Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్

ధోని (MS Dhoni) నాయకత్వ ప్రతిభను ప్రశంసిస్తూ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ధోనికి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. 

Published : 31 May 2023 01:19 IST

ముంబయి: ఐపీఎల్‌ 16 (IPL 2023) సీజన్‌ విజేతగా అవతరించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) జట్టుపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. సీజన్‌ ప్రారంభంలో ఏ మాత్రం అంచనాల్లేకుండా బరిలోకి దిగిన డాడీస్‌ ఆర్మీ.. ధోనీ (MS Dhoni) నాయకత్వ ప్రతిభతో ట్రోఫీని గెలుచుకుంది. దీంతో ధోనీ నాయకత్వ ప్రతిభను మెచ్చుకుంటూ ఆటగాళ్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ధోనీ నాయకత్వంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) చేసిన ట్వీట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ధోనిని భవిష్యత్తు నాయకుడిగా అభివర్ణిస్తూ.. రాజకీయాలపై దృష్టి సారించాలని మహీంద్రా సూచించారు. 

‘‘ఐపీఎల్‌లో ఎంఎస్‌ ధోనీ మరో ఏడాది కూడా ఆడితే చూడాలనుకునే వారిలో నేను ఒకడిని. అయితే, ఎక్కువ కాలం అలా జరగాలని ఆశించలేం. ధోనీ రాజకీయాల గురించి కూడా ఆలోచన చేస్తాడని నమ్ముతున్నా. ఎన్‌సీసీ (NCC) సమీక్ష ప్యానెల్‌లో భైజయంత్‌ పాండా (భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు), ధోనీతో కలిసి నేను పనిచేశాను. క్రీడారంగంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఇతర విషయాల్లో కూడా ధోనీ అంతే చురుగ్గా వ్యవహరిస్తాడు. ఇతరులతో సులువుగా కలిపోయే మనస్తత్వం, ఎంతో వినయశీలి, వినూత్నంగా ఆలోచిస్తాడు. కచ్చితంగా అతను భవిష్యత్తు నాయకుడు’’ అని మహీంద్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఈ ట్వీట్‌ చూసిన నెటిజన్లు ధోనీకి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ‘‘ధోనీ 2024, 2025 ఐపీఎల్‌ కూడా ఆడాలని’’, ‘‘ఐపీఎల్‌ అభిమానులారా.. ఆటలో ధోనీ గురించి మర్చిపోండి. ఇకపై సరికొత్త ధోనీని చూడాలని ఆశిద్దాం’’ అంటూ ట్వీట్లు చేశారు. ఐపీఎల్‌ 16 ధోనీకి చివరి సీజన్‌ అని గత కొంత కాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై సామాజిక మాధ్యమాల్లో మరోసారి చర్చ మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు