logo

Road Accident: రక్తమోడుతూ.. భర్త ఒడిలో కన్నుమూసి

అతివేగంగా దూసుకెళుతున్న కారు ముందున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో మహిళ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడగా బైకు నడుపుతున్న ఆమె భర్తకు గాయాలయ్యాయి.. భార్యను కాపాడుకోవాలనే తాపత్రయంతో

Updated : 07 May 2022 08:39 IST

జయమ్మను పట్టుకొని విలపిస్తున్న శ్రీనివాస్‌

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: అతివేగంగా దూసుకెళుతున్న కారు ముందున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో మహిళ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడగా బైకు నడుపుతున్న ఆమె భర్తకు గాయాలయ్యాయి.. భార్యను కాపాడుకోవాలనే తాపత్రయంతో గాయాలతోనే ఆమె వద్దకు చేరి ఒడిలోకి తీసుకుని జయమ్మా.. జయమ్మా.. అని అంటుండగానే.. ఆమె కన్నుమూసింది. ఈ విషాద ఘటన స్థానికులను కలిచివేసింది అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసుల కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌కి చెందిన గంగనమోని శ్రీనివాస్‌ తన భార్య జయమ్మతో కలిసి ద్విచక్ర వాహనంపై బండరావిరాలకు బయలుదేరారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మీదుగా కవాడిపల్లి గ్రామ ముఖద్వారం వద్దకు చేరుకుంటుండగా వెనుక నుంచి వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై పడిన జయమ్మ తీవ్రంగా గాయపడింది.  శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. కళ్ల ముందు రక్తమోడుతున్న భార్య జయమ్మను ఎలాగైనా కాపాడుకోవాలని శ్రీనివాస్‌ ఆమెను ఒడిలోకి తీసుకొని సపర్యలు చేయబోగా అతని చేతుల్లోనే ప్రాణాలు వదిలొంది. శ్రీనివాస్‌ను స్థానికులు వనస్థలిపురంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు కొంత దూరం దూసుకెళ్లి రోడ్డు పక్కన కాలువలోకి వెళ్లి ఆగిపోయింది. కారు డ్రైవరు పరారయ్యాడు.  కారులో తినుబండారాలు, ఖాళీ సీసా, గ్లాసులు ఉండటంతో మద్యం మత్తులోనే వాహనం నడిపి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని