logo

కాయకల్పలో తడబడి..

కాయకల్ప పురస్కారాల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఈ సారి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది.

Published : 03 Jun 2023 05:39 IST

జిల్లా ఆసుపత్రికి తగ్గిన ప్రాధాన్యం
మెరుగ్గానే ప్రాంతీయ, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు

జిల్లా ఆసుపత్రిలో ఓపీ రద్దీ

కామారెడ్డి వైద్యవిభాగం- న్యూస్‌టుడే: కాయకల్ప పురస్కారాల్లో గతంలో కంటే భిన్నమైన ఫలితాలు వచ్చాయి. ఈ సారి జిల్లా ఆసుపత్రి రాష్ట్ర స్థాయిలో నాల్గో స్థానంతో సరిపెట్టుకుంది. 2017లో కామారెడ్డి సర్కారు ఆసుపత్రి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2018లోనూ రెండో స్థానం దక్కింది. ఆ తర్వాత బాన్సువాడ ప్రాంతీయాసుపత్రికి రాష్ట్ర పురస్కారం వరించింది. ఎంపికైన వాటికి రూ.50 లక్షల నిధులు మంజూరవగా వీటితో ఆయా విభాగాల ఆధునికీకరణ, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిచ్చారు. గతేడాది జిల్లాలోని 14 ఆరోగ్యకేంద్రాలకుగాను 8.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సారి 10 పీహెచ్‌సీలే ఎంపికయ్యాయి. వీటిలో అన్నింటికి కలిపి రూ.6.50 లక్షలు కేటాయించారు.

నిర్వహణను విస్మరించడంతో..

వచ్చే ఏడాది కాయకల్ప పురస్కారాలకు జిల్లా ఆసుపత్రి పోటీలో ఉండదు. జిల్లాకు వైద్యకళాశాల మంజూరైన నేపథ్యంలో కాయకల్ప జాబితా నుంచి కామారెడ్డి ఆసుపత్రిని తొలగించనున్నారు. దీంతో 2022-2023 సంవత్సరంలో జిల్లా ఆసుపత్రి నిర్వహణను విస్మరించారు. దస్త్రాల నిర్వహణ, వైద్యసేవలు, వివిధ విభాగాల నిర్వహణ కొంత లోపభూయిష్టంగా ఉంది. స్వచ్ఛతలో వెనుకబడి ఉంది. దీంతో ఈ సారి కాయకల్ప ర్యాకింగ్‌లో నాల్గో స్థానానికి పడిపోయింది. వచ్చే ఏడాది నుంచి ఆసుపత్రి వైద్యకళాశాల పరిధిలోకి వెళ్లనుంది. వైద్యాధికారులు, ఇతర వైద్యులు పురస్కారాలపై పెద్దగా దృష్టి పెట్టలేదనే ఆరోపణలున్నాయి. గతంలో రూ.50 లక్షల నిధులు రాగా ఈ సారి కేవలం రూ.3 లక్షలతో సరిపెట్టుకోవడం గమనార్హం.

ఉత్తమ మార్కులతో సత్తా చాటి..

ప్రాంతీయ ఆసుపత్రి విభాగంలో బాన్సువాడ రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. 86.14 శాతం మార్కులు రాగా రూ.10 లక్షలు కేటాయించారు. దోమకొండ సామాజిక ఆరోగ్య కేంద్రానికి 71 శాతం మార్కులు రాగా రూ.లక్ష ఇవ్వనున్నారు. ఎల్లారెడ్డికి 70.3 శాతం మార్కులు వచ్చాయి. రూ.లక్ష నిధులు రానున్నాయి. కామారెడ్డి పట్టణ ఆరోగ్యకేంద్రానికి 83 శాతం మార్కులు వచ్చాయి. ఉత్తమ యూపీహెచ్‌సీగా ఎంపికైంది.


ప్రమాణాలకు అనుగుణంగానే
- డా.విజయలక్ష్మి, జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకురాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలకు అనుగుణంగానే కాయకల్ప పురస్కారాలకు ఎంపిక చేస్తారు. ఈ సారి జిల్లా ఆసుపత్రికి ప్రథమ స్థానం దక్కుతుందని భావించాం. గతంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం కేటాయించారు. వచ్చే నిధులను ఆసుపత్రుల అభివృద్ధికి పకడ్బందీగా వినియోగిస్తాం. వైద్య సేవలను మెరుగుపరుస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని