logo

నిధులొచ్చాయి.. నిర్మాణమే తరువాయి

వర్షాకాలం వచ్చిందంటే ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నా కొంచెం ఇబ్బందే. ముఖ్యంగా ప్రజోపయోగ పనులు (రోడ్లు, కల్వర్టులు, చెక్‌డ్యాంలు తదితరాలు) ఎండా కాలంలో పూర్తిచేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Published : 30 May 2023 02:12 IST

తారు దారులకు మహర్దశ  
రూ.128కోట్లు మంజూరు
న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ

తారుకు నోచని కరణ్‌కోట రోడ్డు 

వర్షాకాలం వచ్చిందంటే ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టాలన్నా కొంచెం ఇబ్బందే. ముఖ్యంగా ప్రజోపయోగ పనులు (రోడ్లు, కల్వర్టులు, చెక్‌డ్యాంలు తదితరాలు) ఎండా కాలంలో పూర్తిచేస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. జిల్లాలోని ప్రధాన రహదారులు గతేడాది కురిసిన భారీ వర్షాలకు గుంతలు తేలాయి. వీటిని బాగుచేయాలని ప్రజలు, వాహనదారులు పలు విధాలా కోరుతున్నారు. ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో ఎండాకాలం పూర్తికాకముందే వీటిని కొలిక్కి తేవాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ‘న్యూస్‌టుడే’ కథనం. 

248 కిలో మీటర్లలో..

తాండూరు నియోజకవర్గంలోని 42కిలోమీటర్లలో తారు రహదారుల నిర్మాణానికి రూ.34.84కోట్లు మంజూరయ్యాయి. తాండూరు మండలం కరణ్‌కోట రహదారి నిర్మాణానికి రూ.2.70, రూ.8.20కోట్లు వేర్వేరుగా మంజూరయ్యాయి. అంతారం-పెద్దేముల్‌కు రూ.6కోట్లు, సంగెంకలాన్‌-మల్కాపూర్‌ రహదారికి రూ.1.72కోట్లు, యాలాల మండలంలో లక్ష్మీనారాయణ్‌పూర్‌-యాలాల రూ.4.60కోట్లు, యాలాల-దేవనూర్‌ రహదారులకు రూ.1.36కోట్లు, బషీరాబాద్‌ మండలంలో బషీరాబాద్‌-మైల్వార్క్‌ు రూ.1.52కోట్లు మంతట్టి రహదారికి రూ.1.19కోట్లు దక్కాయి.

* వికారాబాద్‌ నియోజకవర్గంలో 35కి.మీలకు రూ.11.70కోట్లు మంజూరయ్యాయి. బుగ్గ-మాదారానికి రూ.2కోట్లు, ఎన్నారం రహదారికి రూ.2.15కోట్లు, బార్వాద్‌కు రూ.1.62కోట్లు, నాగసముందర్‌ రహదారికి రూ.84లక్షలు,  బంట్వారం-తొర్మామిడికి రూ.1.78కోట్లు, మోత్కుపల్లి రహదారికి రూ.41లక్షలు మంజూరయ్యాయి.

కొడంగల్‌, పరిగి నియోజకవర్గాల్లో..

కొడంగల్‌ నుంచి తండా వరకు, హస్నాబాద్‌-నీటూర్‌, రావులపల్లి-మద్దూర్‌, కుదురుమళ్ల-దాదాపూర్‌ రహదారులను రూ.7.50కోట్లతో నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి. పరిగి నియోజకవర్గంలో షాద్‌నగర్‌్-పరిగి, పరిగి-నంచర్ల, చిట్టెంపల్లి-లాల్‌పహాడ్‌, రంగాపూర్‌్-లాల్ప్‌హాడ్‌, నస్కల్‌, ముజాయిద్‌పూర్‌-జాఫర్‌పల్లి, గడిసింగాపూర్‌-రంగారెడ్డిపల్లి రహదారులను రూ.10.71కోట్లుతో నిర్మించేందుకు నిధులు దక్కాయి.

నెలన్నర వ్యవధిలో..

తాజాగా నిధులు మంజూరైన రహదారుల నిర్మాణాలను నెలన్నర రోజుల్లో నిర్మించాలని రహదారులు భవనాల శాఖకు సర్కారు గడువు విధించింది. ఇతర పనులకు తాత్కాలికంగా విరామం పలికిన అధికారులు తారు రహదారుల నిర్మాణంపై ప్రధానంగా దృష్టిసారించారు. పనులు సకాలంలో పూర్తి చేసి రహదారుల్ని అందుబాట్లోకి తెచ్చేందుకు టెండర్లు, అగ్రిమెంట్ల ప్రక్రియను వేగంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.


జూన్‌లో పూర్తి చేసేలా కార్యాచరణ

లాల్‌సింగ్‌, ఈఈ, రహదారులు భవనాల శాఖ

జిల్లాలో దెబ్బతిన్న తారు రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాయి.  జూన్‌ నెలాఖరులోగా దాదాపు అన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభింపజేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని