logo

తెదేపాతోనే మత్స్యకారులకు భరోసా

తెలుగుదేశం పార్టీతోనే మత్స్యకారులకు భరోసా దక్కుతుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గార మండలం బందరువానిపేటలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు.

Published : 17 Apr 2024 04:57 IST

గార, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీతోనే మత్స్యకారులకు భరోసా దక్కుతుందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. గార మండలం బందరువానిపేటలో మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. గార మండల కేంద్రం నుంచి బందరువానిపేట వరకు నిర్వహించిన ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ మాట్లాడుతూ జగన్‌మోహన్‌ రెడ్డి నియంతృత్వ పాలనలో మత్స్యకారులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎక్కడ చూసినా అన్యాయం, దగా, మోసమే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అయిదేళ్లలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తెదేపా హయాంలో ఇచ్చిన పథకాలు ఎత్తేశారని, గ్రామాలకు తాగునీరు సైతం సక్రమంగా అందించని దుస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో దిగిన వైకాపా బందిపోటు దొంగల్ని తరిమి కొట్టాలంటే.. అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. తెదేపా శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్‌ మాట్లాడుతూ తనను గెలిపిస్తే చట్ట సభల్లో మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జనసేన, భాజపా నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమామహేశ్వరి, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని