logo

Hyderabad: ‘మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ. 5లక్షలు చెల్లించు..’

‘మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ.5 లక్షలు చెల్లించు’ అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు పవన్‌ను డిమాండ్‌ చేశాడు.

Updated : 12 Mar 2023 10:10 IST

సొమ్ము చెల్లించకపోవడంతోనే పవన్‌ హత్య

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: ‘మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ.5 లక్షలు చెల్లించు’ అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు పవన్‌ను డిమాండ్‌ చేశాడు. అయితే, సంబంధిత సొమ్మును చెల్లించకపోవడంతోనే అతడిని సదరు యువతి బాబాయి, అతడి స్నేహితుడు కలిసి దారుణంగా హతమార్చారు. బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య కేసును బాలాపూర్‌ పోలీసులు ఛేదించారు. శనివారం పహాడీషరీఫ్‌ ఠాణాలో డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు.

వాది ఎ ఉమర్‌లో నివసించే పూల్‌సింగ్‌ కుమారుడు పవన్‌(22) తన చెల్లెలి ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆ విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు పహాడీషరీఫ్‌కు మకాం మార్చారు. అనంతరం యువతి బాబాయి, ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ గౌస్‌(30).. ఈ విషయాన్ని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు మహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. అతను పవన్‌ను పిలిచి.. యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నందుకు క్షమించి వదిలేస్తామని, రూ.5 లక్షలు  చెల్లించాలని డిమాండ్‌ చేశాడు.

ఆ నగదులో తమకు వాటా లభిస్తుందని యువతి బాబాయి ఆశపడ్డాడు. ఆనక పవన్‌ తన తండ్రికి.. బెదిరింపుల విషయాన్ని తెలిపాడు. అయితే, తాము అంత మొత్తం ఇవ్వలేమని.. 40 వేలు చెల్లిస్తామంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడికి పవన్‌ తండ్రి చెప్పాడు. దీంతో యువతి బాబాయి గౌస్‌.. తన మిత్రుడు బార్కస్‌లో ఉండే మహ్మద్‌ సద్దాం(23)తో కలిసి పవన్‌ను కత్తులతో పొడిచి హతమార్చాడు. పెళ్లి బారాత్‌లో వినియోగించే కత్తులను నాందేడ్‌ నుంచి తెప్పించారని, పవన్‌ హత్యకు నిందితులు వాటినే వినియోగించినట్లు డీసీపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని