logo

ముసద్దీలాల్‌ జ్యువెల్స్‌లో సోదా, జప్తు సబబే

ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్స్‌లో జరిపిన జప్తు చెల్లదని, సీజ్‌ చేసిన నగదు, ఆభరణాలను తిరిగి అప్పగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది.

Published : 03 Feb 2023 01:42 IST

హైకోర్టులో ఈడీ అప్పీలు దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: ముసద్దీలాల్‌ జెమ్స్‌ అండ్‌ జ్యువెల్స్‌లో జరిపిన జప్తు చెల్లదని, సీజ్‌ చేసిన నగదు, ఆభరణాలను తిరిగి అప్పగించాలంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. పిటిషన్‌ విచారణార్హం కాకపోయినా సింగిల్‌ జడ్జి అనుమతించడం చెల్లదని పేర్కొంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన అప్పీలుపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు న్యాయవాది అనిల్‌ ప్రసాద్‌ తివారీ వాదనలు వినిపించగా, ప్రతివాదుల తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణ ఈనెల 20కి వాయిదా పడింది. 2014లో సుకేష్‌గుప్త, ఎంఎంటీసీ అధికారులపై సీబీఐ నమోదు చేసిన కేసులో భాగంగా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద గతేడాది అక్టోబరు 17న ఈడీ సోదాలు జరిపి రూ.53.98 కోట్ల ఆభరణాలు, రూ.1.75 కోట్ల నగదు, పత్రాలను స్వాధీనం చేసుకుంది. దీన్ని సవాలు చేస్తూ ముసద్దీలాల్‌ జ్యువెల్స్‌తోపాటు డైరెక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. సుకేష్‌గుప్తపై నమోదు చేసిన కేసుతో కంపెనీకిగానీ, డైరెక్టర్లకుగానీ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ముసద్దీలాల్‌ కంపెనీతో తమ తండ్రి అనురాగ్‌గుప్తకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17(‘1) కింద సోదాలకు కారణాలు వివరించాల్సి ఉండగా, వివరించలేదన్నారు. తగిన కారణాలతో సెర్చ్‌వారంట్‌ జారీ అయిందని, దీనిపై డైరెక్టర్లు, సాక్షులు సంతకం చేశారని ఈడీ తెలిపింది. జప్తు చేసే అధికారం ఈడీకి ఉందని, దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే అడ్జ్యుడికేటింగ్‌ అథారిటీని ఆశ్రయించవచ్చని తెలిపింది. ప్రత్యామ్నాయం ఉండగా నేరుగా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హం కాదంది. ఇరుపక్షాల వాదనలను విని రికార్డులను పరిశీలించిన సింగిల్‌ జడ్జి సోదాలకు కారణాలను పేర్కొనలేదని, జప్తు చెల్లదని, స్వాధీనం చేసుకున్న నగదు, ఆభరణాలు, పత్రాలను వాపసు ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై ఈడీ అప్పీలు దాఖలు చేస్తూ మనీ లాండరింగ్‌ జరిగిందనడానికి విశ్వసనీయ కారణాలుంటే సోదాలు నిర్వహించవచ్చని తెలిపింది. దీనిపై సహజ న్యాయసూత్రాలను అనుసరించి విచారణకు హాజరవాలని సమన్లు జారీ చేస్తే సహకరించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించారని పేర్కొంది. సోదా, జప్తుపై దిల్లీలోని అడ్జ్యుటికేటింగ్‌ అథారిటీలో తమ వాదన వినిపించడానికి అవకాశం ఉందని తెలిపింది. షరాఫ్‌ అపారల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే బోగస్‌ కంపెనీలోను, ఎంబీఎస్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోను డైరెక్టర్‌గా ఉన్నారంది. అందువల్ల సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని