logo

ఉత్సవాలను చూద్దాం రండి

నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, వాకాడు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర డిపోల నుంచి ఆర్టీసీ  అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 07 Jun 2023 04:33 IST

వెంగమాంబ

నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. ఉదయగిరి, ఆత్మకూరు, నెల్లూరు, వాకాడు, కావలి, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర డిపోల నుంచి ఆర్టీసీ  అధికారులు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. 500 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహించనున్నారు.  దుత్తలూరు, నర్రవాడ వైద్యాధికారులు వైద్య శిబిరాలను స్థానిక పీహెచ్‌సీ అన్నదాన సత్రం వద్ద ఏర్పాటు చేస్తున్నారు.

న్యూస్‌టుడే, దుత్తలూరు : మెట్టప్రాంత ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న దుత్తలూరు మండలం నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు ఐదు రోజులపాటు జరగనున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు ఐదు లక్షల మందికిపైగా  భక్తులు వస్తారని ఆలయ ధర్మకర్తలు, అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.   బ్రహ్మోత్సవాలు ఈనెల 11వ తేదీ రాత్రి వెంగమాంబ పేరంటాలు పుట్టినిల్లు అయిన వడ్డిపాలెంలో నిలుపు కార్యక్రమంతో  ప్రారంభమవుతాయి. 12న రథోత్సవంతోపాటు సంతానంలేని మహిళలు వరపడే కార్యక్రమాలు జరుగుతాయి. 13న రథోత్సవం, 14న పగలు కల్యాణోత్సవం, పసుపు కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రధానోత్సవం జరుగుతుంది. చివరి రోజైన 15న పొంగళ్లు, ఎడ్ల బండలాగు పందేలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఉచిత భోజనంతోపాటు తాగునీటి సమస్య తలెత్తకుండా వివిధ మార్గాల్లో కుళాయిలు ఏర్పాటు చేశారు. దుత్తలూరు మండలం నర్రవాడలో ఈ దేవస్థానం ఉంది. ఇక్కడికి ఒంగోలు నుంచి కందుకూరు, పామూరు మీదుగా దుత్తలూరు మార్గం, నెల్లూరు నుంచి దుత్తలూరు మీదుగా పామూరు మార్గం, కడప నుంచి బద్వేలు, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు మార్గం, పోరుమామిళ్ల నుంచి సీతారామపురం, ఉదయగిరి, దుత్తలూరు మీదుగా పామూరు రోడ్డు మీదుగా నర్రవాడకు చేరుకోవచ్చు.

ఏర్పాట్లు చేస్తున్నాం: ఉషశ్రీ, ఆలయ కార్యనిర్వహణాధికారిణి

వెంగమాంబ అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ ధర్మకర్తల సూచనలు సలహాలతో దేవస్థానం వద్ద తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఉత్సవాలకు వచ్చే ప్రతి భక్తునికి అమ్మవారి దర్శనం కలిగేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని