Aditya-L1: ఒకే ఫ్రేమ్‌లో భూమి-చంద్రుడు.. ఆపై ఆదిత్య-ఎల్‌ 1 సెల్ఫీ..!

Aditya-L1: భూమి, చంద్రుడు ఒకే ఫ్రేమ్‌లో కన్పించాయి. ఈ అద్భుత దృశ్యాన్ని ఆదిత్య-ఎల్‌1 క్లిక్‌మనిపించింది. వాటిని సామాజిక మాధ్యమంలో ఇస్రో పంచుకొంది. 

Updated : 07 Sep 2023 12:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సూర్యుడిపై అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే భానుడి దిశగా పయనిస్తోన్న మన ఆదిత్య ఓ సారి పుడమి (Earth)ని చూసి మురిసి పోయింది. ఈ సమయంలోనే తొంగి చూస్తున్నట్లు చందమామ (Moon) కూడా కనిపించాడు. ఆ దృశ్యాన్ని క్లిక్‌ మనిపించి పనిలో పనిగా నేను క్షేమమే అన్నట్లు ఓ సెల్ఫీ కూడా తీసుకొని ఇస్రో (ISRO)కు పంపింది. ఆ అద్భుత దృశ్యాలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేసింది.

సెప్టెంబరు 4వ తేదీన ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1)లోని కెమెరా ఈ సెల్ఫీ తీసినట్లు ఇస్రో (ISRO) వివరించింది. ఈ స్వీయ చిత్రంలో ఆదిత్య-ఎల్‌ 1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (VELC), సోలార్‌ ఆల్ట్రావయోలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌ (SUIT) కన్పించాయి. దీంతో పాటు భూమి, చంద్రుడు ఒకేసారి కన్పించిన దృశ్యాలను కూడా ఆదిత్య-ఎల్‌ 1 క్లిక్‌మనిపించింది. ఈ చిత్రాలతో కూడిన వీడియోను ఇస్రో సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. ‘‘భూమి-సూర్యుడి మధ్యలోని లగ్రాంజ్‌ పాయింట్‌ (L1 point)కు ప్రయాణంలో ఆదిత్య-ఎల్‌ 1 వీక్షించిన దృశ్యాలివి’’ అని ఇస్రో రాసుకొచ్చింది.

జాబిల్లిపైకి దూసుకెళ్లిన జపాన్‌ ‘స్లిమ్‌’.. ల్యాండింగ్‌ ఎప్పుడంటే..?

ఆదిత్య-ఎల్‌ 1లోని విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కరోనాగ్రాఫ్‌ (VELC).. సూర్యుడి కరోనా, స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయనుంది. ఇక SUIT.. ఫొటోస్పియర్‌, క్రోమోస్పియర్‌ను పరిశీలించనుంది. సెప్టెంబరు 2న ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది. ఇటీవలే రెండోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 282కి.మీ X 40,225 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబరు 10న చేపట్టనున్నారు.

ఆదిత్య-ఎల్‌ 1 (Aditya-L1) ఉపగ్రహం నాలుగు నెలలపాటు ప్రయాణించి భూమి నుంచి సూర్యుడి దిశగా ఉన్న ‘ఎల్‌1’ (లగ్రాంజ్‌) పాయింట్‌ను చేరుకోనుంది. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రదేశంలోకి భారత్‌ చేరుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఈ ప్రదేశం నుంచి ఎలాంటి అవరోధాల్లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసే వీలుంది. ఇందులో ఏడు రకాల పరిశోధన పరికరాలున్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటో స్పియర్‌, క్రోమోస్పియర్‌ సహా వెలుపల ఉండే కరోనానూ అధ్యయనం చేస్తాయి. సౌర జ్వాలలు, సౌర రేణువులు, అక్కడి వాతావరణం గురించి ఎన్నో అంశాలను శోధిస్తాయి. వీటి వల్ల సౌర తుపానుల నుంచి అంతరిక్షంలోని ఉపగ్రహాలు, ఇతర పరిశోధనాశాలలను కాపాడుకోవడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని