logo

ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి

అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.

Published : 24 Apr 2024 06:45 IST

మద్దూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ

మద్దూరు సభావేదికపై సీఎం రేవంత్‌ రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, కోస్గి జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి

మద్దూరు,కోస్గి, నారాయణపేట- న్యూస్‌టుడే : అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం మద్దూరులో జరిగిన కొడంగల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. 2009లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మొదటిసారి 7500 మెజార్టీతో విజయం సాధించానని, ఇటీవలి ఎన్నికల్లో 33వేల మెజార్టీతో కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రానికి సీఎంని అందించారని వ్యాఖ్యానించారు. 1967లో అచ్యుతారెడ్డి మంత్రిగా పనిచేశారని, తరువాత మంత్రి యోగం దక్కలేదన్నారు. ఆ లోటును భర్తీచేస్తూ  సోనియాగాంధీ కొడంగల్‌కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు.  కృష్ణా- వికారాబాద్‌ రైల్వేలైన్‌ ఏర్పాటు కాలేదన్నారు. కొడంగల్‌ అభివృద్ధిని చూసి భారాస, భాజపాలు నాటకాలు ఆడుతున్నాయని, కొడంగల్‌ ప్రజలు వీరిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వంద రోజుల్లో రూ.5వేల కోట్ల నిధులు తీసుకువచ్చామన్నారు. పేట-కొడంగల్‌ పథకానికి అప్పట్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ డీకే అరుణ అడ్డుపడ్డారని విమర్శించారు. ఆ పథకాన్ని ఇప్పుడు పట్టాలకెక్కిస్తే చూస్తూ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

ఓర్వలేక కుట్రలు

తొలినాళ్లలో పాలమూరుకు చెందిన బూర్గుల రామకృష్ణరావు సీఎం అయితే, 70 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ప్రాంతీయుడికి అవకాశం వచ్చిందన్నారు. ఓర్వలేక  కొందరు కుట్రలు, కుతంత్రాలు పన్నుతుంటే మీరందరూ చూస్తూ  ఊరుకుంటారా? అని కార్యకర్తలను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి పాలమూరు అభివృద్ధికోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు. నా బలగం, బంధువులు కొడంగల్‌ ప్రజలేనని..50వేల మెజార్టీ ఇవ్వాలని పిలుపునిచ్చారు. మహిళా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి ఓట్లు అడగాలని కోరారు.

మద్దూరులో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి

పోటీలో ఉన్నది రేవంత్‌రెడ్డే: వంశీచంద్‌  లోక్‌సభ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ  పాలమూరు ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి నుంచి ఇప్పుడు పాలమూరు బిడ్డ రేవంత్‌రెడ్డిని ఆ రాష్ట్రాల నాయకులు ప్రచారానికి పిలిచే పరిస్థితి వచ్చిందన్నారు. పాలమూరులో పోటీ చేస్తున్నది రేవంత్‌రెడ్డి అని ప్రతికార్యకర్త గుర్తించుకోవాలన్నారు. తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌సీ రాములునాయక్‌, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, కొడంగల్‌ నియోజకవర్గం ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


విపక్షాలపై విమర్శనాస్త్రాలు

ఈనాడు, మహబూబ్‌నగర్‌ : పాలమూరులోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా  పార్టీ శ్రేణులకు దిశానిర్దేశాలు.. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలతో సీఎం పర్యటన సాగింది. నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో భాజపా అభ్యర్థి డీకే అరుణ, నాగర్‌కర్నూల్‌లో భారాస అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. మద్దూరులో జరిగిన సమీక్షల్లో ఎక్కువగా డీకే అరుణపైనే విమర్శలు చేశారు. నారాయణపేట జిల్లాలో భాజపాకు గట్టి పట్టు ఉండటంతో సీఎం భాజపానే లక్ష్యంగా చేసుకుని మాట్లాడినట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్‌లో భారాస అభ్యర్థి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌పై పలు  ప్రశ్నలు సంధించారు. భాజపా, భారాసలు పాలమూరుకు ఏం చేశాయని ప్రశ్నించారు. పాలమూరు వ్యక్తి సీఎంగా ఉన్నాడని, తనకు మద్దతు ఇవ్వాలని ఇక్కడ రెండు ఎంపీ సీట్లు గెలిపిస్తే మాదిగల ఏబీసీడీ వర్గీకరణ, ముదిరాజ్‌లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చడానికి, బోయ, వాల్మీకిలను ఎస్టీలోకి మార్చడం కోసం దిల్లీలో పోరాడానికి వంశీచంద్‌, మల్లు రవిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని