Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Mar 2023 13:08 IST

1. రెయిడ్స్‌కు ముందు.. తర్వాత.. కవితకు మద్దతుగా పోస్టర్లు.. ఫ్లెక్సీలు..

ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఈడీ విచారణకు హాజరవుతుండగా ఆమెకు మద్దతుగా హైదరాబాద్‌లో పోస్టర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. భాజపాలో చేరకముందు.. చేరిన తర్వాత.. అంటూ పలువురు భాజపా నేతల ఫొటోలతో నగరంలో పలు చోట్ల ఫ్లెక్సీలు కనపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు నేతలు సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరగగానే.. కాషాయరంగు పూసుకొని భాజపాలో చేరిపోయారంటూ ఫ్లెక్సీలతో విమర్శలు కురుస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇన్ఫోసిస్‌కు మరో కీలక ఉద్యోగి గుడ్‌బై..

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ (Infosys) నుంచి నెలల వ్యవధిలో మరో ఉన్నతాధికారి వైదొలిగాడు. సంస్థ ప్రెసిడెంట్‌ మోహిత్‌ జోషీ (Mohit Joshi) తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి కంపెనీ శనివారం సమాచారమిచ్చింది. ‘‘ఇన్ఫోసిస్‌ అధ్యక్షుడు మోహిత్‌ జోషీ నేడు రాజీనామా చేశారు. మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉండనున్నారు. జూన్‌ 9, 2023.. కంపెనీలో ఆయన చివరి పనిదినం’’ అని సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మద్యం కుంభకోణం కేసు.. ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆమెతో పాటు ఆమె భర్త అనిల్‌, న్యాయవాదులు ఉన్నారు. తుగ్లక్‌ రోడ్‌లోని కేసీఆర్‌ నివాసం నుంచి 10 వాహనాల కాన్వాయ్‌లో బయలుదేరి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం తన పిడికిలి బిగించి అభివాదం చూస్తూ కవిత ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. కవితకు మద్దతుగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఈడీ కార్యాలయానికి వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్ర సృష్టిస్తాడు: దాదా

బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో భారత టాప్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ రికార్డుల మీద రికార్డులు తన ఖాతాలో వేసుకుంటున్నాడు. తాజాగా నాలుగో టెస్టులో ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్‌ (113).. బోర్డర్‌ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.  నాథన్‌ లయన్‌ 26 టెస్టుల్లో 113 వికెట్లు తీయగా.. అశ్విన్‌ కేవలం 22 టెస్టుల్లోనే పడగొట్టాడు. ఈ క్రమంలో అశ్విన్‌ ప్రదర్శనపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టెస్టు క్రికెట్‌లో అశ్విన్‌ చరిత్ర సృష్టిస్తాడని వ్యాఖ్యానించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి ‘చాట్‌జీపీటీ’ పరిష్కారం.. ఏం చెప్పిందంటే..?

సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT) గురించి రోజుకో వార్త వైరల్‌ అవుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Artificial Intelligence)తో పనిచేసే ఈ టూల్‌.. ఎలాంటి ప్రశ్నకైనా ఆసక్తికర బదులిస్తోంది. దీంతో చాట్‌జీపీటీ(ChatGPT)తో పలువురు సంభాషణలు జరిపి, సమాధానాలు రాబడుతున్నారు. తాజాగా భారత విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి వికాస్‌ స్వరూప్‌ కూడా ఈ జాబితాలో చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నా లైఫ్‌ ఛేంజింగ్‌ మూమెంట్‌.. ఆమెను కలిసిన క్షణమే..!

పరుగుల రారాజు విరాట్‌ కోహ్లీ(Virat kohli) , బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka sharma) జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ జోడీకి ఇటు క్రికెట్, అటు సినిమా ప్రపంచంలో ఫుల్‌ క్రేజ్‌ ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా వీరిద్దరు ఒకరిపైఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకుంటుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. అనుష్కను కలిసిన క్షణం తన జీవితమే మారిపోయిందన్నాడు విరాట్‌. అలాగే తన తండ్రి దూరమైన తర్వాత తనలో వచ్చిన మార్పును వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కాఫీకి వెళ్తే రూమ్‌కి రమ్మన్నాడు.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై విద్యాబాలన్‌ వైరల్‌ కామెంట్స్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌పై బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ (Vidya Balan) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలనుకున్నాడని ఆమె ఆరోపించింది. తెలివిగా వ్యవహరించి అతడి బారి నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించింది. ‘‘అదృష్టవశాత్తు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఊబిలో నేను చిక్కుకోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందే.. ఇక్కడ పరిస్థితులు భయానకంగా ఉంటాయని చాలామంది నాకు కథలు కథలుగా చెప్పారు. అందుకే నా తల్లిదండ్రులు భయపడి నన్ను సినిమాల్లో పంపించడానికి అంత ఇష్టపడలేదు’’ అని విద్యాబాలన్‌ తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘టిక్‌టాక్‌’ ఏం చేస్తోంది.. దానిపై నిషేధాలు ఎందుకు?

టిక్‌టాక్‌.. చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమం(social media) మొత్తం ఆధునిక సమాజాన్ని షేక్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి 100 కోట్లకు పైగా యూజర్లున్నారు(users). ఇటీవలి కాలంలో అమెరికా(america), యూరప్‌, కెనడా తదితర దేశాల్లో టిక్‌టాక్‌కు అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రజా ప్రతినిధులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. షార్ట్‌ వీడియో యాప్‌(app)గా ప్రజల్లో ఆదరణ పొందిన టిక్‌టాక్‌(TikTok) మాతృసంస్థ చైనీస్‌ కంపెనీ బైట్‌డాన్స్‌(bytedance)కు చెందినది కావడమే ఆ దేశాల అందోళనకు అసలు కారణం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మీరు నన్ను జైల్లో ఇబ్బంది పెట్టగలరు.. అంతే..!

మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన దిల్లీ(Delhi) మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా(Manish Sisodia) ప్రస్తుతం ఈడీ(ED)  కస్టడీలో ఉన్నారు. తాజాగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.  జైల్లో పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని వ్యాఖ్యానించారు. ‘సర్.. మీరు నన్ను జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టగలరు. కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిషర్లు కూడా స్వాతంత్ర్య సమరయోధులను ఇబ్బందులకు గురిచేశారు. వారి స్థైర్యాన్ని కదిలించలేకపోయారు’ అని సిసోదియా ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వేణూ.. మాకు షాక్‌ ఇస్తే ఎలా?: చిరంజీవి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘బలగం’ (Balagam). వేణు టిల్లు (Venu) దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) శనివారం ఉదయం ‘బలగం’ టీమ్‌ను ప్రశంసించారు. తన తదుపరి చిత్రం ‘భోళా శంకర్‌’ సెట్‌లో ‘బలగం’ టీమ్‌ను కలిసిన ఆయన చిత్రబృందాన్ని సన్మానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని