logo

Hyderabad : గల్లీల్లో గబ్బు.. సిబ్బందికి డబ్బు

మహానగరంలో మద్యం గొలుసు దుకాణాల వ్యాపారం పోలీసు శాఖలో కొంతమంది సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. కాలనీలు, నివాసాల మధ్య పగలు, రాత్రి తేడా లేకుండా దుకాణాలు నడిపేవారి నుంచి ఆమ్యామ్యాలు తీసుకొని వదిలేస్తున్నారు.

Updated : 01 Apr 2023 08:59 IST

యథేచ్ఛగా మద్యం గొలుసు దుకాణాల నిర్వహణ
వాటాలు తీసుకొని పట్టించుకోని పోలీసులు
ఈనాడు-హైదరాబాద్‌

మహానగరంలో మద్యం గొలుసు దుకాణాల వ్యాపారం పోలీసు శాఖలో కొంతమంది సిబ్బందికి కాసులు కురిపిస్తోంది. కాలనీలు, నివాసాల మధ్య పగలు, రాత్రి తేడా లేకుండా దుకాణాలు నడిపేవారి నుంచి ఆమ్యామ్యాలు తీసుకొని వదిలేస్తున్నారు. కొందరు నెలవారీ మామూళ్లు తీసుకుంటే, ఇంకొందరు గస్తీలో భాగంగా ఎంతోకొంత వసూలు చేస్తున్నారు. పండగలు, బంద్‌లతో సంబంధం లేకుండా దుకాణాలు నడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. దుకాణాలు నిర్వహిస్తున్నట్లు స్థానికుల నుంచి సమాచారం అందుతున్నా.. మందుబాబుల ఆగడాలపై ఫిర్యాదులు చేస్తున్నా స్పందించడం లేదు.

అక్కడ మూసినా ఇక్కడ సరఫరా

నగరంలో ఇటీవలి గొలుసు దుకాణాలు విపరీతంగా పెరిగాయి. కొన్ని మద్యం దుకాణాల నిర్వాహకుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. తమకు తెలిసిన వారితో కాలనీల్లో గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాటు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. మద్యం దుకాణం మూసేసిన తర్వాత అమ్మకాలు చేసేందుకు ఈ ఎత్తుగడ అమలు చేస్తున్నారు. ఈ విషయమై ఆబ్కారీ, పోలీసు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఇదే అదనుగా కొందరు కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వాటాలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా బీట్‌ స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

బంద్‌ అంటే పండగే

నగరంలో కొన్ని వేడుకలు, పండుగల సందర్భంగా మద్యం దుకాణాలు మూసేస్తున్నారు. బంద్‌ నేపథ్యంలో సరకు ఎక్కువ ధరకు విక్రయిస్తుండగా.. చూసీచూడనట్లు వదిలేస్తే అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న గొలుసు దుకాణాలతో నివాస ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. కొందరు మహిళలు, యువతులను వేధిస్తున్నారు.

ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు తాఖీదులు

ఇటీవల పాతబస్తీలో కొన్ని ప్రాంతాల్లో దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రెండు చోట్ల మద్యం అమ్ముతున్నట్లు తేలింది. ఈ వ్యవహారంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు తాఖీదులు ఇచ్చినట్లు తెలిసింది.
* నగరంలోని హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 10 మంది కింది స్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. మద్యం గొలుసు దుకాణాలు ఉన్నట్లు.. తెలిసినా పట్టించుకోవడం లేదని సమాచారం అందింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని