈఎల్‌ నుంచి కొండాపూర్‌ మీదుగా లక్డీకాపూల్‌ వరకు 26 కి.మీ., నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 5 కి.మీ. మార్గం.. మొత్తం 31 కి.మీ.కు రూ.8,453 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌తో సహా ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది.


ఎంఎంటీ‘ఎస్‌’ అనేదెప్పుడు?

ఈనాడు- హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రెండో దశను వెంటనే పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. నగరానికి చెందిన ఎంపీలంతా ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశను 95 కిలో మీటర్ల మేర్ల రూ. 816 కోట్ల అంచనాతో చేపట్టారు. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయం ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరిందని సమాచారం. సనత్‌నగర్‌-మౌలాలి మధ్య రక్షణశాఖకు చెందిన స్థలంలో నిర్మించాల్సిన రెండో లైను (మొత్తం 21కి.మీ.) మినహా మిగతాపనులు, విద్యుదీకరణ కూడా ఇప్పటికే పూర్తయింది. ఆ పనులూ పూర్తిచేసేలా బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్రానికి, నగరానికి చెందిన ఎంపీలు పట్టుపట్టాలని.. దీన్ని ఫిబ్రవరి 13న ప్రధాని ప్రారంభించేలా ఒత్తిడి తీసుకురావాలనీ జంటనగరాల ప్రజారవాణా వినియోగదారుల సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక ఎంపీ రేవంత్‌రెడ్డి, సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ దిశగా ప్రయత్నాలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రూ.5970 కోట్లతో జలమండలి..

రానున్న బడ్జెట్‌లో జలమండలి ప్రభుత్వం ముందు భారీ ప్రతిపాదనలు పెట్టింది. నీటి సరఫరా.. మురుగు నీటి వ్యవస్థ అభివృద్ధి.. కొత్త ప్రాంతాల్లో విస్తరణకు వివిధ పనులు.. గతంలో అభివృద్ధి పనులకు చేసిన అప్పుల చెల్లింపు మొత్తం రూ.5,970 కోట్లు ప్రతిపాదనలు పెట్టింది.
* గోదావరి, కృష్ణా మూడు దశల కోసం చేసిన అప్పుల అసలు చెల్లింపు, వార్షిక వడ్డీకి రూ.700 కోట్లు వరకు ఇవ్వాలని ప్రతిపాదనలు చేసింది.
* సుంకిశాల ప్రాజెక్టు పనులకు రూ.1400 కోట్లు వరకు ప్రతిపాదనలు పంపారు.
* మురుగు శుద్ధి కేంద్రాల పనులకు మరో రూ.1400 కోట్లు కావాలని ప్రతిపాదించారు.
* అవుటర్‌ రింగ్‌రోడ్డు ఫేజ్‌-2లో తాగునీటి నెట్‌వర్క్‌, రిజర్వాయర్ల పనులు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు.. ఫేజ్‌-1లో జరిగిన పనుల చెల్లింపునకు రూ.170 కోట్లు అంచనా వేశారు. పాతబస్తీ జోన్‌-3లో మురుగు నీటి వ్యవస్థ బలోపేతానికి రూ.300 కోట్ల నిధులను ప్రతిపాదించారు. ఇవి కాకుండా పలు అభివృద్ధి పనుల మరో రూ.800 కోట్లతో అంచనాలు రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని