logo

దశాబ్ది.. దశదిశలా అభివృద్ధి

తెలంగాణ రాష్ట్ర సాకారంతో రాజధాని అభివృద్ధి ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచే బృహత్తర బాధ్యతను జీహెచ్‌ఎంసీ అప్పగించింది. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ విస్తృత స్థాయి ప్రాజెక్టులను భుజానికెత్తుకుంది. 

Updated : 02 Jun 2023 04:33 IST

తెలంగాణ సాకారంతో పురోగమించిన రాజధాని

మౌలిక సౌకర్యాలకు జీహెచ్‌ఎంసీ పెద్దపీట

జిగేల్‌మంటున్న గచ్చిబౌలి శిల్పాలేఅవుట్‌ ఫ్లైఓవర్‌

తెలంగాణ రాష్ట్ర సాకారంతో రాజధాని అభివృద్ధి ఊపందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచే బృహత్తర బాధ్యతను జీహెచ్‌ఎంసీ అప్పగించింది. ఆ మేరకు జీహెచ్‌ఎంసీ విస్తృత స్థాయి ప్రాజెక్టులను భుజానికెత్తుకుంది.  పైవంతెనలు, అండర్‌పాస్‌లు వంటి పనులను పూర్తి చేసింది. కేవలం.. రోడ్లు, భవనాల వంటి కొత్త ప్రాజెక్టులపైనే రూ.7,644.55కోట్లు వెచ్చించింది. ఇతరత్రా అభివృద్ధి పనులను బేరీజు వేస్తే అభివృద్ధి వ్యయం దాదాపు రెట్టింపవుతుందని అంచనా. మొత్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నాటికి.. జీహెచ్‌ఎంసీ నగరాభివృద్ధిని దశదిశలా వ్యాపింపజేసిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈనాడు, హైదరాబాద్‌

విజయాలు సాధిస్తూ ముందుకు..

* ఐటీ వినియోగంలో: కొత్త రాష్ట్రం ఏర్పాటుతో జీహెచ్‌ఎంసీ దేశంలోనే మొదటిసారి ఈ-ఆఫీసు విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఈ విధానంలో 3.13లక్షల ఫైళ్లు నడిచాయని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. డిజిటల్‌ పాలన, ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు, మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, ఆస్తిపన్ను, నిర్మాణ అనుమతుల జారీ, ఇతరత్రా సేవలను డిజిటలీకరించడం వంటి అంశాల్లోనూ జీహెచ్‌ఎంసీ ఉత్తమ పనితీరు చూపింది. అందుకుగాను కేంద్ర ప్రభుత్వం పలు పురస్కారాలను అందించింది.

* మౌలిక సౌకర్యాల కల్పనలో.. ట్రాఫిక్‌ సిగ్నళ్లు లేని రహదారులను సాకారం చేయాలని సర్కారు ఆదేశించగా.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) పేరుతో పైవంతెనలు, అండర్‌పాస్‌లు,  నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వరద సమస్య నుంచి కాలనీలను గట్టెక్కించడమే లక్ష్యంగా వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్‌ఎన్‌డీపీ) ప్రారంభించింది.  రోడ్ల నిర్వహణకు రహదారుల సమగ్ర నిర్వహణ (సీఆర్‌ఎంపీ) ప్రాజెక్ట్‌, హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీసీఎల్‌) ద్వారా రోడ్ల విస్తరణ, లింకు రోడ్ల నిర్మాణం జరుగుతోంది.

* క్షేత్రస్థాయిలో పౌరుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా హరితహారంలో భాగంగా ఖాళీ స్థలాలన్నింటిలో చెట్ల పెంపకం, థీమ్‌ పార్కుల అభివృద్ధి, కొత్తగా పార్కుల అభివృద్ధి, కాలనీల్లో వీడీసీసీ రోడ్లు, శ్మశానవాటికల్లో ఆహ్లాదకర వాతావరణం, ఆధునిక నిర్మాణాలు చేపట్టడం, ఇతరత్రా పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది. కాలనీల్లో మల్టీ పర్పస్‌ ఫంక్షన్‌హాళ్లను నిర్మిస్తోంది. చేపల మార్కెట్లు, మున్సిపల్‌ మార్కెట్లు, జంతు వధశాలలు, చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ, చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ)లో భాగంగా చుట్టూ ఉన్న రోడ్ల ఆధునీకరణ, వీధి కుక్కల సమస్య పరిష్కారానికి జంతు సంరక్షణ కేంద్రాల నిర్మాణం, బస్తీల కోసం ఆదర్శ మార్కెట్లు, ఇతరత్రా పనులను బల్దియా చేపట్టింది.

* బ్యాంకు రుణాలు.. జీహెచ్‌ఎంసీ అభివృద్ధి పనుల కోసం అప్పు చేసేందుకు కూడా వెనకడుగు వేయలేదు. ఇప్పటి వరకు బాండ్ల జారీ ద్వారా రూ.495 కోట్లు, బ్యాంకు రుణాల ద్వారా రూ.6035 కోట్ల అప్పు తీసుకుంది.

* సాధారణ నిర్వహణ పనుల్లో భాగంగా రోడుల, వరద కాలువలు, మురుగునీటి కాలువల నిర్వహణకు గడిచిన తొమ్మిదేళ్లలో బల్దియా రూ.9,372.22 కోట్ల నిధులను వెచ్చించగా, మరో రూ.1500 కోట్ల పనులు  ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సచివాలయం వద్ద పోలీసుల బందోబస్తు

అన్నిరంగాలకు అగ్రాసనం

రూ.76,523 కోట్లతో మౌలిక వసతులు, విస్తరణ పనులు ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తరువాత మహానగరంలో దాదాపు అన్ని రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విస్తరణ పెద్దఎత్తున జరిగింది. జీహెచ్‌ఎంసీ జలమండలి ఆధ్వర్యంలో ఈ పదేళ్లలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం రూ.వేల కోట్లను వ్యయం చేశారు. ఫలితంగా రాజధాని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీరాయి. కృష్ణా, గోదావరి నదుల నీటిని నగరానికి తీసుకురావడంతో తాగునీటి భరోసా ఏర్పడింది. ఇదే సమయంలో రోడ్ల విస్తరణతోపాటు ఎల్బీనగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, కూకట్‌పల్లి లాంటి రద్దీ ప్రాంతాల్లో ఆకాశమార్గాల నిర్మాణం చేపట్టడంతో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం దొరికొంది. ఎస్‌ఆర్‌డీపీ కింద 35 పైవంతెనలు పూర్తి చేస్తే మరో 15 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. లింకు రోడ్ల నిర్మాణం వల్ల అనేక ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తీరాయి. రద్దీ రోడ్లను ప్రైవేటు సంస్థలకు అయిదేళ్లపాటు అప్పగించడంతో వీటి నిర్వహణ మెరుగుపడింది. హెచ్‌ఎండీఏ కూడా బాలానగర్‌, మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశమార్గాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. పచ్చదనం పెంపొందించడంలో ఈ విభాగం కీలక ప్రగతిని సాధించింది. దక్షిణమండల విద్యుత్తు సంస్థ కూడా నగరంలో కొత్త సబ్‌ స్టేషన్లు, అభివృద్ధి పనులను చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం నగర పరిధిలోకి వచ్చే జాతీయ రహదారులను రూ.3 వేల కోట్లతో విస్తరించే పనిని మొదలుపెట్టింది. మొత్తమ్మీద నగరంతోపాటు చుట్టపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం దాదాపు పదేళ్లలో రూ.76,523 కోట్లను అభివృద్ధి పనులపై వినియోగించింది.

విద్యుత్తు కాంతుల్లో పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని