Chandrayaan-3: భారత్‌ మరో విజయం.. జాబిల్లి కక్ష్య నుంచి భూ కక్ష్య దిశగా ప్రొపల్షన్‌ మాడ్యుల్‌..!

చంద్రయాన్‌-3లో భారత్‌ మరో విజయం అందుకునేందుకు ముందడుగు వేసింది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా భూకక్ష్య వైపు మళ్లించింది.

Updated : 05 Dec 2023 20:02 IST

ఇంటర్నెట్‌డెస్క్: చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఇటీవల చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టు అనుకున్న దాని కంటే అధిక ఫలితాలను భారత్‌కు అందించినట్లైంది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రో ట్వీట్‌ చేసింది. కక్ష్య పొడిగింపు, ట్రాన్స్‌ ఎర్త్‌ ఇంజెక్షన్‌ విన్యాసాలతో దీనిని పూర్తిచేసినట్లు వెల్లడించింది.

కాస్త తేరుకున్న చెన్నై.. ఎయిర్‌పోర్టులో రాకపోకల పునరుద్ధరణ

భారత్‌ ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ మార్గాన్ని తెలివిగా ప్లాన్‌ చేయడంతో.. దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది. దీనిని వాడుకొని మరికొన్ని పరిశోధనలు పూర్తిచేశారు. అనంతరం చంద్రుడి కక్ష్య నుంచి దీని మార్గాన్ని భూకక్ష్య వైపు మళ్లించారు. దీనిపై ఉన్న SHAPE పేలోడ్‌ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్‌లోకి ప్రవేశించే సమయంలో, దిగువ కక్ష్యలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా అక్టోబర్‌లోనే పక్కగా ప్లాన్‌ చేశారు.

చంద్రయాన్‌-3లోని మూడు ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కూడా ఒకటి. ఇది కాకుండా ల్యాండర్‌ మాడ్యుల్‌, రోవర్‌ ఉన్నాయి. ఇక ప్రొపల్షన్‌ మాడ్యుల్‌తో ల్యాండర్‌ మాడ్యుల్‌ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్‌ మాడ్యుల్‌ను చంద్రుడికి 100 కి.మీ. సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యుల్‌ విడిపోయింది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కొన్ని నెలల పాటు కక్ష్యలోనే ఉంది. దీనిలోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి శాస్త్రవేత్తలకు పంపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని