logo

కౌలు రైతు ప్రాణాన్ని మింగేసిన విద్యుత్తు తీగ

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం..భార్య పక్షవాతంతో బాధ పడుతున్నారు.. సొంత వ్యవసాయ భూమి కూడా లేదు...కౌలుకు తీసుకున్న భూమి నుంచి వస్తున్న ఫలసాయమే ఆధారం..

Published : 24 Mar 2023 04:51 IST

పెంటపాడు, న్యూస్‌టుడే : రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం..భార్య పక్షవాతంతో బాధ పడుతున్నారు.. సొంత వ్యవసాయ భూమి కూడా లేదు...కౌలుకు తీసుకున్న భూమి నుంచి వస్తున్న ఫలసాయమే ఆధారం.. అలాంటి పేద కౌలు రైతును విధి విద్యుత్తు తీగ రూపంలో బలి తీసుకున్న విషాద ఘటన  పెంటపాడు శివారున ఉన్న పొలంలో చోటు చేసుకుంది. పెంటపాడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా..పెంటపాడులోని కూనాకరపేటకు చెందిన తాడి దానిరెడ్డి (59) మూడెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. అతని భార్య సోమలక్ష్మి పక్షవాతంతో బాధ పడుతూ ఇంటికే  పరిమితమయ్యారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా..వారికి వివాహాలు అయిపోయాయి. బుధవారం రాత్రి  వరి చేనుకు నీరు పెట్టేందుకు దానిరెడ్డి పొలానికి వెళ్లగా..అక్కడ ఎల్‌టీ లైను నుంచి తెగిన తీగపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. అక్కడికక్కడే మృతి చెందారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై ఏఎస్సై కొప్పిశెట్టి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని