logo

30 శాతం పెరిగిన భూముల విలువ

జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడు బాదింది. భూముల మార్కెట్‌ ధరలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Updated : 01 Jun 2023 04:53 IST

బాదుడే బాదుడు

అనకాపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడు బాదింది. భూముల మార్కెట్‌ ధరలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు గురువారం నుంచి అమలుల్లోకి రానున్నాయి.  గత ఏడాది ఏప్రిల్‌ 1న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ భూములకు 15 నుంచి 20 శాతం మార్కెట్‌ ధరలు పెంచేశారు. ఇప్పుడు ఏఏ గ్రామాల్లో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయో గుర్తించి 30 శాతం వరకు పెంచేశారు. అనకాపల్లి జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలోని 10 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ గురువారం నుంచి పెంచిన మార్కెట్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. ముందుగా నోటిఫికేషన్‌ ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించి ధరలు పెంచాలి. ఎలాంటి తంతు లేకుండానే ధరలు పెంచడం విమర్శలకు తావిస్తోంది.

అనకాపల్లి, నక్కపల్లి, ఎలమంచిలి, సబ్బవరం, లంకెలపాలెం ప్రాంతాల్లో 30 శాతం, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, కోటవురట్లలో 10 నుంచి 15 శాతం పెంచారు. జాతీయ రహదారిని అనుకుని ఉన్న భూముల ధరలను పెంచుతూ మోయలేని భారాన్ని మోపారన్న విమర్శలు వస్తున్నాయి. అనకాపల్లిలో నివాస ప్రాంతాల్లో గజం గతంలో రూ. 13 వేల నుంచి రూ.18 వేలకు, వాణిజ్య ప్రాంతాల్లో గజం రూ. 48 వేల నుంచి రూ. 65 వేలకు పెంచారు. వ్యవసాయ భూమి ఎకరా రూ. 80 లక్షలు వరకు ఉండేది. దీనిని రూ. 1.10 కోట్లు చేశారు. తుమ్మపాలలో నివాస ప్రాంతాల్లో గజం రూ. 7,500 నుంచి రూ. 9 వేలు, వాణిజ్య ప్రాంతాల్లో రూ.7,500 నుంచి రూ.10 వేలు, వ్యవసాయ భూమి విలువ రూ. 32 లక్షల నుంచి రూ. 48 లక్షలకు పెంచారు. కశింకోటలో నివాస ప్రాంతాలకు సంబంధించి రూ. 6 వేల నుంచి రూ. 8 వేలు, వాణిజ్య ప్రాంతాల్లో రూ. 7 వేల నుంచి రూ. 10 వేలకు,  వ్యవసాయ భూమిని రూ. 32 లక్షల నుంచి రూ. 48 లక్షలకు పెంచారు.

అనకాపల్లి, పిసినికాడ, బవులవాడ, తుమ్మపాల, కొత్తూరు, సంపతిపురం, ఉగ్గినపాలెం, కశింకోట, తాళ్లపాలెం, బయ్యవరం, తోటాడ, నాగులాపల్లి, నాగవరం, మునగపాక ప్రాంతాల్లో 30 శాతం మార్కెట్‌ భూముల ధరలను పెంచారు. గత రెండురోజులుగా సర్వర్‌ పనిచేయకపోవడంతో బుధవారం ఒకేరోజు అనకాపల్లిలో 210 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని