Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 23 Sep 2023 16:59 IST

1.చురుగ్గా ఏర్పాట్లు.. తెలంగాణలో షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు?

ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, అందుకు అవసరమైన అన్నిచర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(CEO) వికాస్‌ రాజ్‌ తెలిపారు. 24, 25 తేదీల నుంచి సమ్మరి రివిజన్‌ ప్రారంభమైందని, అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ఈవీఎంలన్నింటినీ చెక్‌ చేశామని, అధహకారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని చెప్పారు. బీఆర్‌కే భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను సీఈవో వికాస్‌రాజ్‌ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. తెదేపా- జనసేన పొత్తుపై స్పందించిన పురంధేశ్వరి

రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తుపై పవన్‌ కల్యాణ్‌ తమ అధిష్ఠానానికి వివరిస్తారని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం తమ అభిప్రాయాలు కూడా తీసుకుంటుందని స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు రాష్ట్ర నాయకత్వం కట్టుబడి ఉంటుందన్నారు. విశాఖలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజావేదిక కూల్చివేత నుంచే రాష్ట్రంలో అరాచక పాలన మొదలైందన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ స్పందించాలి: మోత్కుపల్లి

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును రాజకీయాలకు అతీతంగా ఖండించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కోరారు.  చంద్రబాబును అరెస్టు చేసినందుకు జగన్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. హైదరాబాద్‌లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. ‘జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత. జగన్‌ను నమ్మి ఏపీ ప్రజలు పూర్తిగా మోసపోయారు. దళితులపై ఇన్ని ఘోరాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏపీ సీఎం జగన్‌ దళిత ద్రోహి. ’’ అని ఏపీ ప్రభుత్వాన్ని మోత్కుపల్లి అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  గూగుల్‌కు పోటీగా ఫోన్‌పే కొత్త యాప్‌స్టోర్‌

: ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (Phonepe) మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. యాప్‌ డెవలపర్ల కోసం ఇండస్‌ యాప్‌ స్టోర్‌ (Indus Appstore) పేరిట కొత్త వేదికను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ స్టోర్‌లో తమ అప్లికేషన్లను (యాప్స్‌) లిస్ట్‌ చేయాలని డెవలపర్లను కోరింది. 12 స్థానిక భాషల్లో ఈ యాప్‌ స్టోర్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం యాప్‌ స్టోర్ల విషయంలో గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ గుత్తాధిపత్యం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఫోన్‌పే వాటికి సవాల్‌ విసిరేందుకు సిద్ధమైంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. పన్నూ వార్నింగ్ ఇస్తే.. కేంద్రం షాకిచ్చింది: ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ

కెనడా- భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ (Canada India relations)..కెనడాలోని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun)కు భారత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పంజాబ్‌లోని అతడి ఇల్లు, భూమిని జాతీయ దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. అమృత్‌సర్‌ శివారులోని పన్నూ పూర్వీకుల గ్రామమైన ఖాంకోట్‌లో ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమిని, చండీగఢ్‌లోని ఇంటిని దర్యాప్తు సంస్థ(NIA) స్వాధీనం చేసుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. స్టాలిన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆర్గాన్‌ డోనర్స్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

తమిళనాడులోని స్టాలిన్‌(Stalin) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవ దాతలకు ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవ దానం విషయంలో తమిళనాడు (Tamil Nadu) దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు. మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలని కోరారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్‌.. వెల్లడించిన రైల్వే మంత్రి

వచ్చే ఆరునెలల్లో దేశంలో తొలి హైస్పీడ్‌ ట్రైన్‌(High Speed Train) అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. గుజరాత్‌ (Gujarat)లోని అహ్మదాబాద్‌- సనంద్‌ (Ahmedabad to Sanand) మధ్య ఇది నడుస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని సనంద్‌లో సెమీకండక్టర్‌ కంపెనీ మైక్రాన్‌ ప్లాంట్‌ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఆ స్టేషన్‌లో వందే భారత్ రైళ్లు కూడా ఆగుతాయని చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8.  చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. జాగ్రత్త : నిక్కీహేలీ కీలక వ్యాఖ్యలు

 ‘అమెరికాకు (America) మాత్రమే కాదు యావత్‌ ప్రపంచం మొత్తానికి చైనా (China) పెద్ద ముప్పుగా ఉంది. ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి’ అని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ (Nikki Haley) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం న్యూహ్యాంప్‌షైర్‌లో ఏర్పాటు చేసిన ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఈ హెచ్చరికలు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.  వివేక్‌ రామస్వామితో డిన్నర్‌ ఆఫర్‌.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!

రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల నిర్వహించిన జీవోపీ పోల్స్‌లో ఆయన రెండో స్థానంలో ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలోనే వివేక్‌ ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం పలువురు సిలికాన్‌ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొచ్చారు. వివేక్‌ రామస్వామి ప్రత్యేక అతిథిగా ఈ నెల 29న ఓ విందు (Intimate Dinner)కు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 50 వేల డాలర్లు ఆపైనే చెల్లించాల్సి ఉంటుందట. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. ముందు ఈ మూడు పనులు చేయండి.. పాక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్‌

 అంతర్జాతీయ వేదికలపై భారత్‌(India)పై విషంకక్కి.. దాయాది దేశం పాకిస్థాన్‌(Pakistan) ప్రతిసారి అబాసుపాలవుతూనే ఉంటుంది. మన దౌత్యవేత్తల చేతిలో గట్టి దెబ్బలు తింటున్నా.. దాని వైఖరిలో మాత్రం మార్పు కనిపించదు. తాజాగా న్యూయార్క్‌లో ఐరాస 78వ సర్వ ప్రతినిధి సమావేశాల్లో మాట్లాడుతూ.. పాకిస్థాన్‌ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి మనదేశం గట్టి కౌంటర్ ఇచ్చింది. పాక్‌ చేయాల్సిన మూడు పనుల గురించి చెప్పింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని