Delhi Mayor Polls: దిల్లీ మేయర్‌ ఎన్నికపై సుప్రీం కీలక వ్యాఖ్య

దిల్లీ మేయర్(Delhi Mayor) ఎన్నిక మరోసారి వాయిదా పడింది. దీనికి సంబంధించిన కేసును శుక్రవారం విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. 

Published : 13 Feb 2023 17:44 IST

దిల్లీ: దిల్లీ మేయర్(Delhi Mayor) ఎన్నిక వరుసగా వాయిదా పడుతూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు ఈ ఎన్నిక ప్రక్రియకు ఆటంకం కలగగా.. మరోసారి వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ(AAP) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించగా.. దీనిపై శుక్రవారం విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించింది. దాంతో గురువారం జరగాల్సిన ఎన్నిక మరోసారి వాయిదాపడినట్లైంది. ఈ కేసును విచారణకు స్వీకరిస్తూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కీలకవ్యాఖ్య చేసింది. ‘నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు లేదని చట్టంలో స్పష్టంగా ఉంది’ అని పేర్కొంది.

గత డిసెంబర్‌లో జరిగిన దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్(MCD Polls) ఎన్నికలో ఆప్‌ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి.. 134 స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ ప్రకారం మేయర్‌ పదవి ఆప్‌కే దక్కే అవకాశాలు ఉంటాయి. కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమయ్యింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదంటూ ఆప్‌(AAP)వ్యతిరేకిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

మేయర్‌ను ఎన్నుకునేందుకు జనవరి 6, జనవరి 24, ఫిబ్రవరి 6న కౌన్సిలర్లు సమావేశమయ్యారు. కానీ, మేయర్‌ ఎన్నికలో నామినేటెడ్‌ సభ్యులు (Aldermen) ఓటు వేసేందుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇవ్వడంపై ఆప్‌ అభ్యంతరం వ్యక్తం చేయడం..సభలో గందరగోళం నెలకొనడం.. వాయిదా పడటం.. గత మూడుసార్లు ఇదే జరిగింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని